సిద్దిపేట జిల్లా కోహెడ మండలం పెద్ద సముద్రాల వద్ద సిద్దిపేట నుండి ఎల్కతుర్తి వరకు జరుగుతున్న జాతీయ రహదారి నిర్మాణ పనులను మాజీ కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ తో కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పరిశీలించారు. రహదారి నిర్మాణ పనుల తీరుతెన్నులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. సిద్దిపేట - ఎల్కతుర్తి 765 డీఎల్ జాతీయ రహదారి నిర్మాణానికి రూ.578 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని అన్నారు. 9 సంవత్సరాలలో దేశ వ్యాప్తంగా జాతీయ రహదారుల నిర్మాణానికి మోదీ ప్రభుత్వం లక్ష కోట్లు కేటాయించిందని అన్నారు. తాను ఎంపీ అయినప్పటి నుండి నాలుగేళ్లలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 వేల కోట్లకు పైగా నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేశానని అన్నారు. 


కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో తెలంగాణలో బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు. బండి సంజయ్ అడగ్గానే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సిద్దిపేట - ఎల్కతుర్తి జాతీయ రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గత యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం తక్కువ, అవినీతి ఎక్కువ జరిగిందని ఆరోపించారు. తెలంగాణలో 1948 నుండి 2014 వరకు జాతీయ రహదారుల నిర్మాణానికి కేవలం 2,500 కోట్లు కేటాయిస్తే, ఈ 9 ఏళ్లలో మోదీ ప్రభుత్వం జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.2,500 కోట్లు కేటాయించిందని అన్నారు. 


ఈ తొమ్మిదేండ్ల మోదీ పాలనలో కేంద్రంలోని ఒక్క మంత్రిపై, ఎంపీపై కూడా అవినీతి ఆరోపణలు రాలేదని అన్నారు. యూపీఏ ప్రభుత్వం కంటే రెండింతలు ఈ తొమ్మిది ఏండ్లలో దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందని అన్నారు. తెలంగాణ కోసం ఆనాడు తాము కూడా కేంద్రంలో పోరాటం చేశామని, కానీ తెలంగాణలో ఇప్పుడు ఒకే కుటుంబం అవినీతి పాలన కొనసాగిస్తుందన్నారు. తొమ్మిదేళ్లలో మోదీ ప్రభుత్వం తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణానికి 1,900 కోట్లు కేటాయించిందని అన్నారు. వచ్చే సంవత్సరం నాటికి ఈ జాతీయ రహదారి నిర్మాణం పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.