ఆదిలాబాద్ జన గర్జన స‌భ‌లో తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన ఆరోపణలపై రాష్ట్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా మాట్లాడిన దాంట్లో ఒక్క మాట కూడా నిజం లేదని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ధ్వజ‌మెత్తారు. బీజేపీ ప్ర‌భుత్వానిది ‘డబుల్ ఇంజిన్’’ కాదు... మీది ‘ట్రబుల్ ఇంజిన్ సర్కార్’ అంటూ ఎద్దేవా చేశారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెలంగాణ ప్ర‌జ‌లు బీజేపీకి క‌ర్రు కాల్చి వాత పెట్ట‌డం ఖాయ‌మ‌న్నారు. కారు స్టీరింగ్ కేసీఆర్  చేతుల్లో ప‌దిలంగా ఉందని, బీజేపీ స్టీరింగ్ మాత్రం వ్యాపారవేత్త అదానీ లాంటి కార్పోరేట్ల చేతుల్లో ఉందని పేర్కొన్నారు.


బీజేపోళ్ల మాటలు తెలంగాణ ప్రజలు నమ్మరని చెప్పారు. అమిత్‌ షా తెలంగాణ‌కు ఎప్పుడొచ్చినా అడ్డగోలుగా మాట్లాడుతారు. నోటికొచ్చిన ఆరోపణలు చేసి పోతరు.  తెలంగాణ రాష్ట్ర‌ అభివృద్ధిపై ఆయనకు కొంచమైన అవగాహన ఉందా? రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో ఎన్ని అభివృద్ధి పనులు జరిగాయో ఆయనకు తెలుసా ?’’ అని  మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్రశ్నించారు.  రాష్ట్ర ప్రజలను అడిగితే అభివృద్ధి, సంక్షేమం గురించి తెలుస్తుందని హితవు పలికారు. రైతు ఆత్మ‌హ‌త్య‌లు, డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు, ఆదివాసీల సంక్షేమంపై మాట్లాడే అర్హ‌త అమిత్ షాకు లేద‌న్నారు. బీజేపీది రైతు వ్య‌తిరేక ప్ర‌భుత్వ‌మ‌ని, బీజేపోళ్లా మాకు నీతులు చెప్పేది అంటూ మండిపడ్డారు. 


కాళేశ్వరం ప్రాజెక్ట్, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల‌కు జాతీయ హోదా, ఆదిలాబాద్ లో సీసీఐ పున‌రుద్ధ‌ర‌ణ‌పై ఎందుకు మాట్లాడలేదని ఇంద్రకరణ్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్రం నుంచి వచ్చినవారు విజన్ తో మాట్లాడాలని, ఇలా ఇష్టరీతిన మాట్లాడటం సరికాదని సూచించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తమ హక్కు అన్నారు. రాష్ట్రానికి కేంద్రం అదనంగా ఇచ్చింది ఏమీ లేదన్నారు. బీజేపీ నేతలు కేంద్రం నుంచి వరుసగా తెలంగాణకు వస్తున్నా, రాష్ట్రం కోసం ఏవీ ప్రకటించడ లేదన్నారు. అమిత్ షా వచ్చినప్పుడల్లా తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. గత తొమ్మిదిన్నర ఏళ్లుగా తెలంగాణ‌కు బీజేపీ కేంద్ర ప్ర‌భుత్వం చేసిందేమి లేద‌ని ఆరోపించారు.


రాజకీయంగా లబ్ది పొందాలని తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఇంద్రకరణ్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ‌కు నిధులు ఇస్తామ‌ని, సీసీఐని పున‌రుద్ద‌రిస్తామ‌ని ఏవైనా హ‌మీలు ఇస్తార‌ని తెలంగాణ ప్ర‌జ‌లు ఆశించార‌ని, కానీ  అమిత్ షా పర్యటన వల్ల తెలంగాణ‌కు ఒరిగిందేమి లేద‌న్నారు.


కేసీఆర్ గుర్తు కారు, దాని స్టీరింగ్ ఒవైసీ దగ్గరే - అమిత్ షా ధ్వజం
తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ బీజేపీ నిర్వహించిన తెలంగాణ జనగర్జన సభలో అమిత్ షా పాల్గొని మాట్లాడారు. మనం ఇక్కడ నినదిస్తే హైదరాబాద్‌లో ఉన్న కేసీఆర్‌కు వినపడాలని అన్నారు. గత పదేళ్లుగా కేసీఆర్ తన కుటుంబం కోసమే పని చేశారని అమిత్ షా అన్నారు. తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ చేశామని కేసీఆర్ చెబుతుంటారని, రైతుల ఆత్మహత్యల విషయంలో రాష్ట్రాన్ని నెంబర్ 1 గా కేసీఆర్ చేశారని అన్నారు. అవినీతి విషయంలోనూ నెంబర్ 1గా చేశారని అన్నారు. కేసీఆర్ ఎన్నికల గుర్తు కారు కానీ, ఆ కారు స్టీరింగ్ మాత్రం ఒవైసీ దగ్గర ఉంటుందని ఎద్దేవా చేశారు.