Mlc Kavitha On BJP : ఎన్నికలు ఉన్న రాష్ట్రాల్లో మోదీ కన్నా ముందు సీబీఐ, ఈడీ వస్తాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. దేశవ్యాప్తంగా భావసారుప్యత ఉన్న ప్రతిపక్ష పార్టీలను బీఆర్ఎస్ పార్టీ ఐక్యం‌ చేస్తుందన్నారు. బీజేపీ ఎలాంటి అవినీతికి, అక్రమాలకు పాల్పడకపోతే అదానీ కుంభకోణంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. చెన్నైలో ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక నిర్వహించిన '2024 ఎన్నికలు- ఎవరు విజయం సాధిస్తారు?' అనే అంశంపై జరిగిన చర్చా కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. హామీలు అమలుచేయడంలో విఫలమై, భారతదేశం పేరు అంతర్జాతీయ స్థాయిలో మసకబారేందుకు కారణమైన బీజేపీ 2024లో గెలిచే అవకాశాలు ఏమాత్రం లేవన్నారు.  


అదానీ వ్యవహారంపై జేపీసీ ఎందుకు వేయడంలేదు? 


పారదర్శకత, నిబద్ధతతో పాలన అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ రెండు సార్లు అధికారంలో ఉండి చెప్పిన వాటిని పాటించలేదని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. మోదీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపి కొత్తవారికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. గత పదేళ్లలో ప్రధానిగా మోదీ ఏం చేశారని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారి దేశవ్యాప్తంగా భావసారుప్యత ఉన్న ప్రతిపక్ష పార్టీలను ఐక్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. 2014లో  11 కోట్ల 47 లక్షల మందికి పీఎం కిసాన్ పథకం ఇస్తామని ప్రారంభించి ఈ ఏడాది కేవలం 3 కోట్ల 80 లక్షల రైతులకు మాత్రమే ఇచ్చారని, కానీ ఈ ఏడాది కూడా 11 కోట్ల మంది రైతులకు పథకం అమలు చేశామని ప్రధాని మోదీ పార్లమెంటులో అబద్ధాలు చెప్పారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.  నిజామాబాద్ పార్లమెంటులోనే 50 వేలకు పైగా రైతులను కేంద్ర కిసాన్ పథకం నుంచి తొలగించారన్నారు. దేశవ్యాప్తంగా 8 కోట్ల కుటుంబాలు తాగునీరు ఇస్తున్నామని చెప్పిన మోదీ, రాజ్యసభలో మాత్రం 11 కోట్ల కుటుంబాలకు ఇస్తున్నామని అసత్యాలు చెప్పారన్నారు. పార్లమెంటులో గంటన్నర సేపు మాట్లాడిన ప్రధాని మోదీ , అదానీ కుంభకోణంపై ఎందుకు మాట్లాడలేదని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. బీజేపీ ఎలాంటి అవినీతికి, అక్రమాలకు పాల్పడకపోతే, అదానీ కుంభకోణంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఎందుకు వేయడం లేదని, అక్రమాలకు పాల్పడ్డ కంపెనీని ఎందుకు రక్షిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.


మోదీ కన్నా ముందు సీబీఐ, ఈడీ 


తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారుల సంఖ్యను పెంచుతుంటే, బీజేపీ ప్రభుత్వం మాత్రం తగ్గిస్తుందన్నారు. సాక్షాత్తు ప్రధాని మోదీ అసత్యాలు చెప్పి, ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు ఎమ్మెల్సీ కవిత. యువత ప్రధాని మోదీ ప్రసంగాన్ని విని ఎన్ని అబద్దాలు ఉన్నాయో చూడాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం, ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. ప్రధాని మోదీ కోరిక మేరకు తనతో పాటు  బీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎంపీలు, ఐదుగురు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేల ఇళ్లకు సీబీఐ, ఈడీ వచ్చాయన్నారు. తాను ఏ తప్పు చేయలేదని, మెజారిటీ ప్రతిపక్ష నాయకులు సైతం ఎలాంటి తప్పు చేయలేదని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాల్లో మోదీ వచ్చే ముందు సీబీఐ, ఈడీ వస్తాయని ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు.  ప్రధాని మోదీ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ఎమ్మెల్సీ కవిత చేసిన ప్రసంగానికి సభకు హాజరైన సభ్యులు హర్షధ్వానాలతో అభినందించారు.