Harish Rao Comments On CM Revanth Reddy: యూట్యూబ్ చూస్తే రేవంత్ రెడ్డికి వెన్నులో వణుకు పుడుతుందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. యూట్యూబర్లు తలుచుకుంటే సీఎం రేవంత్ ను గద్దె దించడం పెద్ద విషయమేమీ కాదని గుర్తుంచుకోవాలని సిద్దిపేట ఎమ్మెల్యే హెచ్చరించారు. గతంలో యూట్యూబ్ చానళ్లను అడ్డం పెట్టుకొని వాస్తవాలను అవాస్తవాలుగా చిత్రీకరించి.. నేడు అదే యూట్యూబర్ లపై సీఎం రేవంత్​రెడ్డి ఉక్కుపాదం మోపడం కరెక్ట్ కాదని ఆయన అన్నారు. యూట్యూబర్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. నర్సాపూర్ లో మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు.


ఆ అక్కసుతోనే
రాష్ట్రంలో సీఎం రేవంత్  చేస్తున్న అక్రమాలను, మాట తీరును ఎండగడుతుంటే అది చూసి తట్టుకోలేక యూట్యూబర్లను తక్కువ చేసి మాట్లాడటం సరికాదన్నారు. రేవంత్ రెడ్డి తనకు అవసరమైతే ఒకలా ఉంటారని.. అవసరం తీరిపోయాక మరోలా ఉంటారని హరీష్ అన్నారు. ‘ఒడ్డు దాటకముందు ఓడ మల్లన్న.. ఒడ్డు దాటక బోడ మల్లన్న’ తీరుగా రేవంత్  ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ‘ఈ యూట్యూబ్ లనే వాడుకొని గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేసి ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పి అధికారంలోకి వచ్చింది మీరు కాదా?’ అని హరీష్ ప్రశ్నించారు. వాళ్ల బండారాన్ని బట్టబయలు చేసి.. అవినీతిని బయట పెడుతుంటే రేవంత్ రెడ్డి తట్టుకోలేక పోతున్నారని, ఆ అక్కసును యూట్యూబర్ల మీద చూపిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. 


రుణ మాఫీ జాడేది
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర్నండి బీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. నిత్యం ఏదో వారిపై వీరు.. వీరిపై వారు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని సీఎం రేవంత్ మర్డర్ చేశారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో హైదరాబాద్ ప్రతిష్ట మసక బారిందన్నారు. హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారు తప్ప మరొకటి లేదన్నారు. రేవంత్ ఫార్మసీటీ, మెట్రో రైలు విషయంలో రూటు మార్చారని ఆరోపించారు. నర్సాపూర్ లో ఏ గ్రామానికి పోయినా రుణమాఫీ కాలేదని చెబుతున్నారని హరీష్ రావు తెలిపారు. రుణమాఫీ కాలేదని కాంగ్రెస్ నాయకులను రైతులు రూములో వేసి బందిస్తున్నారు. రేవంత్ రెడ్డి తొందరపాటు వల్ల లోకల్ కాంగ్రెస్ నాయకులు గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి వచ్చిందన్నారు.  రాష్ట్రంలో 50 శాతానికి మించి రుణమాఫీ కాలేదు. 41 లక్షల మందికి రుణమాఫీ అవ్వాల్సి ఉంటే 21 లక్షల మందికి రుణమాఫీ కాలేదన్నారు. రైతుబంధు ఎగ్గొట్టేశావు,  రైతుబంధు నిధులు విడుదల చేయాలని కోరారు.


బోనస్ అంతా బోగసేనా ?
బీఆర్ఎస్ సర్కార్ రెండు సార్లు రుణమాఫీ చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో  దొడ్డు వడ్లకు బోనస్ అంటివి, ఇప్పుడేమో సన్నవడ్లకు బోనస్ ఆంటీవి, బోనస్ ని బోగస్ చేశావని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 నెలల కాంగ్రెస్ పాలనలో గ్రామపంచాయతీకి నిధులు విడుదల అవ్వట్లేదు, సర్పంచులను కదిలిస్తే కన్నీళ్లు బయటకు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.  గత ప్రభుత్వంలో ప్రతినెల  పల్లె ప్రగతికి నిధులు వచ్చాయి, ఇప్పుడు నిధులు కరువయ్యాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టణాలను గ్రామాలను గాలికి వదిలేసింది, హైడ్రా పేరిట డ్రామాలు చేస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీపై  ఇచ్చిన 800 కోట్ల రూపాయలు  దారి మళ్లించింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు.  రైతులకు 100 శాతం రుణమాఫీ అయ్యేదాకా, పంట బీమా, భరోసా కల్పించకపోతే  రానున్న కాలంలో  బీఆర్ఎస్ ప్రభుత్వం ఆందోళనలు  చేపడుతుందని స్పష్టం చేశారు.  సీఎం రేవంత్ తొమ్మిది నెలల పాలనలో రెండు నెలల పెన్షన్ మింగేశారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి తీరుతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి వచ్చిందన్నారు. పారిశుధ్య నిర్వహణ పడకేయడంతో జనాలు రోగుల బారిన పడుతున్నారని మండిపడ్డారు.


Also Read: చీర, గాజులు చూపించిన కౌశిక్ రెడ్డి - చెప్పు చూపించిన కాంగ్రెస్ మహిళా నేతలు - ఏం జరిగిందంటే ?