BJP Vs TRS: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు జరిగిన వ్యవహారం అంతా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అల్లిన కట్టుకథ అని బీజేపీ సీనియర్ లీడర్, ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ఈ కుట్రలో పోలీసులు భాగస్వామ్యం కావొద్దని సూచించారు. మునుగోడు ఉపఎన్నికలో ఓడిపోతామనే భయంతోనే సీఎం కేసీఆర్ ఇలాంటి చర్యలు, కుట్రకలకు పాల్పడుతున్నారని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ అంశంపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో టీఆర్ఎస్ పై న్యాయ పోరాటానికి సిద్ధమైనట్లు లక్ష్మణ్ చెప్పారు.


బండి సంజయ్ ఆగ్రహం..


ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలపై స్పందించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. టీఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఓ జాతీయ పార్టీ ప్రయత్నించిందన్న వార్తలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. మునుగోడు ఓటమి గ్రహించిన కేసీఆర్‌ కొత్త ఎత్తుగడతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోన్నారని దుయ్యబట్టారు. మర్రిగూడ మండలంలోని తిరుగండ్ల పల్లి నుంచి మాట్లాడిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. టీఆర్‌ఎస్‌ ఓ పెద్ద డ్రామా కంపెనీ అంటూ దుయ్యబట్టారు బండి సంజయ్. నిజంగా ఇప్పుడు జరిగింది నిజమని కేసీఆర్‌ నమ్మితే... యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా ప్రమాణం చేయడానికి సిద్ధపడాలని సవాల్ చేశారు. బీజేపీ తరఫున తాను ఒక్కడినే వస్తానని... కేసీఆర్ ఎప్పుడు టైం తీసుకొని రెడీ అంటే తాము సిద్ధమన్నారు. ఇలాంటి చిల్లర నాటకాలకు కాలం చెల్లిందని.. తెలంగాణ సమాజం ఇలాంటివి నమ్మే పరిస్థితి లేదన్నారు బండి. 


చిల్లర రాజకీయాలకు పరాకాష్ట: డీకే అరుణ


అలాగే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారని జరుగుతున్న వ్యవహారంతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అంటున్నారు. దీని వెనుక బీజేపీ హస్తం ఉందని టీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. సీఎం కేసీఆర్ చిల్లర రాజీయాలకు ఇది పరాకాష్ట అని ఒక ప్రకటనలో మండిపడ్డారు. నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ముగ్గురు బీజేపీ నేతలు వచ్చారంటూ కేసీఆర్ ఒక సినిమా కథను సృష్టించారని ఆరోపించారు. 


మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓటమి ఖాయం: వివేక్


మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోబోతుందని ముందే తెలుసుకున్న సీఎం కేసీఆర్ ఓటర్ల దృష్టిని మల్లించేందుకు డ్రామా ఆడుతున్నారని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ఇందులో భాగంగానే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కథ అల్లారన్నారు. బుధవారం రాత్రి ఆయన మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 


ఎమ్మెల్యేల కొనుగోలుపై టీఆర్ఎస్ ఫైర్..


టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగ కాంతారావు, బీరం హర్ష వర్ధన్ రడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి పార్టీ మారితే డబ్బు, కాంట్రాక్టుల పదవులు  ఇస్తామంటూ కొందరు ప్రలోభ పెట్టారనే విషయం చక్కర్లు కొడుతోంది. ఈ వ్యవహారాన్ని మంత్రులు, టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా తీసుకున్నారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ కూడా రంగంలో దిగనున్నారు. ప్రగతి భవన్ లో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలతో కలిసి.. ఈరోజు ఉదయం 11 గంటల తర్వాత సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు. హైదరాబాద్ శివారు మోయినాబాద్ అజీబ్ నగర్ లోని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్ లో బుధవారం రాత్రి సోదాలు నిర్వహించగా.. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.