Bear attacked in the forests of Adilabad:  ఉమ్మడి అదిలాబాద్ జిల్లా తిర్యాణి మండల అటవీ ప్రాంతంలో ఆవుల భూమయ్య అనే వ్యక్తిపై ఎలుగుబంటి దాడింది. ప్రస్తుతం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చే  తిర్యాణి మండలంలోని గంభీరావుపేట్ గ్రామ పంచాయతీకి చెందిన ఆవుల భూమయ్య(60) అనే వ్యక్తి ప్రస్తుతం చావు బతుకుల్లోఉన్నాడు. సోమవారం ఎదులపాడు సమీపంలోని అటవి ప్రాంతంలో ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.            

పశువులు కాసేందుకు అడవిలోకి వెళ్లిన కూలీ                   

గంభీరావుపేట గ్రామపంచాయతీలో ఆవుల భూమయ్య వ్యవసాయ కూలీగా జీవనం కొనసాగిస్తున్నాడు. సోమవారం  పశువుల కాపరి వేరే ఊరు వెళ్లడంతో  రోజు కూలీ కోసం పశువుల్ని మేపేందుకు అంగీకరించాడు. పశువుల్ని తోలుకుని అడవిలోకి వెళ్లాడు. అయితే అతను వెళ్లిన ప్రాంతంలో.. ఓ ఎలుగుబంటి ఉంది. అతి తన పిల్లలను తీసుకుని అటు వైపు వచ్చింది. తన పిల్లలకు ఏమైనా హాని చేస్తాడేమోనని అనుకుందేమో కానీ.. ఒక్క సారిగా భూమయ్య పై దాడి చేసి తీవ్రంగా గాయ పరిచింది. ఎలుగుబంటి హఠాత్తుగా దాడి చేయడంతో  భూమయ్య షాక్‌కు గురయ్యాడు.                        

పిల్లలతో అడవితో తిరుగుతున్న ఎలుగుబంటి - మనిషి కనిపించడంతో దాడి                   

దాడి చేసి..తీవ్రంగా గాయాలు చేసి తన పిల్లలతో కలిసి ఆ ఎలుగుబంటి వెళ్లిపోయింది. బాధతో  భూమయ్య పెద్ద ఎత్తున అవరడంతో..  ఆ అరుపులు విన్న సమీప పాటగూడ గిరిజనులు హుటహుటిన అడవిలోకి వెళ్లి చూశారు. తీవ్ర గాయాలతో  భూమయ్య రక్తం మడుగులో పడి ఉండటం చూశాడు.  గిరిజనులు వెంటనే అతడిని తిర్యాణి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల తరలించాలని వైద్యులు సూచించారు. తీవ్ర రక్తస్రావం కావడం పరిస్థితి విషమంగా ఉండటంతో  మంచిర్యాల తరలించాలని సూచించారు. కానీ  అంబులెన్స్ అందుబాటులో లేకుండా పోయింది.                     

సాయం చేస్తామన్న అటవీ అధికారులు                           

ఇంకా ఎక్కువ సేపు ఎదురు చూస్తే.. వైద్యం ఆలస్యం అవుతుందని   ఓ ప్రైవేట్ ఆటోలో భూమయ్యను మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన గురించి తెలుసుకున్న తిర్యాణి అటవి శాఖ అధికారి శ్రీనివాస్ హుటాహుటిన ఆస్పత్రికి చేరుకొని భూమయ్యను పరామర్శించారు. సంఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం భూమయ్య పరిస్థితి విషమంగా ఉందినీ వైద్యులు తెలిపారు. అటవీశాఖ పరంగా భూమయ్యకు పరిహారం అందించే దిశగా కృషి చేస్తామని అటవీశాఖాధికారి శ్రీనివాస్ తెలిపారు.