Brs Leader Argue With Police In Land Issue: మేడ్చల్ (Medchal) జిల్లా జీడిమెట్ల పరిధిలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత నెలకొంది. సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో నెలకొన్న భూ వివాదంలో మాజీ మంత్రి మల్లారెడ్డికి, ఇతరులకు మధ్య వాగ్వాదం జరిగింది. 1.15 ఎకరాల భూమి తాము కొన్నామని అది తమదేనని ఓ వర్గానికి చెందిన 15 మంది చెబుతుండగా.. తమ భూమిని కబ్జా చేస్తున్నారంటూ మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి చుట్టూ అక్రమంగా ఫెన్సింగ్ వేశారని.. దాన్ని తొలగించాలని తన అనుచరులను ఆదేశించారు. తనది, తన అల్లుడు రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. అయితే, మల్లారెడ్డి ఆదేశాలతో ఆయన అనుచరులు బారికేడ్లు, ఫెన్సింగ్ లను తొలగిస్తుండగా ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువురికి సద్దిచెప్పేందుకు యత్నించారు.


పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదం







వివాదంలో ఉన్న భూమిలో ఘర్షణకు దిగొద్దని పోలీసులు మల్లారెడ్డి సహా, మరో వర్గానికి సద్దిచెప్పారు. అయితే, తన భూమిలో ఫెన్సింగ్ వేస్తే చూస్తూ ఎలా ఊరుకున్నారంటూ పోలీసులతో మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. 'నాపై కేసు పెడితే పెట్టుకోండి. నా స్థలాన్ని నేను కాపాడుకుంటా' అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల ముందే మల్లారెడ్డి అనుచరులు ఫెన్సింగ్ తొలగించారు. కాగా, గతంలో ఈ భూమి తమదేనంటూ 15 మంది వచ్చారు. 400 గజాల చొప్పున 1.11 ఎకరాల భూమిని కొన్నామని.. కోర్టు తీర్పు కూడా తమకు అనుకూలంగా వచ్చిందని తెలిపారు. మాజీ మంత్రి అనుచరులు తమను బెదిరిస్తున్నారని 15 మంది ఆరోపిస్తున్నారు. అయితే, ఈ స్థలంపై కోర్టు ఆర్డర్ ఉన్నందున సామరస్యంగా పరిష్కరించుకోవాలని పోలీసులు ఇరు వర్గాలకు సూచించారు.


మల్లారెడ్డి ఏం చెప్పారంటే.?


14 ఏళ్ల కిందటే తాము ఈ ప్రాపర్టీ తీసుకున్నామని మాజీ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. '2 ఎకరాల 10 గుంటల భూమికి సంబంధించి అన్నీ డాక్యుమెంట్లు ఉన్నాయి. అయితే, ఇదే సర్వే నెంబర్ లో తమకు భూమి ఉందంటూ కొందరు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించారు. 8 ఏళ్ల నుంచి కోర్టులో కేసు నడుస్తుంది. వారు 4 ఎకరాల 26 గుంటలు ఉన్నాయని చెబుతున్నారని.. డాక్యుమెంట్లు ఉంటే సర్వే చేయించుకోమని చెప్పాం. అయినా దౌర్జన్యంగా రాత్రికి రాత్రే మా భూమిలో షెడ్లు కూలగొట్టి ల్యాండ్ కబ్జా చేసేందుకు యత్నించారు. రౌడీలను పెట్టి దౌర్జన్యం చేయాలని చూస్తున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. మా భూమిని కాపాడుకోవాలని ఇక్కడకు వచ్చాం. అన్నీ డాక్యుమెంట్లు చెక్ చేసుకోవాలని చెప్పాం. దీనిపై కమిషనర్ కు సైతం ఫిర్యాదు చేస్తాం.' అని మల్లారెడ్డి చెప్పారు. 


పోలీసుల అదుపులో మల్లారెడ్డి


అయితే, సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82 భూ వివాదానికి సంబంధించి మాజీ మంత్రి మల్లారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు పోలీస్ స్టేషన్ కు భారీగా చేరుకోగా.. పోలీసులు వారిని నిలువరించారు. 


Also Read: Khammam News: ఆస్తి కోసం దారుణం - తల్లి, ఇద్దరు కుమార్తెల హత్య