కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న యూనిఫాం సివిల్ కోడ్ (ఉమ్మడి పౌర స్మృతి) బిల్లును ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యతిరేకించారు. దేశంలో అభివృద్ధిని పట్టించుకోకుండా, ప్రజల్లోని వివిధ వర్గాల మధ్య కేంద్ర ప్రభుత్వం చిచ్చు పెడుతూ ఉందని, తాజాగా యూనిఫామ్ సివిల్ కోడ్ పేరుతో మళ్లీ దేశ ప్రజలను విడగొట్టడానికే మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. మన దేశంలో విభిన్న ప్రాంతాలు, జాతులు, మతాలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతులు కలిగి ఉన్నాయని, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ ప్రపంచానికి ఆదర్శంగా ఉందని అన్నారు. అలాంటి భారత ప్రజల ఐక్యతను చీల్చడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను తాము నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తామని అన్నారు. అందులో భాగంగానే యూనిఫాం సివిల్ కోడ్ బిల్లును వ్యతిరేకిస్తున్నామని కేసీఆర్ తేల్చి చెప్పారు.


సోమవారం ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు ఖాలీద్ సయీఫుల్లా రెహ్మాని ఆధ్వర్యంలో బోర్డు కార్యవర్గం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ భేటీలో ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే అక్భరుద్దీన్ ఒవైసీ, మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్‌ తదితర సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. యూసీసీ బిల్లు తీసుకురావడంలో దురుద్దేశం ఉందని అన్నారు. దేశంలో ఎన్నో సమస్యలు పెండింగ్ లో ఉండగా, ఇప్పుడు ఈ బిల్లు తేవడం ఎందుకని ప్రశ్నించారు. గత 9 ఏళ్లుగా దేశ ప్రజల అభివృద్ధిని ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. అవసరమైన వాటిని పట్టించుకోకుండా ప్రజల్ని రెచ్చగొట్టి అనవసరమైన గొడవలు పెట్టడం, రాజకీయ పబ్బం గడుపుకోవడం బీజేపీకి అలవాటుగా మారిందని అన్నారు. తాజాగా యూసీసీ అంటూ మరోసారి విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారని కేసీఆర్ విమర్శించారు.


యూసీసీ బిల్లుతో దేశంలో ప్రత్యేక సంస్కృతి కలిగిన గిరిజనులు, పలు మతాలు, జాతులు, ప్రాంతాలతో పాటు హిందూ మతంలో ఉన్న ప్రజలు అయోమయానికి గురవుతున్నారని సీఎం కేసీఆర్‌ అన్నారు. దేశ ప్రజల అస్థిత్వానికి వారి తరతరాల సాంప్రదాయ సాంస్కృతిక ఆచార వ్యవహారాలకు బీజేపీ ప్రభుత్వం గొడ్డలిపెట్టుగా మారిందని అన్నారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న యూసీసీ బిల్లును వ్యతిరేకించాలని కోరారు. తద్వారా దేశ ఐక్యతకు పాటు పడాలని కోరుతున్నట్లుగా చెప్పారు. అందుకే బీజేపీ తీసుకోవాలనుకుంటున్న యూసీసీ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కేసీఆర్ అన్నారు. రాబోయే పార్లమెంట్‌ సమావేశాల్లో తాము బిల్లుకు వ్యతిరేకిస్తామని సీఎం స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి పార్లమెంటు ఉభయ సభల్లో చేపట్టే కార్యాచరణకు రంగం సిద్ధం చేసుకోవాలని పార్లమెంటరీ పార్టీ నేతలు కే కేశవరావు, నామా నాగేశ్వర్ రావులకు సీఎం కేసీఆర్‌ సూచించారు. అంతే కాకుండా భావ సారూప్యత కలిగిన పార్టీలను కలుపుకుపోతామని, ఈ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడతామని చెప్పారు.


మతాలకు ప్రాంతాలకు అతీతంగా, దేశ ప్రజల సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని, దేశంలోని గంగ జమునీ తహజీబ్‌ను రక్షించడానికి ముందుకు రావాలనే తమ అభ్యర్థనను అర్థం చేసుకుని తక్షణమే స్పందించినందుకు ముస్లిం పర్సనల్ లా బోర్డు సీఎంకు ధన్యవాదాలు తెలిపింది.