Hyderabad Woman Missing: కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు ఏ భార్యాభర్తలు అయినా ఏ సినిమాకో, పార్కుకో వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. హైదరాబాద్ కు చెందిన ఓ జంట కూడా కొత్త సినిమా వచ్చిందని ముచ్చటగా సినిమాకి వెళ్లారు. టికెట్లు తీసుకొని లోపలికి వెళ్లి కూర్చున్నారు. సినిమా కూడా ప్రారంభం అయింది. మధ్యలోనే భార్యకు రెస్ట్‌రూమ్‌కు వెళ్లి వస్తానని భర్తతో చెప్పి బయటకు వెళ్లింది. ఎంత సేపవుతున్నా ఆమె లోపలికి రాకపోవడంతో భర్తే బయటకు వెళ్లాడు. మహిళా సిబ్బందికి విషయాన్ని చెప్పి వాష్ రూంలో వెతికించాడు. అయినప్పటికీ ఆమె జాడ దొరకలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


సంగారెడ్డి జిల్లాకు చెందిన భాస్కర్ రెడ్డి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈనెల 21వ తేదీన భార్య శైలజతో కలిసి సినిమా చూసేందుకు కొత్తగూడలోని ఏఎంబీ మాల్‌ కు వెళ్లాడు. అయితే అప్పటి వరకు సరదాగా ఇద్దరూ కలిసే సినిమా చూశారు. మధ్యలో భార్య శైలజ టాయ్ లెట్ వస్తోందని చెప్పి వాష్ రూమ్ కు వెళ్లింది. 15 నిమిషాలు గడుస్తున్నా ఆమె లోపలికి రాకపోవడంతో.. భాస్కర్ రెడ్డియే బయటకొచ్చాడు. భార్యకు ఏమైందో తెలియక కంగారుపడ్డాడు. మహిళా సిబ్బందికి విషయాన్ని చెప్పి వాష్ రూంలలో వెతికించాడు. కానీ ఆమె అక్కడ కూడా లేకపోవడంతో... పరిసర ప్రాంతాల్లో కూడా వెతికాడు. అయినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో.. తెగ హైరానా పడిపోయాడు. 


ఏం చేయాలో పాలుపోక ఇంటికి చేరుకున్నాడు. విషయాన్ని అమ్మాయితోపాటు తన తల్లిదండ్రులకు కూడా చెప్పాడు. తెలిసిన చోటల్లా వెతకడంతోపాటు.. స్నేహితులు, బంధువులకు ఫోన్ చేసి ఆమె ఆచూకీ గురించి అడిగాడు. ఎక్కడా ఆమె జాడ తెలియకపోవడంతో ఆదివారం రోజు పోలీసులను ఆశ్రయించాడు. అయితే తన భార్య రెండు రోజుల నుంచి కనిపించడం లేదని, ఆమె వద్ద సెల్ ఫోన్ కూడా లేదని భాస్కర్ రెడ్డి చెబుతున్నారు. అంతేకాదు ఐదు నెలల క్రితమే తమకు పెళ్లి జరిగిందని చెప్పుకొచ్చాడు. భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు విచారణ చేపట్టారు. ఏఎంబీమాల్ లో సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. 


నెలరోజుల క్రితం మూడేళ్ల బాలుడి అదృశ్యం - శవంగా లభ్యం


హైదరాబాద్ నాగోల్ అయ్యప్ప కాలనీలో మూడేళ్ల బాలుడి అదృశ్యం విషాదాంతమైంది. ఆడుకుంటూ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన బాలుడు మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. చుట్టుపక్కల ఎంత వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో బాలుడి మృతదేహాన్ని పక్కనే ఉన్న చెరువులో గుర్తించారు. ఒక్కగానొక్క కొడుకు ఇలా చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. పోలీసుల వివరాల మేరకు.. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగోల్ అయ్యప్పనగర్ కాలనీకి చెందిన షేక్షావలి, సాకీరా భార్యభర్తలు. పదేళ్లుగా ఇదే కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి మూడేళ్ల కొడుకు షాహిద్ ఉన్నాడు. నిన్న షేక్షావలి బయటకు వెళ్లగా, సాకీరా ఇంట్లోనే ఉంది. అదే సమయంలో సాహిత్ ఆడుకుంటూ బయటకు వెళ్లాడు. అయితే, చాలా సమయమైనా షాహిద్ ఇంట్లోకి రాకపోవడంతో.. సాకీరా చుట్టుపక్కల గమనించగా ఎక్కడా కనిపించలేదు.


అర్ధరాత్రి శవంగా చెరువులో కనిపించిన బాలుడు.. 


బంధువులు, తెలిసిన వాళ్ల ఇంట్లో ఏమైనా ఉన్నాడా అని సాకీరా ఆరా తీసింది. ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో.. భర్త వచ్చిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో అదృశ్యమైన బాలుడి కోసం స్థానికులు కూడా వెతికారు. ఈ క్రమంలోనే కొందరు స్థానికులు కాలనీకి సమీపంలో ఉన్న చెరువులో అర్ధరాత్రి 12 గంటలకు ఓ మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే వారు విషయాన్ని పోలీసులకు తెలపడంతో.. హుటాహుటిన రంగంలోకి దిగారు. ఈతగాళ్ల సాయంతో ఆ మృతదేహాన్ని బయటకు తీయించారు. అయితే చెరువులో లభ్యం అయిన మృతదేహం అదృశ్యమైన షాహిద్ గా గుర్తించారు. వెంటనే బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆడుకునేందుకు బయటకు వెళ్లి మృతదేహంగా మారిన కుమారుడిని చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. అనంతరం బాలుడిని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.