Mlc Kavitha Sensational Letter: ఢిల్లీ లిక్కర్ కేసుతో (Delhi Liquor Case) తనకు ఎలాంటి సంబంధం లేదని.. తాను బాధితురాలిని అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Mlc Kavitha) అన్నారు. లిక్కర్ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఆమెకు రౌస్ అవెన్యూ కోర్టు విధించిన 14 రోజుల కస్టడీ మంగళవారంతో ముగియగా.. ఈడీ అధికారులు ఇవాళ కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో కవిత కోర్టులో మాట్లాడేందుకు న్యాయమూర్తి అంగీకరించక పోవడంతో ఆమె 4 పేజీల లేఖను విడుదల చేశారు.






లేఖలో ఏం చెప్పారంటే.?


'ఢిల్లీ లిక్కర్ కేసులో నేను బాధితురాలిని. ఈ స్కాంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. దర్యాప్తు సంస్థలు పేర్కొన్నట్లు నాకు ఆర్థికంగా ఏ లబ్ధీ చేకూరలేదు. రెండేళ్ల నుంచీ కేసు విచారణ  ఎటూ తేలడం లేదు. వేరే వ్యక్తుల స్టేట్మెంట్ తో నన్ను అరెస్ట్ చేశారు. సీబీఐ, ఈడీ దర్యాప్తు కంటే మీడియాలో విచారణ ఎక్కువగా సాగింది. రాజకీయంగా, వ్యక్తిగతంగా నా ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించారు. నా ఫోన్ నెంబర్ ను ఛానళ్లలో ప్రసారం చేసి నా ప్రైవసీని దెబ్బతీశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో నాలుగుసార్లు విచారణకు హాజరయ్యాను. బ్యాంకు వివరాలు కూడా ఇచ్చి అన్ని విధాలుగా విచారణకు సహకరించాను. నా మొబైల్ ఫోన్లన్నీ దర్యాప్తు సంస్థకు అందజేశాను. ఫోన్లు ధ్వంసం చేశానని నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. రెండున్నరేళ్లుగా సోదాలు జరిపారు. సాక్షులను బెదిరిస్తున్నట్లు నాపై ఆరోపణలు చేస్తున్నారు. మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు. 95 శాతం కేసులన్నీ ప్రతిపక్ష నేతలకు సంబంధించినవే. బీజేపీలో చేరిన వెంటనే ఆ కేసుల విచారణ ఆగిపోతుంది. విపక్ష పార్టీలన్నీ న్యాయ వ్యవస్థపై ఆశతో చూస్తున్నాయి. కేసు దర్యాప్తునకు సహకరించేందుకు పూర్తి సిద్ధంగా ఉన్నా. ఈ పరిస్థితుల్లో నాకు బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థిస్తున్నాను. నా చిన్న కుమారుడు పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో తల్లిగా నేను తనతో ఉండాలి. నా పాత్రను ఎవరూ భర్తీ చేయలేరు. ఈ క్రమంలో నా కుమారుడిపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నాను. నా బెయిల్ అభ్యర్థనను పరిశీలించాల్సిందిగా మళ్లీ కోరుతున్నాను.' అని కవిత లేఖలో పేర్కొన్నారు.


జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు


మరోవైపు, కవితకు న్యాయస్థానం ఈ నెల 23 వరకూ జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది. 14 రోజుల కస్టడీ ముగియడంతో మంగళవారం ఆమెను ఈడీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీ లాండరింగ్ కు సంబంధించి కేసు దర్యాప్తు కొనసాగుతోందని.. కవిత బయట ఉంటే దర్యాప్తు ప్రభావితం అవుతుందని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వాదనలు వినిపించింది. మరో 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించాలని కోర్టును కోరింది. అయితే, కవిత కస్టడీ పొడిగించడానికి ఈడీ వద్ద కొత్తగా ఏమీ లేవని ఆమె తరఫు న్యాయవాది రానా కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కవితకు కస్టడీ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆమెను ఈడీ అధికారులు తీహార్ జైలుకు తరలించనున్నారు. మరోవైపు, కవితను మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని కవిత తరఫు న్యాయవాది కోర్టును కోరగా.. ఆమె నేరుగా మాట్లాడేందుకు న్యాయమూర్తి నిరాకరించారు. కోర్టు హాలులో భర్త, మామను కలిసేందుకు జడ్జి అనుమతి ఇవ్వడంతో వారు కవితను కలిశారు.


Also Read: Hyderabad Student: తీవ్ర విషాదం - అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి మృతి