Khammam News: ‘‘కరెంటు మంచిగా వస్తుందా? ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఎలా ఉంది? ఎన్నిసార్లు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు? అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు బుధవారం (జూన్ 12) సాయంత్రం ఖమ్మం పాత బస్టాండ్ నుంచి బోనకల్లు మండలం జగన్నాథపురం వరకు సామాన్యుడిలా ప్రయాణం చేస్తూ స్థానికులను పలు అంశాలపై ఆరా తీశారు. సామాన్యుడిలా టికెట్ కొనుక్కొని పల్లె వెలుగు బస్సులో డిప్యూటీ సీఎం ప్రయాణించడం అందరినీ దృష్టిని ఆకర్షించింది.


నాగులవంచ గ్రామానికి చెందిన జానమ్మ, అనంతమ్మలతో డిప్యూటీ సీఎం ముచ్చటించారు. డిప్యూటీ సీఎం ప్రశ్నలకు వారు ఇరువురు స్పందిస్తూ 'బడి, గుడి పేరంటాలకు ఉచితంగా బస్సులో వెళ్లడం మూలంగా డబ్బులు మిగులుతున్నాయి, ఆర్థికంగా కొంత వెసులుబాటు కలుగుతోంది' అని వారు సంతోషంగా సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో ఉచితంగా ప్రయాణం చేసే మహిళలకు జారీ చేస్తున్న జీరో  టికెట్ల విధానం గురించి కండక్టర్ శైలజను డిప్యూటీ సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. 


ఈ సందర్భంగా స్థానికంగా మీడియాతో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పలు అంశాలు వెల్లడించారు. ఫ్రీ బస్సులు వాడుకుంటున్న మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు ఆని భట్టి విక్రమార్క తెలిపారు. మహిళలకు రాష్ట్రంలో ఉచిత ప్రయాణం అమలు చేయడం వల్ల ఆర్టీసీ బలోపేతం అవుతున్నది, కొత్తగా 300 పైగా బస్సులు కొనుగోలు చేశారు. అంతేకాకుండా ఆర్టీసీ విస్తరణకు దోహదపడుతున్నది భట్టి విక్రమార్క అన్నారు. సీతారామ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంతో ప్రయాణికుల సంఖ్య బస్సుల్లో పెరిగినందున కొత్త బస్సులు కావలసిన అవసరం ఏర్పడుతున్నది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు. స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు రుణాలు ఇప్పించి వారితో బస్సులు కొనుగోలు చేయించి వాటిని ఆర్టీసీలో పెట్టాలన్న ఆలోచన చేస్తున్నామని తెలిపారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో 92 శాతం ఉన్న బలహీన వర్గాలు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా మా ప్రభుత్వ పనితీరు ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం పాత బస్టాండ్ లో పాతర్లపాడు గ్రామానికి వెళ్లే బస్సును  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు.


 ఎన్నికల్లో ఇచ్చిన 6 హామీల మేరకు అధికారంలోకి వచ్చి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన గంటలోపే ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని మహిళలకు ప్రారంభించాము అన్నారు . ప్రతినెల రూ.300 కోట్లకు పైగా మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్న  డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీకి చెల్లించడం వల్ల ఆ సంస్థ బలోపేతం అవుతున్నది అన్నారు. కొత్త బస్సుల కొనుగోలు ఆర్టీసీ విస్తరణకు ఉచిత బస్సు పథకం ఎంతగానో దోహదపడుతుందని.. గత ప్రభుత్వంలో ఆర్టీసీ ఉంటుందా? మూసివేస్తారా? అమ్మి వేస్తారా? అనుకునేవారని అన్నారు. ప్రతినెల జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఉండేది కాదని అన్నారు.


గత ప్రభుత్వం ఉద్యోగులకు ప్రతి నెల 15 తర్వాతనే వేతనాలు ఇచ్చేది మేం అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ఉద్యోగులకు ఒకటో తారీఖున వేతనాలు ఇస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రకటించిన ఆరు గ్యారెంటీలో ఐదు గ్యారంటీలను ఇప్పటికే అమలు చేస్తున్న వాటి ద్వారా కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందుతున్నారు. ఇది బీఆర్ఎస్ నాయకుల కంటికి కనబడటం లేనట్టుంది కళ్ళు లేని కబోదులుగా మాట్లాడటం విడ్డూరంగా ఉన్నది అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైరా శాసనసభ్యులు రామదాసు నాయక్, జిల్లా కలెక్టర్ గౌతమ్, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.