BRS leader Kavitha leaves for Hyderabad from Delhi | సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. ఐదు నెలల తరువాత కవితకు ఎట్టకేలకు బెయిల్ రావడం తెలిసిందే. నిన్న బెయిల్ రావడంతో రాత్రి 9 గంటలకు తిహార్ జైలు నుంచి కవిత విడుదల కాగా, భర్త అనిల్, సోదరుడు కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు ఆమెను రిసీవ్ చేసుకున్నారు. అక్కడి నుంచి రాత్రి ఢిల్లీలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు వెళ్లారు. నేడు రౌస్ అవెన్యూ కోర్టులో కేసు విచారణకు ఆన్ లైన్ వేదికగా హాజరయ్యారు. అది పూర్తయ్యాక భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, బీఆర్ఎస్ నేతలతో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. సాయంత్రం దాదాపు 5 గంటలకు శంషాబాద్ కు చేరుకోనున్నారు. వీరికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్నాయి.


 






హైదరాబాద్ కు వచ్చి కవితను అరెస్ట్ చేసిన ఈడీ


ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ అధికారులు మార్చి 15న కవితను అరెస్ట్ చేయడం తెలిసిందే. హైదరాబాద్ కు వచ్చిన ఈడీ అధికారులు ఆరోజు విచారణ చేసి, సాయంత్రం దాటాక కవితను అరెస్ట్ చేశారు. ఆ సమయంలో బీఆర్ఎస్ నేతలు భారీగా అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. చివరికి కవితను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి తరలించారు. తిహార్ జైలు విచారణ ఖైదీగా ఉన్నారు కవిత. ఈడీ కేసు విచారణ చేపట్టగా, అనంతరం ఏప్రిల్ నెలలో సీబీఐ అధికారులు కవితను అరెస్ట్ చేసి ఢిల్లీ లిక్కర్ పాలసీపై దర్యాప్తు కొనసాగించారు. లిక్కర్ పాలసీలో తమను ఉద్దేశపూర్వకంగా ఇరికించే ప్రయత్నం చేసిందని, కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోందని ఆరోపించారు.


కవిత బెయిల్ కోసం కేటీఆర్, హరీష్ రావు తీవ్రంగా శ్రమించారు. పలుమార్లు ఢిల్లీకి వెళ్లి అక్కడ సీనియర్ లాయర్లు, న్యాయ నిపుణులతో సమావేశమై ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుపై చర్చించారు. పలుమార్లు కవిత బెయిల్ పిటిషన్ విచారణకు రాగా, కోర్టులు అందుకు నిరాకరించాయి. కవిత తరఫున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో వందల కోట్లు చేతులు మారాయని ఆరోపణలు చేశారని, కానీ ఒక్క రూపాయి కూడా స్వాధీనం చేసుకోలేదన్నారు. మహిళ కొన్ని నెలలుగా జైల్లో ఉన్నారని, ఆమె ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బెయిల్ ఇవ్వాలని రోహత్గీ వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తు పూర్తైందని, ఇప్పుడు బెయిల్ ఇస్తే ఏ సమస్యా ఉండదని చెప్పిన వాదనలతో కోర్టు ఏకీభవించింది. కవితకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో హైదరాబాద్ వస్తున్నారు.