Hyderabad News: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రి శ్రీధర్ బాబు చేసిన వ్యాఖ్యలపై ఎద్దేవా చేశారు. శ్రీధర్ బాబు శనివారం ఓ మీటింగ్‌లో అరెకపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి గొడవపై మాట్లాడుతూ.. వారిద్దరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని అన్నారు. ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్టుకుంటుంటే.. అందులో కాంగ్రెస్‌ పార్టీని జోక్యం చేస్తున్నారు.. ఇది న్యాయమా అని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. అరెకపూడి గాంధీ బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెబుతున్నారని.. అలాంటి ఇద్దరు ఎమ్మెల్యేలు కొట్టుకుంటున్నారని అన్నారు. అయితే, కొద్ది రోజుల క్రితం అరెకపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే.


దీనిపై కేటీఆర్ స్పందించారు. ‘‘అతి తెలివి మంత్రి గారు.. మీ లాజిక్ ప్రకారం మీ చిట్టినాయుడు కూడా ఇంకా టీడీపీలోనే ఉన్నాడా లేక కాంగ్రెస్ లో ఉన్నాడా? సరే మీ మాటే నిజం అనుకుందాం ఒక్క నిమిషం కోసం; మరి మా BRS ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టు తిరిగి వారికీ కాంగ్రెస్ కండువాలు కప్పిన సన్నాసి ఎవడు? సిగ్గులేకుండా ఇంత నీతిమాలిన రాజకీయం ఎందుకు? అసలు చేర్చుకోవడం ఎందుకు, ఆ తర్వాత పదవులు పోతాయి అన్న భయంతో ఈ నాటకాలు ఎందుకు? మీరు ప్రలోభపెట్టి చేర్చుకున్న వాళ్ళను మా వాళ్ళు అని చెప్పుకోలేని మీ బాధను చూస్తే జాలి కలుగుతోంది. మీరు మీ అతి తెలివితో హైకోర్టు ను మోసం చేద్దాం అనుకుంటున్నారు కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు’’ అని కేటీఆర్ ఎద్దేవా చేస్తూ మాట్లాడారు.