CCTV cameras in Anganwadi centres: హైదరాబాద్: అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, బయోమెట్రిక్ హాజరు ఉండేలా చూడాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత శాఖ అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. అంగన్వాడీల్లో గర్భిణీలు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు.


లబ్ధిదారులకు పౌష్టికాహారం అందేలా చర్యలు 
అంగన్వాడీల్లో పౌష్టికాహారం దుర్వినియోగం జరగకుండా లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అందుకోసం అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, బయోమెట్రిక్ విధానం ఏర్పాటును పరిశీలించాలని సూచించారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణాలపై దృష్టిసారించాలని సీఎం రేవంత్ పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలను మొదటి ప్రాధాన్యతగా తీసుకుని భవన నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొబైల్ అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుపై అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.


అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పౌష్టికాహార లోపం, రక్తహీనతతో రాష్ట్రంలో గర్బిణులు, బాలింతలు,  చిన్నారులు అనారోగ్యం పాలవుతున్నట్లు ఎన్హెచ్ఎఫ్ఎస్ వెల్లడించిన గణాంకాలు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. ఆరోగ్య ప్రమాణాలు పెరగాల్సింది పోయి, దిగజారటం సరైంది కాదని అన్నారు. అందుకే అంగన్ వాడీ కేంద్రాల ద్వారా పౌష్ఠికాహారం అసలైన లబ్ధిదారులకు అందుతుందా.. లేదా పక్కాగా అధికారులు పర్యవేక్షించాలని సీఎం సూచించారు. కేవలం రికార్డుల్లో రాసుకొని పౌష్ఠికాహారం దుర్వినియోగం జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 35 వేల అంగన్ వాడీ కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు, వాటి పరిధిలో  బయోమెట్రిక్ విధానం ఏర్పాటు చేయాలని సూచించారు. ఆడిటింగ్ వీలుండేలా అన్ని రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపరచాలని చెప్పారు. 


జీహెచ్ఎంసీ పరిధిలో జనాభాకు సరిపడే అంగన్వాడీ కేంద్రాలు లేనందున, మొబైల్ అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే చర్చించారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేసి పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టాలని సీఎం సూచించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆరు నెలలకోసారి ప్రత్యేక వారోత్సవం నిర్వహించి విస్తృతంగా ప్రచారం చేపట్టాలన్నారు. పాఠశాల స్థాయి నుంచే శానిటరీ నాప్కిన్స్ వినియోగంపై బాలికలకు అవగాహన కల్పించి, నాప్కిన్స్ పంపిణీ చేయాలని చర్చ జరిగింది. విద్యాశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ సమన్వయంతో ఈ కార్యక్రమం చేపట్టాలని చెప్పారు. 


రాష్ట్రంలో ఉన్న వాటిలో ఇప్పటికే 12315 అంగన్ వాడీ కేంద్రాలు  అద్దె భవనాల్లో ఉన్నాయి. వీటికి  సొంత భవనాలను నిర్మించే ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రమంతటా ఎక్కడ చూసినా ఒకే  డిజైన్తో అంగన్వాడీ కేంద్రాల బ్రాండింగ్ ఉండాలని సీఎం రేవంత్ పలు సూచనలు చేశారు. అవసరమైతే ఆరేండ్ల లోపు చిన్నారులకు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ను అంగన్వాడీ కేంద్రాల్లోనే అందించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని  సూచించారు. 


దివ్యాంగులకు రిజర్వేషన్ల అమలు.. 
దివ్యాంగులకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. చట్ట ప్రకారం ఉద్యోగాల్లో 4 శాతం, విద్యావకాశాల్లో 5 శాతం, అన్ని పథకాల్లో 5 శాతం రిజర్వేషన్లు అమలు కావాల్సి ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఫైలు సిద్ధం చేసి పంపించాలని ఆదేశించారు. ట్రాన్స్​ జెండర్లకు  వైద్య సదుపాయాలు అందుబాటులో లేవని, గాంధీ, ఉస్మానియా హాస్పిటల్లోనే వారికి చికిత్సలు చేస్తున్నారనే చర్చ జరిగింది. మెడికల్ కాలేజీలతో అనుసంధానంగా ఉన్న టీచింగ్ హాస్పిటల్స్ అన్నిట్లో ట్రాన్స్​ జెండర్లకు  వైద్య చికిత్సలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.