సింగరేణిపై (Singareni) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (kishan Reddy)డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో సింగరేణి కార్మికుల కష్టార్జితాన్ని ఏవిధంగా తాకట్టు పెట్టాలని అనుకుంటున్నారో చెప్పాలని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakha Steel Plant) కొంటామంటూ ప్రకటించడం రాజకీయ జిమ్మిక్కు మాత్రమే అని విమర్శించారు. కార్మికులకు దేవుళ్లమంటూ కల్వకుంట్ల కుటుంబం పొలిటికల్ స్టంట్ చేస్తున్నదని ఆరోపించారు. బొగ్గు గనులు తెలంగాణలో వేలం వేస్తుంటే, అందులో పాల్గొని సింగరేణికి (Singareni)గనులు దక్కేలా చేయకుండా.. విశాఖ స్టీల్ ప్లాంటులో పెట్టుబడులు పెడతామంటూ ప్రగల్బాలు పలుకుతున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు.


కోల్ ఇండియాలో(Coal India) కార్మికులకు 930 రూపాయలు వేతనం ఉంటే సింగరేణిలో(Singareni) రూ. 420 మాత్రమే ఉందని కిషన్ రెడ్డి అన్నారు. కార్మిక సంఘాల ఎన్నికలున్న నేపధ్యంలోనే BRS డ్రామాలు ఆడుతుందని విమర్శించారు. తెలంగాణపై కేంద్రానికి ఎలాంటి వివక్ష లేదని.. తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా ఉన్న సింగరేణి పరిస్థితి నేడు అగమ్యగోచరంగా తయారైందని అన్నారు. అంతర్గత ప్రైవేటికరణ, ఔట్ సోర్సింగ్, అధ్వాన్నమైన ఆర్థిక వ్యవస్థ, సిబ్బంది తగింపు, గనులలో భద్రత లోపించిందన్నారు. సింగరేణి నిర్ణయాల్లో రాజకీయ జోక్యం ఎక్కువైందని ఆరోపించారు. BRS నేతలకు ఎన్నికలప్పుడే సింగరేణి కార్మికులు గుర్తుకు వస్తారని విమర్శించారు.


2014, 20118,19 ఎన్నికల్లో CM KCR సొంత ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారని.. దేశంలోనే కాదు అంతర్జాతీయంగా విస్తరిస్తామని చెప్పిన KCR ఎందుకు చేయలేదో చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. పర్మినెంట్ ఉద్యోగుల సంఖ్య రోజురోజుకు తగ్గుతుంది. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని చెప్పి ఇంతవరకు పట్టించుకోలేదన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను పెద్దఎత్తున నియమించుకుంటు కార్మికుల శ్రమదోపిడికి BRS ప్రభుత్వం పాల్పడుతోందని ఆరోపించారు. సింగరేణిని రక్షించాల్సింది పోయి భక్షించేలా KCR విధానాలున్నాయని అన్నారు. TS GENCO నుంచి రూ. 2,500 కోట్లు, TS TRANSCO నుంచి రూ. 18,000 కోట్లు సింగరేణికి రావాల్సి ఉందని కిషన్ రెడ్డి వెల్లడించారు.


రాష్ట్ర ప్రభుత్వం నుంచి 25000 కోట్లు రావాల్సి ఉందన్నారు. రూ. 3,500 కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న సింగరేణిని అప్పులు చేస్తేకాని జీతాలు ఇవ్వలేని స్థితికి కేసీఆర్ తీసుకొచ్చారని ఆరోపించారు. కోల్ ఇండియా అప్పుడు 12 వేల కోట్లు మాత్రమే అని తెలిపారు. కోల్ ఇండియా అప్పులు రోజురోజుకు తగ్గుతుంటే BRS చేతకానితనం, అంతర్గత అవినీతితో సింగరేణి అప్పులు పెరిగిపోతున్నాయని అన్నారు. CM KCR కుటుంబ సభ్యుల జోక్యం మితిమిరిపోయిందని.. అధికార దుర్వినియోగానికి సింగరేణి యాజమాన్యం రెడ్ కార్పెట్ వేసిందని విమర్శించారు. ఎమ్మెల్యేలను సంతృప్తిపరచాలని సర్క్యులర్‌ జారీచేయడం.. కాంట్రాక్టు ఉద్యోగులను తీసుకోవాలన్నా, తీసేయాలన్నా ఎమ్మెల్యేలు చెప్పినట్లే చేస్తున్నారని ఆరోపించారు. కార్మికుల షిఫ్టులు మార్చాలన్నా అధికారపార్టీ నేతలు జోక్యం చేసుకోవడం దారుణమన్నారు కిషన్ రెడ్డి. సింగరేణిని BRS జేబు సంస్థగా మార్చుకుందని ఆరోపించారు.


సింగరేణి ప్రయివేటికరణ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ప్రయివేటికరణ చేసే ఆలోచనలేదంటూ ప్రధాని స్వయంగా చెప్పారని కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాని లిఖితపూర్వకంగా చెప్పినా BRS కుట్రలు ఆపడం లేదని.. బహిరంగ వేలం ద్వారానే బొగ్గు గనులను ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇచ్చిన మైనింగ్ కంపెనీలలో మైనింగ్ చేయడం చేతకాదని ఆయన విమర్శించారు.