యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ ఈ మధ్య టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారాడు. తనని మోసం చేశాడంటూ ప్రియురాలు లావణ్య పెట్టిన కేసుతో ఒక్కసారిగా సెన్సేషన్‌ అయ్యాడు. వరుస ప్లాప్స్‌ వచ్చినా కూడా రాజ్‌ తరుణ్‌ ప్రెస్‌ మీట్‌ అనగానే అంతా ఆసక్తి చూపుతున్నారు. దీంతో అతడికి సంబంధించిన ఎలాంటి వార్తయిన చర్చనీయాంశం అవుతుంది. అయితే ఒకప్పుడు రాజ్‌ తరుణ్‌ వరుస హిట్స్‌ ఫుల్‌ క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఉయ్యాల జంపాల, కుమార్‌ 21ఎఫ్‌ చిత్రాల హిట్‌తో యూత్‌లో యమ క్రేజ్‌ సంపాదించుకున్నాడు.


కానీ, ఆ తర్వాత వరుస ప్లాప్స్‌తో ఢీలా పడ్డాడు. చాలా గ్యాప్‌ తర్వాత 'నా సామిరంగ'తో ఒక హిట్‌ అందుకున్నాడు. కానీ, అది కింగ్‌ నాగార్జున అకౌంట్లోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత  పురుషోత్తముడు, తిరగబడరా సామీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ అవి కూడా బాక్సాఫీసు వద్ద బొల్తా కొట్టాయి. కానీ, వరసగా సినిమాలు రిలీజ్‌ చేస్తూనే ఉన్నాడు. రీసెంట్‌గా భలే ఉన్నాడే సినిమా విడుదలైంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా కెరీర్‌ ప్రారంభంలో తను ఎదుర్కొన్న చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. 


రూ. 3వేలకు అసిస్టెంట్  డైరెక్టర్ గా 


హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాజ్‌ తరుణ్‌ నిజానికి డైరెక్టర్‌ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చాడట. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. "బిటెక్‌ చదువుతుండగానే షార్ట్‌ ఫిలింస్‌ చేశాను. దాదాపు 52 షార్ట్‌ ఫిలింస్‌ చేశాను.  అప్పుడే నన్ను ఎవరైనా ఇండస్ట్రీవాళ్లు గుర్తించి ఆఫర్‌ ఇస్తే బాగుండు అని ఎదురుచూస్తున్నా. అదే టైంలో డైరెక్టర్‌ రామ్మోహన్‌ పిలిచి యాక్టింగ్‌ చేస్తావా? డైరెక్షన్‌ చేస్తావా? అన్నారు. నేను డైరెక్షనే చేస్తానని చెప్పాను. అలా ఆయన దగ్గర రూ. 3వేలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరాను" అని చెప్పుకొచ్చాడు.  అనంతరం మాట్లాడుతూ... ఆయనతో నేను తరచూ సీన్స్‌ చర్చించేవాడిని. ఒక్క సీన్‌ని ఉదయం నుంచి రాత్రి వరకు చర్చించేవాళ్లం. అప్పుడు నేను పర్వాలేదు.. కానీ, ఇంకాస్త బాగుండాల్సింది అని తరచూ విసుక్కునేవారు.



అద్దె కట్టడానికి కూడా డబ్బుల్లేవు


అలా ఆయన నెల రోజులు ఓపిక పట్టారు. ఆ తర్వాత కోపం వచ్చి నువ్వుంటే స్క్రిప్ట్‌ ముందుకు సాగదు వెళ్లిపో అన్నారు. దాంతో ఏం చేయాలో తోచలేదు. బిటెక్‌ మధ్యలో వదిలేసి వచ్చాను. ఇక్కడ ఆఫర్స్‌ లేవు. దీంతో ఇంటి అద్దె కట్టడానికి కూడా కష్టమైంది. డబ్బుల్లేక చాలా ఇబ్బంది పడ్డాను. ఏం చేయాలో తోచలేదె. ఫుట్‌పాత్‌పైనే 11 రోజులు పడుకున్నా. నీళ్లు తాగి కడుపు నింపుకునేవాడిని. అప్పుడు నాకు 20 ఏళ్లు. ఆ వయసులో ఏదైనా సాధించాలనే పట్టుదల ఉంటుంది. అందుకే ఏదోకటి సాధించాక ఇంటికి తిరిగి వెళ్లాలి అనుకున్నాను. మొండిగా ఫుట్‌పాత్‌పై ఉన్నాను. అప్పుడే రామ్మోహన్‌ గారే మళ్లీ నన్ను పిలిచారు. ఈసారి ఆయన రైటర్‌గా నాకు ప్రమోషన్‌ ఇచ్చారు. అప్పుడే కుమారి 21ఎఫ్‌ సినిమాతో హీరోను అయ్యాను" అంటూ చెప్పుకొచ్చాడు.  



Also Read: సందీప్‌ రెడ్డి వంగాతో 'దేవర' టీం ముచ్చట్లు - జాన్వీపై కొరటాల ఆసక్తికర కామెంట్స్‌! అదిరిపోయిన ప్రొమో