ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రలో రెండు రోజుల పర్యటనలో భాగంగా నేడు సర్కోలిలో జరిగిన సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ‌, మ‌హారాష్ట్ర కోసం ఏర్పడిన పార్టీ త‌మ‌ది కాద‌ని అన్నారు. బీఆర్ఎస్ అంటే భారత్ ప‌రివ‌ర్తన్ మిషన్ అని అన్నారు. ఈ దేశానికి ల‌క్ష్యం అనేది ఏమైనా ఉందా అని.. లేదంటే ఊరికే ఉన్నామా అని జనాలను ఉద్దేశించి మాట్లాడారు. సరైన మార్గం, లక్ష్యం గురించి ఆలోచించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, చక్కని ప్రగతి సాధించాలని అన్నారు. సౌత్ కొరియా, జ‌పాన్, సింగ‌పూర్ మ‌లేషియా లాంటి చిన్న దేశాలు ఎంతో ప్రగ‌తి సాధించిన‌ట్లు సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ఓ ద‌శ‌లో చైనా పేద దేశంగా ఉండేదని, కానీ ఇప్పుడు చైనా ఎలా ఉందో పరిశీలించాలని అన్నారు. మ‌నం ఎక్కడ ఉన్నామ‌ని ఆయ‌న ప్రశ్నించారు.


దీనిపై అందరూ ఆలోచించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్‌లో చేరిన మ‌రాఠీ నేత భ‌గీర‌థ్ బాల్కేకు పూర్తి మ‌ద్దతు ఇస్తున్న‌ట్లు కేసీఆర్ తెలిపారు. ప‌శ్చిమ మ‌హారాష్ట్ర ద‌ర్వాజ్ తెరిచిన బాల్కేకు అండ‌గా ఉంటామ‌ని అన్నారు. పండ‌రీపురం వికాసం మొత్తం బాల్కే చేతుల మీదుగా జ‌రుగుతుంద‌ని అన్నారు.


మ‌హారాష్ట్రలో ఉన్న అన్ని పార్టీలకు అధికారం వచ్చిందని, మంచి చేయాల‌నుకుంటే ఎవ‌రైనా చేస్తారని అన్నారు. కానీ ఆ పార్టీలు ఏమీ చేయ‌లేదని విమర్శించారు. పెద్ద రాష్ట్రం అయిన మ‌హారాష్ట్ర ధ‌న‌వంత‌మైన రాష్ట్రం అని.. మ‌హా నేత‌లు దివాళా తీస్తారని అన్నారు. తెలంగాణలో తాము కోట్లాది ఎక‌రాలకు సాగు నీటిని అందిస్తుంటే.. మహారాష్ట్రలోని ఔరంగ‌బాద్‌లో మాత్రం ఎనిమిది రోజుల‌కు ఒక‌సారి.. సోలాపూర్‌లో 5 రోజుల‌కు ఒక‌సారి నీళ్లు వస్తున్నాయని విమర్శించారు. ఇదంతా కేంద్ర జలవిధానం వల్లే జరుగుతోందని, ఈ జ‌ల‌విధానాన్ని బంగాళాఖాతంలో వేయాల‌ని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే జ‌ల‌నీతిని మార్చేస్తామ‌ని, కొత్త భారతాన్ని రూపొందిస్తామ‌ని అన్నారు.


దేశంలో 125 ఏళ్లకు సరిపడ బొగ్గు నిల్వలు
థర్మల్ విద్యుత్, సోలార్ ప‌వ‌ర్‌, హైడ్రో ప‌వ‌ర్‌ లాంటివాటికి మన దేశంలో ఎలాంటి స‌మ‌స్యా లేద‌ని అన్నారు. ఆ బొగ్గు రిజ‌ర్వులు బిలియ‌న్ల ట‌న్నుల్లో ఉన్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. కావాల్సినంత బొగ్గు నిల్వ‌లు ఉన్న‌ప్పుడు.. విద్యుత్తు స‌మ‌స్య ఎందుకు వ‌స్తోంద‌ని ప్ర‌శ్నించారు. 125 ఏళ్ల‌కు కావాల్సినంత బొగ్గు మ‌న ద‌గ్గ‌ర ఉంద‌ని చెప్పారు. తెలంగాణ‌లో ధ‌ర‌ణి పోర్ట‌ల్‌తో భూముల్ని డిజిట‌లైజ్ చేసిన‌ట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ‌లో జ‌రుగుతున్న ప‌థ‌కాల అమ‌లు, మ‌హారాష్ట్ర‌లో ఎందుకు జ‌ర‌గ‌వ‌ని ఆయ‌న ప్రశ్నించారు.


మహారాష్ట్రలో కేసీఆర్ ప్రభావం ఉండబోదు
కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన గురించి శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గపు నాయకుడు, ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ ఎలాంటి ప్రభావమూ చూపబోదని అన్నారు. మహారాష్ట్రలో చేసే గిమ్మిక్కులతో కేసీఆర్ తెలంగాణను కూడా కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుందని అన్నారు. కేసీఆర్ తన ప్రతీకారాన్ని మహారాష్ట్రపై తీర్చుకోవాలనుకుంటే బీఆర్‌ఎస్ పార్టీ బీజేపీకి బి టీమ్ అని తాము చెబుతామని అన్నారు. బీజేపీ ముందుగా హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీని పంపిందని, ఇప్పుడు కేసీఆర్ ను పంపిందని ఆయన ఆరోపించారు.