Kcr Bus Yatra Schedule: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 22 నుంచి మే 10 వరకూ గులాబీ బాస్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారైంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం సహా బీఆర్ఎస్ (BRS) హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ.. వారితో మమేకమయ్యేలా ప్రచారం సాగించనున్నారు. యాత్రకు సంబంధించిన ఏర్పాట్లను బీఆర్ఎస్ వర్గాలు ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో గులాబీ బాస్ బస్సు యాత్ర పర్మిషన్ పై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ను బీఆర్ఎస్ నాయకులు వాసుదేవారెడ్డి శుక్రవారం కలిశారు. బస్సు యాత్ర వివరాలను ఆయన వికాస్ రాజ్ కు అందజేశారు. యాత్రకు సంబంధించి భద్రతా చర్యలు తీసుకోవాలని.. పోలీసులు సహకారం అందించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా చూడాలని వాసుదేవారెడ్డి కోరారు.






షెడ్యూల్ ఇలా


ఈ నెల 22 నుంచి మే 10వ తేదీ వరకూ బస్సు యాత్ర సాగనుంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 3 - 4 నియోజకవర్గాల్లో రోడ్ షోలు ఉంటాయని బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. యాత్రకు సంబంధించి రూట్ మ్యాప్, ప్రదేశాలను నాయకులే కూర్చొని నిర్ణయించాలని శుక్రవారం జరిగిన సమావేశంలో కేసీఆర్ సూచించారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల మధ్య రోడ్ షోలు ఉంటాయని, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటాయని తెలుస్తోంది. బస్సు యాత్ర చేస్తూనే మధ్యలో బహిరంగ సభల్లో కూడా పాల్గొనేలా బీఆర్ఎస్ శ్రేణులు ప్లాన్ చేస్తున్నాయి. సిద్దిపేట, వరంగల్ సహా మరికొన్ని ప్రాంతాల్లోనూ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. 


Also Read: Telugu Students: తీవ్ర విషాదం - ట్రెక్కింగ్ కు వెళ్లి స్కాట్లాండ్ లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి