BRS chief KCR Vehicle Checking - జనగామ: రైతుల పరిస్థితిని తెలుసుకునేందుకు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ క్షత్రస్థాయి పరిశీలనకు వెళ్తున్నారు. నేడు నల్గొండ, జనగామ, సూర్యాపేట జిల్లాల్లోని పలు మండలాల్లో కేసీఆర్ పర్యటిస్తున్నారు. కేసీఆర్ ఎర్రవెళ్లి ఫాం హౌస్ నుంచి మొదట జనగామకు వెళ్లారు. పోలీసులు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రయాణిస్తున్న ప్రత్యేక బస్సును అడ్డుకుని తనిఖీలు నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, బస్సు తనిఖీ చేయాలని పోలీసులు చెప్పగా కేసీఆర్ అందుకు సహకరించారు. తిరుమలగిరి మండలం ఈదులపర్రె వద్ద కేసీఆర్ వాహనంలో తనిఖీలు పూర్తయ్యాక, వాహనం ముందుకు కదిలింది. 








జనగామ జిల్లాలో పంటల్ని పరిశీలించిన కేసీఆర్ 
కేసీఆర్ తన పర్యటనలో భాగంగా మొదట జనగామ జిల్లా దేవరుప్పల మండలం ధరావత్‌తండాకు చేరుకున్నారు. తండా పరిసర ప్రాంతాల్లో ఎండిపోయిన పంట పొలాలను స్వయంగా కేసీఆర్ పరిశీలించారు. సాగునీరు అందుతుందా, ఎంతమేర పంట నష్టం వాటిల్లింది అని రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మీకు మేమున్నాం అంటూ రైతులకు ధైర్యం చెప్పి కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు భరోసా కల్పించారు. కేసీఆర్‌ పర్యటనలో ఆయన వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌ గౌడ్‌, సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ తదితరులు ఉన్నారు. అంతకుముందు జనగామ జిల్లాకు కెసిఆర్ కాన్వాయ్ చేరుకోగా పెంబర్తి కాకతీయ కళతోరణం వద్ద జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.


నాడైనా, నేడైనా రైతన్నకు అండగా నిలిచేది కేసీఆర్ మాత్రమే అని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో చేతికొచ్చిన పంటలు నీళ్లందక ఎండిపోయి.. గుండె బరువెక్కిన రైతన్నకు కేసీఆర్ ధైర్యం చెప్పేందుకు జిల్లాల్లో పర్యటిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతుల మద్దతుతో బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు.