Bhatti Vikramarka :  యాదాద్రి వివాదంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. తాను కావాలనే చిన్న స్టూల్ మీద కూర్చున్నా అన్నారు. ఆ ఫోటోతో కావాలనే ట్రోల్స్ చేస్తున్నారని ప్రతిపక్షాలపై  మండిపడ్డారు.  తాను డిప్యూటీ సీఎంగా రాష్ట్రాన్ని శాసిస్తున్నా అని అన్నారు. తాను ఎవరికీ తలవంచే వాడిని కాదన్నారు. ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చునే వాడిని కాదన్నారు. ఆత్మగౌరవాన్ని చంపుకునే మనస్తత్వం తనది కాదని తేల్చిచెప్పారు. 


అసలేంర జరిగిందంటే ?                                  


యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు వెళ్లారు. ప్రధానాలయంలో పూజలు, పట్టువస్ర్తాల సమర్పణ తర్వాత సీఎం, మంత్రులకు వేదపండితులు ఆశీర్వచన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌, ఆయన సతీమణి గీతారెడ్డి, మంత్రులు ఉత్తమ్‌, కోమటిరెడ్డి కూర్చునేందుకు ఆలయ అధికారులు కుర్చీలు వేశారు. డిప్యూటీ సీఎం భట్టి, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖను మాత్రం చిన్నపీటలపై కూర్చోబెట్టారు. ఇది వివాదానికి కారణమైంది. దళిత, బీసీ సామాజికవర్గాలకు చెందిన భట్టి, సురేఖకు అవమానం జరిగిందంటూ సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు ప్రారంభించారు. బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలన్నారు. 


కావాలనే చిన్న పీట మీద కూర్చున్నానన్న భట్టి విక్రమార్క                                    


ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రొటోకాల్‌ విషయంలో ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు, కలెక్టర్‌, ఇతర అధికారులు కచ్చితంగా ఉంటారు.   ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, ముగ్గురు మంత్రులు పర్యటిస్తున్నప్పుడు ప్రొటోకాల్‌ విషయంలో గందరగోళం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదే. అయితే భట్టి విక్రమార్క.. తానే చిన్న పీట మీద కూర్చున్ననని చెబుతున్నారు. 


బీఆర్ఎస్ విమర్శలను తిప్పి కొట్టిన కాంగ్రె్స నేతలు-                                           


యాదగిరిగుట్టలో డిప్యూటీ సీఎం భట్టికి అవమానం జరిగిందంటూ వస్తున్న విమర్శలపై  కాంగ్రెస్ ఇప్పటికే  కౌంటర్ ఇచ్చింది.  ఆలయంలో భట్టికి కూడా కుర్చీ వేశారని, ఆయన కుర్చీ చిన్నగా ఉండడం, మిగతా కుర్చీలు పెద్దగా ఉండడం వల్ల డిప్యూటీ సీఎం కింద కూర్చున్నట్టుగా కనిపించిందని  ఆలయ అధికారులు కూడా స్పష్టం చేశారు. భ ట్టి విక్రమార్క కాస్త ఆలస్యంగా వచ్చారని  ముందుగా వచ్చిన మంత్రులు ముందుగా కూర్చోవడం, చివరన వచ్చిన మంత్రులు చిన్న కుర్చీల్లో కూర్చోవడంతోనే ఇలా జరిగిందని పేర్కొన్నారు. మల్లు భట్టి విక్రమార, మంత్రి కొండా సురేఖను అవమానించినట్టు సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం తగదన్నారు. అందరికీ సమానంగా గౌరవించామని, కేటాయించిన సీట్లు హెచ్చుతగ్గుగా ఉండడం వల్ల దానిని లోపంగా చూస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని  అంటున్నారు.