Delhi Liquor Scam Chargesheet :   ఢిల్లీ లిక్కర్ స్కాంలో  సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటును సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంది  ఈ చార్జిషీటులో పలు సంచలన విషయాలు ఉన్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులోదాదాపు 10వేల పేజీల తొలి చార్జిషీట్ లో పలు సంచలన విషయాలను  సీబీఐ పొందుపరిచింది.  ఢిల్లీ ప్రభుత్వానికి నష్టం కలిగే విధంగా.. అక్రమంగా ఆర్జించేలా ఆప్‌ నేతలు లిక్కర్‌ పాలసీని రూపొందించారు. అందులో భాగంగానే సౌత్‌గ్రూప్‌ కంపెనీ నుంచి ఆప్‌ నేతలకు కనీసం రూ.100 కోట్ల ముడుపులు అందాయని పేర్కొంది.   ఈ సౌత్ గ్రూప్‌ను   శరత్‌, మాగుంట, మరికొందరు నియంత్రించారని తెలపింది.   మనీలాండరింగ్‌ కోణంలో ఈడీ చేసిన దర్యాప్తులో ఈ విషయాలు నిర్ధారణ అయ్యాయని సీబీఐ తెలిపింది. 


ముడుపులతో దక్షిణాది వ్యాపారుల దందా ! 


ఢిల్లీ లిక్కర్ దందాను తమ గుప్పిట్లోకి తీసుకోవాలని దక్షిణాది ప్రాంతానికి చెందిన పలువురు మద్యం ఉత్పత్తిదారులు కుట్ర పన్నారని సీబీఐ ఆరోపించింది.  అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో  ఈడీ  పేర్కొన్న విషయాన్ని చార్జిషీటులో  సీబీఐ ప్రస్తావించింది. ఢిల్లీ మద్యం పాలసీలో తమకు ప్రయోజనం చేకూర్చే విధంగా మార్పులు చేయించుకునేందుకు సౌత్ గ్రూప్ కుట్ర పన్నింది. దక్షిణాది ప్రాంతానికి చెందిన మద్యం ఉత్పత్తిదారుల తరపున అభిషేక్ బోయిన్‌పల్లి ఈ వ్యవహారం నడిపినట్లు సీబీఐ చార్జిషీట్ లో తెలిపింది. అభిషేక్ బోయినపల్లి దాదాపు రూ.30 కోట్ల నగదును హవాలా మార్గంలో తరలించినట్లు చార్జిషీటులో ప్రస్తావించారు. ఆ డబ్బంతా అడ్వాన్స్‌గా 2021 జులై, సెప్టెంబర్ మధ్య కాలంలో దినేష్ అరోరా ద్వారా విజయ్ నాయర్‌ కు అందజేసినట్లు పేర్కొంది.  ఢిల్లీ ప్రభుత్వ ముఖ్యులను ప్రభావితం చేసేందుకు.. హోల్‌సేల్ దారులకు 12 శాతం లాభాలు వచ్చేలా, అందులో 6 శాతం అభిషేక్ బోయిన్‌పల్లికి తిరిగి వచ్చేలా కుట్ర చేశారని సీబీఐ చార్జిషీటులో తెలిపింది. 


ముత్తా గౌతమ్‌కు రూ.4  కోట్లుకుపైగా నగదు ! 


హోల్‌సేల్ వ్యాపారంలో వచ్చే లాభాల్లో రామచంద్రన్ పిళ్లై నుంచి బ్యాంక్ అకౌంట్స్ ద్వారా ముత్తా గౌతమ్‌కు రూ.4 కోట్లకుపైగా నగదు అందిందని  అతని అకౌంట్ నుంచి అభిషేక్ బోయిన్‌పల్లికి రూ.3.85 కోట్లు ట్రాన్స్‌ఫర్ అయినట్లుగా చార్జిషీట్ లో సీబీఐ  తెలిపింది. అంతేకా కుండా గౌతమ్‌కు చెందిన మీడియా సంస్థలకు కూడా కొంత డబ్బు బదిలీ అయిందని స్పష్టం చేసింది. మొత్తం ఏడుగురు నిందితులు   నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని సీబీఐ చార్జిషీట్ లో పేర్కొంది.  సముచితమైన మౌఖిక, డాక్యుమెంటరీ ఆధారాలను కూడా దర్యాప్తు సంస్థలు సేకరించాయని సీబీఐ ప్రత్యేక కోర్టు అభిప్రాయపడింది. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న వారిపైనా, పేర్లు లేనివారిపైనా కూడా దర్యాప్తు కొనసాగుతున్నట్లు చార్జిషీటులో వెల్లడించింది.


సీబీఐ చార్జిషీటును కోర్టు పరిగణనోకి తీసుకోవడంతో విచారణ ప్రారంభం కానుంది. ఈ కేసులో ముందు ముందు కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. 


మార్చిలోపు మారకపోతే మార్చేస్తా - వర్క్ షాప్‌లో జగన్ ఫైనల్ వార్నింగ్ ! డేంజర్ జోన్‌లో ఉన్న వారెవరంటే ?