Telangana News  :  తెలంగాణ కొత్త సచివాలయానికి ఎదురుగా ఉన్న తెలుగు తల్లి విగ్రహం, పొట్టి శ్రీరాములు విగ్రహాలు కనిపించడం లేదని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఆరోపించారు. వాటిని బీఆర్ఎస్ ప్రభుత్వమే కిడ్నాప్ చేసిందని మండిపడ్డారు. నూతన సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న విగ్రహాలు నాలుగు రోజుల క్రితం కిడ్నాప్ కాబడ్డాయి. ఎక్కడున్నాయో తెలియదని.. ఆంధ్రా నాయకులను, చిహ్నాలను అవమానించడమే అలవాటుగా మార్చుకున్న కేసీఆర్ గారు, కేటీఆర్ తెలుగు ప్రజలకు క్షమాపణ చెప్పి, వెంటనే ఆ రెండు విగ్రహాలను పునఃప్రతిష్టింపచేయాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు.            


నాలుగు రోజుల కిందట వరకూ ఉన్న ఆ విగ్రహాలను రాత్రికి రాత్రే అధికారులు తీసేసినట్లుగా తెలుస్తోంది. కొత్త సెక్రటేరియట్ మార్గం కోసం రోడ్లలో మార్పు చేర్పులు చేస్తున్నారు. ఈ సందర్భంగా విగ్రహాలు అడ్డు వస్తాయన్న కారణంగా తొలగించినట్లుగా తెలుస్తోంది. అయితే ఎక్కడ ప్రతిష్టిస్తారన్న దానిపైస్పష్టత లేదు.  తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలుగు తల్లి కాదని.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని బీఆర్ఎస్ రూపొందించింది. అయితే సెక్రటేరియట్ ప్రాంతంలో తెలుగు తల్లి విగ్రహం ప్రత్యేకంగా ఉంటుంది. అక్కడి ఫ్లైఓవర్‌ను తెలుగు తల్లి ఫ్లైఓవర్ అని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడా విగ్రహాన్ని తరలించారని బీజేపీ నేతలు అంటున్నారు.                                                                               
  తెలంగాణంలో కొత్తగా నిర్మిస్తున్న సచివాలయాన్ని నెలాఖరులో ప్రారంభించనున్నారు.  కొత్త సచివాలయాన్ని గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్టుతో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే! భవనంలోకి గాలి, వెలుతురు బాగా వచ్చేలా సహజంగా డిజైన్ చేశారు. ఆవరణలో ఓ ఆలయం, మసీదును కూడా నిర్మిస్తున్నారు. ఈ భవన నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం రూ.617 కోట్లు వెచ్చిస్తోంది. ఈ భవన సముదాయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసింది. కాగా, సచివాలయ ప్రారంభోత్సవంపై నిర్ణయం తీసుకోవడంతో నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కాంట్రాక్టర్ ను ప్రభుత్వం ఆదేశించింది. నిర్మాణ పనుల్లో వేగం పెంచడానికి మూడు షిప్టుల్లో పనులు చేస్తున్నట్లు సమాచారం.                     


సచివాలయం ఎదురుగా చేపట్టిన తెలంగాణ అమరవీరుల స్మారకం కూడా చివరిదశకు చేరుకుంది.  అంబేద్కర్ విగ్రహ నిర్మాణం పూర్తయి ప్రారంభం కూడా జరిగింది. కొత్త సెక్రటేరియట్ నిర్మాణంలో భాగంగా లోపల ఉన్న ఆలయాలు, ప్రార్థనా స్థలాలను కూడా తొలగించారు. వాటిని మరో చోట నిర్మించి ఇస్తున్నారు. ఆ ప్రకారమే .. రోడ్డు కోసం తొలగించిన విగ్రహాలను మళ్లీ ఎక్కడో చోట పెడతారని భావిస్తున్నారు.