Razakar Moive Politics :  తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి ఉపయోగపడేలా బీజేపీ కొన్ని ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగా రజాకార్ అనే సినిమాను సిద్ధం చేశారు. గ్రాండ్‌గా ట్రైలర్ రిలీజ్ చేశారు.  ట్రైలర్ చూసిన చాలా మంది రెండు రకాలుగా విడిపోయారు. బీజేపీ అనుకున్న ఎఫెక్ట్ వచ్చింది.  ఒకరు మత విద్వేషాలను పెంచే ప్రయత్నమని విమర్శలు చేస్తూండగా.. నిజాలు చెబితే తప్పేమిటని మరొకరు వాదించారు.  ఈ సినిమా వివాదంలోకి రాజకీయాలు కూడా వచ్చాయి. అసలు రాజకీయాల కోసమే ఈ సినిమా తీశారు. ఇక రాజకీయం కాకుండా ఎలా ఉంటుంది. చరిత్ర తెలియని మూర్ఖులు మత విద్వేషాల కోసం ఈ సినిమా తీశారని.. తాము అడ్డుకుంటామని కేటీఆర్ ప్రకటించారు. ఇది రాజకీయంగా  కలకలం  రేపే సినిమా కావడంతో రాజకీయ పార్టీలు తమ విధానాల్ని ప్రకటించాయి.  అనుకూలంగానో వ్యతిరేకంగానో ప్రకటనలు చేశాయి. కానీ హఠాత్తుగా అంతా సైలెంట్ అయిపోయారు. సినిమా రిలీజ్ పైనా స్పష్టత లేదు. 


కశ్మీర్ ఫైల్స్  ,  కేరళ స్టోరీ తరహాలో రజాకార్ 


కశ్మీర్ ఫైల్స్  ,  కేరళ స్టోరీ వంటి సినిమా భారతీయ జనతా పార్టీ ఎజెండాలో భాగంగా మారాయి. ఆ సినిమాల వెనుక బీజేపీ నేతలు ఉన్నారో లేదో ఎవరికీ తెలియదు కానీ వాటికి  బీజేపీ చేసిన  ప్రమోషన్ అంతా ఇంతా కాదు. స్వయంగా ప్రధాని మోదీ వాటి గురించి ఎన్నికల సభల్లో ప్రస్తావించారు.  వాటిని బీజేపీ ఓన్ చేసుకుంటే.. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న  చోట నిషేధిస్తున్నారు. బీజేపీ రాజకీయాల్లో సినిమాలకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పాల్సిన పని లేదు. ప్రజల అభిప్రాయాలను మార్చగల శక్తివంతమైన సాధనం సినిమా అని ఆపార్టీ అగ్రనేతలు నమ్ముతారు.   అందుకే తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ కూడా  రజాకార్ సినిమాను ప్లాన్ చేశారు. 


 నిర్మాణం పూర్తి చేసుకున్న రజాకార్ 


రజాకార్ ఫైల్స్ తీస్తామని ఎన్నికలకు ముందు విడుదల చేస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు పలుమార్లు ప్రకటించారు బండి సంజయ్. గుట్టుగా నిర్మాణం  పూర్తయింది. ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. నిజాం కాలంలో రజాకార్ల మిలీషియా చేతుల్లో హైదరాబాద్ రాష్ట్రంలోని సామాన్య ప్రజలపై, ముఖ్యంగా హిందువులపై జరిగిన అణచివేత, అవమానాలు, దౌర్జన్యాలు ఈ చిత్ర కథాంశం.  తెలంగాణ బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి  ఈ సినిమా నిర్మాత.   వచ్చే ఎన్నికల్లో దీనిని ఉపయోగించుకోవాలని బీజేపీ చూస్తోందనే ప్రచారం కూడా ఉంది.  హైదరాబాద్ రాష్ట్రంలోని సామాన్య ప్రజలపై జరిగిన అణచివేత, అవమానాలు, దౌర్జన్యాలు ఈ సినిమాలో చూపిస్తున్నారు. 


ట్రైలర్ విడుదల తర్వాత వివాదం ప్రారంభం 


రజాకార్లు, ఆపరేషన్ పోలో, నిజాం పాలన చివరి రోజుల్లో జరిగిన దురాగతాలు, హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలోకి తీసుకురావడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ వీరోచిత పాత్ర గురించి ఇందులో చూపిస్తున్నారు.  సమరవీర్‌ క్రియేషన్స్‌ పతాకంపై నారాయణరెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత భారీ నిర్మాణ విలువలతో నిర్మిస్తున్నారు.    బీజేపీ నేతలు మాత్రం.. జరిగిన చరిత్రను చూపిస్తున్నామని అంటున్నారు. హైదరాబాద్ సంస్థానంలోని రజాకార్ల దురాగతాల గురించి బయటకు తెలియని పలు విషయాలను ఈ సినిమా కథలో చిత్రీకరించినట్టుగా సినిమా వర్గాలు చెబుతున్నాయి. నిజాం పాలనలో హైదరాబాద్ రాష్ట్రంలో పారామిలిటరీ వలంటీర్ దళాన్ని రజాకార్లుగా పిలుస్తారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో ఖాసిం రజ్వీ నాయకత్వంలో వీరి విస్తరణ జరిగింది. హైదరాబాదులో ముస్లింల పాలనను కొనసాగించడానికి, భారత్‌లో విలీనానికి వ్యతిరేకంగా వీరి ప్రతిఘటించి పోరాటం చేశారు. అయితే.. అప్పట్లో వారు హిందువులతో పాటు ముస్లింలను కూడా టార్గెట్ చేసుకుని దాడులు చేశారని చెబుతారు. అయితే ట్రైలర్ మొత్తం హిందువుల్ని .. రజాకార్లు ఊత కోచ కోస్తున్నట్లుగా ఉంది. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా సీన్లు ఉన్నాయని బీఆర్ఎస్ సహా ఇతరులు  విమర్శలు గుప్పిస్తున్నారు. ఖచ్చితంగా ఇదె ఎఫెక్ట్ కోసం బీజేపీ చూస్తోంది. కానీ కీలకమైన సమయంలో ఆ సినిమా రిలీజ్‌పైా సైలెంట్ అయ్యారు. 


ఈ ఎన్నికల సమయంలో ఇప్పుడు విడుదల చేయాలన్నా కష్టమేనన్న వాదన వినిపిస్తోంది. సెన్సార్ వద్దనే సమస్యలు వస్తాయని.. చెబుతున్నారు. రాజకీయంగా మేలు జరగాలంటే.. ఈ లోపే విడుదల చేసి ఉండాల్సిందన్న వాదన వినిపిస్తోంది.