CAG Report On Kaleshwaram : కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్‌ రిపోర్ట్‌ను అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను కాగ్‌ తప్పుబట్టింది. పీసీఎస్‌ఎస్‌ ప్రాజెక్టు అంచనా వ్యయం 38 వేల 500 కోట్లు. అయితే.. రీ-ఇంజనీరింగ్ సమయంలో కాళేశ్వరం, ప్రాణహిత ప్రాజెక్టులు రెండింటికీ కలిపి 85 వేల 651.81 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. రీ-ఇంజనీరింగ్‌ కారణంగా ఉమ్మడి ప్రాజెక్టు వ్యయం 122 శాతం మేర పెరిగిందని కాగ్‌ తెలిపింది. లక్ష్యంగా పెట్టుకున్న ఆయకట్టు 52.22 శాతం మేర మాత్రమే పెరిగిందని వెల్లడించింది.


రీ డిజైన్ తర్వాత కూడా మళ్లీ మళ్లీ మార్పులు                                     


రీ-ఇంజనీరింగ్ తర్వాత కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పరిధిలో మరిన్ని మార్పులు, చేర్పులు చేశారని కాగ్‌ తెలిపింది. ఫలితంగా కాళేశ్వరం ప్రాజెక్టు విలువ ఇప్పుడు లక్షా 47 వేల 427.41 కోట్లకు చేరిందని కాగ్‌ తన నివేదికలో వెల్లడించింది. అయితే.. లక్ష్యంగా పెట్టుకున్న ప్రయోజనాల్లో మాత్రం తదుపరి పెరుగుదల ఏమీ లేదని వివరించింది. ఆ విధంగా రెండు ప్రాజెక్టుల సంయుక్త విలువ ఇప్పుడు లక్షా 51 వేల 168.21 కోట్లుగా ఉంది.


అనేక రకాల అవకతవకలు                                         


పీసీఎస్‌ఎస్‌ ప్రాజెక్టుతో పోలిస్తే.. రీ-ఇంజనీరింగ్‌ తర్వాత లిఫ్టులను నడపడానికి అయ్యే వార్షిక విద్యుచ్ఛక్తి 5, 643.39 మిలియన్ యూనిట్ల మేర పెరిగిందని కాగ్‌ తెలిపింది. విద్యుత్ వినియోగంపై ఏటా అయ్యే ఖర్చు 3 వేల 555.34 కోట్ల మేర పెరిగిందని వెల్లడించింది. పీసీఎస్‌ఎస్‌ ప్రాజెక్టు రీ-ఇంజనీరింగ్‌, ప్రాజెక్టు పనుల్లో కొన్ని భాగాలు నిరర్ధకమయ్యాయని.. ఫలితంగా 767.78 కోట్ల రూపాయిలు నష్టం వాటిల్లిందని నివేదికలో కాగ్‌ వెల్లడించింది. ప్రాజెక్టు నుంచి ఊహించిన ప్రయోజనాలను ఎక్కువ చూపెట్టారని కాగ్ రిపోర్ట్ తెలిపింది. ప్రాజెక్టు వార్షిక ఖర్చులు తక్కువ చూపారని, కాళేశ్వరం ప్రాజెక్ట్ నీటి అమ్మకం ద్వారా రూ.1019కోట్ల ఆదాయాన్ని అంచనా వేశారని, ప్రాజెక్టు కోసం భారీగా రుణాలు సేకరించినట్టు కాగ్ రిపోర్టు పేర్కొంది. రూ.87 వేల కోట్లు సమకూర్చుకునేందుకు 15 బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్నారని, బడ్జెటేతర రుణాలపై ప్రభుత్వం ఎక్కువ ఆధారపడి ఉందని కాగ్ రిపోర్ట్ తెలిపింది. 


2036 వరకూ కాళేశ్వరం చెల్లింపులు               


రుణాలు చెల్లింపులో కాలయాపన చేసిందని ప్రస్తావించింది. ప్రాజెక్టు నిర్వహణ కోసం ప్రతి సంవత్సరం రూ.700 కోట్ల నుంచి రూ.14,500 కోట్ల వరకు ఖర్చు అవుతుందని, రుణాల చెల్లింపు కోసం మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని రిపోర్టులో వివరిందింది. కాళేశ్వరం అప్పు చెల్లించుకుంటూ పోతే 2036లో పూర్తవుతుందని కాగ్ నివేదిక అంచనా వేసింది. ‘గ్రాంట్ల మళ్ళింపు జరిగింది. నిధుల దుర్వినియోగం జరిగింది. బకాయిలు వసూలు చేయలేకపోయారు. కొన్ని పనులకు అధిక బిల్లులు చెల్లించారు. సకాలంలో రికార్డులు సమర్పించలేదని కాగ్ స్పెష్టం చేసింది.