CM KCR Appreciates Nikat Zareen :  ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో నిజామాబాద్ కు చెందిన నిఖత్ జరీన్ విజేత నిలవడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. గోల్డ్ మెడల్ సాధించిన జరీన్ కు సీఎం అభినందనలు తెలిపారు. భారత కీర్తి పతాకాన్ని విశ్వవేదిక మీద ఎగరేసిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ ను సీఎం కేసీఆర్ మనస్ఫూర్తిగా అభినందించారు. ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుని నిఖత్ జరీన్ బాక్సింగ్ క్రీడలో విశ్వ విజేతగా నిలవడం గర్వించదగిన విషయమని సీఎం కేసీఆర్ అన్నారు. క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నదన్నారు. తెలంగాణలోని ప్రతీ గ్రామంలో గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటుచేసి, యువ క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సీఎం కేసిఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. 2014లో నిఖత్ జరీన్ కు తెలంగాణ ప్రభుత్వం రూ.50 లక్షల నగదు ప్రోత్సాహకం ఇచ్చింది.






నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత నిఖత్ జరీన్ కు అభినందనలు తెలిపారు. నిజామాబాద్ బిడ్డ ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ గెలవడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు కవిత ట్వీ్ట్ చేశారు. 






వరల్డ్ ఛాంపియన్ షిప్స్ విజేతగా నిఖత్ జరీన్


భారత మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ మహిళల వరల్డ్ ఛాంపియన్ షిప్స్ విజేతగా నిలిచింది. ఈ విజయం వెనక 12 సంవత్సరాల కృషి ఉంది. నిఖత్ జరీన్ ఒక్క విజయంతో తన కుటుంబాన్ని మాత్రమే కాకుండా మొత్తం దేశాన్నే గర్వపడేలా చేసింది. సాధారణ సంప్రదాయ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నిఖత్ తన చరిత్రను తనే రాసుకుంది. నిఖత్‌కు తల్లిదండ్రుల నుంచి మంచి సపోర్ట్ లభించింది. నిఖత్ తండ్రి మహ్మద్ జలీల్ అహ్మద్, తల్లి పర్వీన్ సుల్తానా కూతురికి కావాల్సినవన్నీ సమకూర్చారు. మొత్తం నలుగురు కూతుర్లలో నిఖత్ జరీన్ మూడో అమ్మాయి.


నిఖత్ జరీన్ యాటిట్యూడ్ చూసిన బాక్సింగ్ ట్రైనర్ శంషుద్దీన్ తను ఈ గేమ్‌కు సరైన ఫిట్ అని భావించాడు. 13 సంవత్సరాల వయసు నుంచి నిఖత్ బాక్సింగ్ ట్రైనింగ్ ప్రారంభించింది. ఆరు నెలల్లోపే స్టేట్ ఛాంపియన్ షిప్‌లో బంగారు పతకం సాధించింది. పంజాబ్‌లో జరిగే రూరల్ నేషనల్స్‌కు ఎంపికైంది. ఆ తర్వాత మూడు నెలల్లోనే నిఖత్ బెస్ట్ బాక్సర్‌గా మారింది. సబ్ జూనియర్ నేషనల్స్‌లో కూడా బంగారు పతకం ఉంది. అనంతరం నిఖత్ విశాఖపట్నంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా క్యాంపులో చేరింది. అక్కడ తనకు ద్రోణాచార్య ఐ.వెంకటేశ్వర రావు శిక్షణ ఇచ్చారు. ఎనిమిది నెలల ట్రైనింగ్ తర్వాత 2011 వరల్డ్ జూనియర్, యూత్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించింది. 2014లో నిఖత్ కుటుంబానికి తెలంగాణ సీఎం కేసీఆర్ రూ.50 లక్షల ప్రోత్సాహకాన్ని అందించారు. అయితే ఆ తర్వాత అంతర్జాతీయ పతకాలు గెలిచినా ప్రభుత్వం ఎటువంటి బహుమతులూ ఇవ్వలేదు. ప్రస్తుతం తనకు 25 సంవత్సరాలే కాబట్టి తను బాక్సింగ్‌లో మరిన్ని ఉన్నత శిఖరాలు అందుకునే అవకాశం ఉంది.