ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నిర్మల్ బీజేపీ సభ వేదికగా బండి సంజయ్ నిప్పులు చెరుగుతూ మాట్లాడారు. తెలంగాణ విమోచన దినాన్ని జరపకపోవడంపై తీవ్ర స్థాయి ధ్వజమెత్తారు. పక్క రాష్ట్రాలు ఘనంగా విమోచన దినం జరుపుకుంటుంటే తెలంగాణలో కేసీఆర్ ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. నిర్మల్‌లో తెలంగాణ బీజేపీ ఏర్పాటు చేసిన తెలంగాణ విమోచన సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఈ సభలో బండి సంజయ్ ఆవేశంతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు.


రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చండి
తెలంగాణ విమోచన దినం ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో జెండా ఎగరేయకపోవడం ఏంటని బండి సంజయ్ ప్రశ్నించారు. ఇంత ప్రాముఖ్యం కలిగిన రోజు సీఎం ఫాం హౌస్‌లో పడుకుంటారా? అని ఎద్దేవా చేశారు. గతంలో కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్‌ను అవమానించాడని విమర్శించారు. ‘‘తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవాన్ని సీఎం ఎందుకు జరిపించడం లేదు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లారా? మీ ఒంట్లో నెత్తురు ప్రవహిస్తే ముందుకొచ్చి కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చండి. కర్ణాటక, మహారాష్ట్రలో విమోచన దినాన్ని చక్కగా జరుపుకుంటారు. కానీ, కేసీఆర్ అదంతా మర్చిపోయి.. తెలంగాణను మూడు ముక్కలు చేసి ఒవైసీకి, కొడుకుకు, అల్లుడికి ఇచ్చాడు’’ అని బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.


కేసీఆర్ అవినీతి చరిత్ర పాఠ్యాంశాల్లో చేరుస్తాం
‘‘సర్దార్ పటేల్ లేకపోతే హైదరాబాద్ రాజ్యం పాకిస్థాన్‌లో కలిసిపోయేది. ఆయనే లేకుంటే తెలంగాణ ఏర్పడేదే కాదు. కేసీఆర్‌కు ముఖ్యమంత్రి పదవే వచ్చేది కాదు. నా సర్దార్ పటేల్ చరిత్రను నువ్వు మరుగున పడేలా చేస్తావా? వీరుల చరిత్రను తెరమరుగు చేయడమే సీఎం లక్ష్యం. తప్పకుండా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తాం. నీ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తాం. ముఖ్యమంత్రి నీచమైన చరిత్రను కూడా పాఠ్యాంశాల్లో చేరుస్తాం. ఇలాంటివాళ్లు ఉంటే సమాజానికి తీవ్రమైన నష్టం. రాబోయేది తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం. అమిత్ షా నాయకత్వంలో తెలంగాణలో కాషాయ జెండాను ఎగరవేసే బాధ్యత మాది.’’


నా ఆయుష్షు కూడా పోసుకోవాలి
‘‘బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షా లేని భారత దేశాన్ని ఎవరూ ఊహించలేరు. అమిత్ షా నిర్మల్‌కు రావడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఒక్కసారి అమిత్ షాను ముట్టుకోవాలని అనిపిస్తుంటుంది. ఆయనకు ఉండే ధైర్యం, సాహసాలు నాకు కూడా రావాలని దేవుణ్ని కోరుకుంటా. నాకిప్పుడు 55 సంవత్సరాలు ఉన్నాయి. ఒకవేళ వయసు ట్రాన్స్‌ఫర్ చేసే ఛాన్స్ కనుక ఉంటే నా వయసును కూడా మోదీ, అమిత్ షాకే ఇవ్వాలని నేను అమ్మవారికి మొక్కుకున్నా’’ అని బండి సంజయ్ మాట్లాడారు.