Bhu Bharati Act: భూభారతి చట్టం, పోర్టల్ సోమవారం జాతికి అంకితం, ధరణి భూములపై ఫోరెన్సిక్ ఆడిట్: పొంగులేటి శ్రీనివాసరెడ్డి
Ponguleti Srinivas Reddy | రాష్ట్ర ప్రజల భూములకు భద్రత కల్పించేందుకు భూ భారతి చట్టం, వెబ్సైట్ తీసుకోస్తున్నామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.

Telangana govt set to launch Bhu Bharati Act on April 14 - హైదరాబాద్ : భూములకు భద్రత కల్పించడమే ప్రధాన ధ్యేయంగా భూ భారతి చట్టాన్ని, పోర్టల్ను అందుబాటులోకి తెస్తున్నామని రెవెన్యూ,హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సచివాలయంలోని తన ఛాంబర్లో మీడియాతో ఆదివారం ఇష్టాగోష్టి నిర్వహించారు. డాక్టర్ బి.ఆర్ .అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఈ భూభారతి చట్టాన్ని, పోర్టల్ను ప్రజలకు అంకితం చేస్తారని తెలిపారు.
రాష్ట్రంలో రైతుల భూముల పరిరక్షణ బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అధికారంలో వస్తే ధరణి ()ని బంగాళాఖాతంలో కలుపుతామని మేమిచ్చిన హామీని నమ్మి.. ప్రజలు మాకు అధికారం కట్టబెట్టారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ధరణిని బంగాళాఖాతంలో వేసి అందరికీ ఆమోదయోగ్యమైన భూ భారతి చట్టాన్ని తీసుకురావడం ఇందులో రెవెన్యూశాఖ మంత్రిగా భాగస్వామ్యం అయ్యే అవకాశం తనకు వచ్చినందుకు తన జన్మ ధన్యమైందన్నారు.
3 మండలాల్లో భూ భారతి చట్టం
భూ భారతి చట్టాన్ని తొలుత మూడు జిల్లాలలోని 3 మండలాలలో ప్రయోగాత్మకంగా అమలు చేయబోతున్నాం. ఈ 3 మండలాలలో వచ్చిన ఫలితాలను దృష్టిలో పెట్టుకొని జూన్ 2వ నాటికి పూర్తిస్ధాయిలో అమలు చేస్తామన్నారు. భూభారతి చట్టం 2029 శాసనసభ ఎన్నికలకు మాకు రిఫరెండమని గతంలో శాసనసభలోనే ప్రకటించాం, ఇప్పుడు కూడా మరో మారు స్ఫష్టం చేస్తున్నానని పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. భూములపై రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా రైతాంగానికి ఒక భరోసా , భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ చట్టం రూపొందించాం. గతంలో మాదిరిగా రాత్రికి రాత్రే ఇద్దరు వ్యక్తులు కలిసి చట్టాన్ని రూపొందిస్తే మా ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా రైతులు మేధావులు నిపుణులతో చర్చించి చట్టాన్ని రూపొందించాం. భూ భారతి అమలులోకి వచ్చిన తర్వాత గతంలో చెప్పినట్లుగానే ధరణి ముసుగులో జరిగిన భూ అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయిస్తామని తెలిపారు
ఒకేసారి పోర్టల్లో ప్రవేశించవద్దు
ఒకేసారి భూ యజమానులు తమ భూమి వివరాలు తెలుసుకునేందుకు పోర్టల్ను సందర్శించవద్దని మంత్రి పొంగులేటి రిక్వెస్ట్ చేశారు. దాంతో మొత్తం పోర్టల్ ఆగిపోయే ప్రమాదం ఉందన్నారు. కొంతమంది ఉద్దేశ పూర్వకంగా పోర్టల్ను ఆగిపోయేలా చేయాలని చూస్తే చర్యలు తీసుకునేందుకు రేవంత్ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారని పొంగులేటి తెలిపారు.
కేంద్రప్రభుత్వ ఎన్ ఐ సి ఆధ్యర్యంలో నిర్వహించే పోర్టల్ లో ఆధునిక అంశాలను జోడిస్తూ అత్యాధునిక వెర్షన్ను ప్రజలకు అందించే ప్రయత్నాలు సాగుతున్నాయి. రిజిస్ట్రేషన్లకు ఆటంకం లేకుండా పోర్టల్ అభివృద్ది సాగుతుంది. మే నెల మొదటివారంలో గ్రామ రెవెన్యూ పాలనా అధికారులను అమలులోకి తెస్తాం. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. గతంలో ధరణిని తీసుకువచ్చిన సమయంలో దాదాపు 4 నెలల పాటు రిజిస్ట్రేషన్లు నిలిపివేశారని గుర్తుచేశారు. ఇప్పుడు ఆ పరిస్ధితి లేకుండా క్రమ క్రమంగా పోర్టల్ను అభివృద్ది చేస్తామన్నారు
5 స్థాయిలలో అధికార వికేంద్రీకరణ
రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి చట్టం, పోర్టల్ అమలుకు సంబంధించి ప్రయోగాత్మక గ్రామాలలో స్వయంగా పర్యటిస్తానని మంత్రి పొంగులేటి వెల్లడించారు. సంబంధిత జిల్లాల మంత్రులు కూడా పర్యటిస్తారని తెలిపారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో అవగాహనా సదస్సులు నిర్వహించనున్నాం. భూభారతిలో ఎమ్మార్వో స్ధాయి నుంచి సిసిఎల్ వరకు సుమారు 5 స్ధాయిలలో భూ సమస్యల పరిష్కారానికి వీలుగా అధికారాలు వికేంద్రీకరణ చేశామన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల సంఖ్య ఆధారంగా ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. తర్వాత సమస్యలు తగ్గితే ట్రిబ్యునల్స్ను కుదిస్తాం. ధరణిలో గతంలో ఉండే 33 మాడ్యూల్స్ను ఆరు మాడ్యూల్స్కు తగ్గించాం, దీనివల్ల అందరికీ ఈ పోర్టల్ సులభతరంగా ఉంటుందని మంత్రి తెలిపారు.