KTR Latest News | హైదరాబాద్: ఏబీపీ నెట్వర్క్ నిర్వహించనున్న ప్రతిష్టాత్మక సదరన్ రైజింగ్ సమ్మిట్ 2025’లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రసంగించనున్నారు. ఈ సదస్సు నవంబర్ 25, 2025న చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళాలో జరగనుంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ వేదికపై జరిగే చర్చా కార్యక్రమంలో పాల్గొని, దక్షిణ భారతదేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, సాంకేతిక పరిణామాలపై తన అభిప్రాయాలను పంచుకోనున్నారు.
ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ థీమ్ ఏంటి..
'సదరన్ రైజింగ్ సమ్మిట్' (ABP Southern Rising Summit) మూడవ ఎడిషన్ ఈసారి “భవిష్యత్తుకు సిద్ధం: ఆవిష్కరణ, పరివర్తన, స్ఫూర్తి” (Ready for the Future: Innovation, Transformation, Inspiration) అనే థీమ్తో నిర్వహిస్తున్నారు. ఆర్థిక వృద్ధి, ఆరోగ్యం, విద్య, మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం, స్థిరమైన అభివృద్ధి వంటి అంశాలలో దక్షిణాది రాష్ట్రాలు ఏ విధంగా ముందుకు సాగుతున్నాయి అనే అంశంపై చర్చించడానికి ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, సినీ రంగంతో పాటు పౌర సమాజానికి చెందిన ప్రముఖులను ఏబీపీ నెట్వర్క్ తమ సదస్సు ద్వారా ఒకే వేదికపైకి తీసుకువస్తోంది.
ఏబీపీ నెట్వర్క్ తమ ఆహ్వానంలో, కేటీఆర్ వంటి నేత పాల్గొనడం కేవలం తెలంగాణకే కాకుండా, యావత్ భారతదేశానికి దిశను నిర్దేశించడంలో దోహదపడుతుందని పేర్కొంది. ఈ 25న చెన్నైలో జరగనున్న ఈ కార్యక్రమంలో కేటీఆర్ బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సాధించిన ప్రగతి, భారతదేశ వృద్ధిలో దక్షిణ రాష్ట్రాల పాత్ర, అలాగే తయారీ , ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆవిష్కరణల ఆధారిత రంగాలలో వస్తున్న కొత్త అవకాశాలపై తన అభిప్రాయాలను పంచుకోనున్నారు.
హాజరయ్యే ప్రముఖులు వీరే..
ఈ సదరన్ రైజింగ్ సమ్మిట్లో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యమోళి, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్, బీజేపీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై, PMK నాయకుడు అన్బుమణి రామదాస్, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, నటి మాళవిక మోహనన్ వంటి ప్రముఖులు పాల్గొని తమ అభిప్రాయాలు షేర్ చేసుకుంటారు.