తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీలో అసంతృప్తజ్వాలలు భగ్గుమంటున్నాయి. పార్టీలో సుదీర్ఘకాలం పని చేసిన నేతలు కేసీఆర్ కు షాకులిస్తున్నారు. అసెంబ్లీ టికెట్లు దక్కని నేతలు ఒకరి తర్వాత ఒకరు గులాబీ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్  జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, బీఆర్ఎస్ కు బై బై చెప్పేశారు. హస్తం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీల హామీతో పేదలకు మేలు జరుగుతుందని.. అందుకే ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు కసిరెడ్డి నారాయణరెడ్డి వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి  బీఆర్ఎస్ తరపున పోటీ చేయాలని భావించారు. బీఆర్ఎస్ పార్టీలో టికెట్ దక్కకపోవడంతో కొన్ని రోజులుగా అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి హామీ టికెట్ హామీ దక్కడంతో అధికార పార్టీకి గుడ్ బై చెప్పేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా పరిషత్ వైస్‌ఛైర్మన్‌ బాలాజీ సింగ్‌ కూడా గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే మెదక్‌ డీసీసీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు.


సోనియా గాంధీపై అభిమానంతో 
కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసినా సోనియా గాంధీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. సోనియా గాంధీపై అభిమానంతో తెలంగాణలో ప్రజాస్వామ్య, ప్రజా సంక్షేమ ప్రభుత్వం ఏర్పడాలన్న ఆకాంక్షతో కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్​కు రాజీనామా లేఖను పంపారు.  రాష్ట్ర సాధన తరువాత సంక్షేమం పేరిట ప్రజల్లో కులాల పేరుతో విభజన జరుగుతోందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గాల్లో పోలీస్ వ్యవస్థ పూర్తిగా ఎమ్మెల్యేల చేతుల్లో కీలుబొమ్మగా మారిందని ఆరోపించారు. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఉన్నవారిని అణచివేస్తున్నతీరు తనను బాధించిందన్నారు. సంక్షేమ పథకాల్లో కూడా ఉద్యమకారులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, ఎమ్మెల్యే అనుచరులకు పెద్దపీట వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.  


కల్వకుర్తి అసెంబ్లీ నుంచి బరిలోకి
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేయాలని భావిస్తున్నారు. కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో కల్వకుర్తి నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు మరోసారి అవకాశం కల్పించారు. దీనికి తోడు కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, కసిరెడ్డి నారాయణరెడ్డి మధ్య కొంతకాలంగా విభేదాలున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి నారాయణరెడ్డి పోటీ చేయాలని భావించినా టికెట్ రాలేదు. జైపాల్ యాదవ్ కు అసెంబ్లీ టికెట్ ఇచ్చి, నారాయణరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నారాయణరెడ్డికి ఎమ్మెల్సీగా ఎన్నుకున్నారు.