Bandi Sanjay Eye Camps for Congress Leaders: హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా తీరుపై కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు. ప్రపంచమంతా చూస్తున్నా.. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి చెందిన విద్యాసంస్థలు చెరువు ఆక్రమణల్లో లేవని కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మించే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడిపేందుకు ఉత్సాహం చూపే ప్రభుత్వం.. అందరికీ స్పష్టంగా కనిపిస్తున్న ఎంఐఎం ఆక్రమణల వైపు కన్నెత్తి కూడా చూడలేకపోతోందన్నారు. కాంగ్రెస్ నేతలకు ఉచిత నేత్ర పరీక్షలు
చెరువు ఆక్రమణల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు కంటి చూపు సమస్యా? లేక రాజకీయ సంకల్పం లోపించిందా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుల కళ్ళు తెరిపించేందుకు ఆయన తన పార్టీ శ్రేణులకు ఒక వినూత్న పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రతి బీజేపీ కార్యకర్త కాంగ్రెస్ నాయకుల కోసం ఉచిత నేత్ర పరీక్ష శిబిరాలను నిర్వహించాలని సూచించారు. అలా నేత్ర పరీక్షలు చేసిన తర్వాత కూడా వారికి ఒవైసీ కళాశాల ఉన్న చెరువు కనిపించకపోతే.. సమస్య వారి కంటి చూపులో లేదు, కాంగ్రెస్ చేస్తున్న దిగజారుడు రాజకీయాల్లోనే ఉందని బండి సంజయ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
కాంగ్రెస్ అవసరాలకు అనుగుణంగా మారుతున్న ఎఫ్టీఎల్ గీతలు!
హైదరాబాద్ నగరంలో చెరువుల పూర్తి ముంపు పరిధి నిర్ధారణపై బండి సంజయ్ తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ అవసరాలకు, మిత్రపక్షాల ప్రయోజనాలకు అనుగుణంగా ఎఫ్టీఎల్ సరిహద్దు గీతలను ఇష్టానుసారంగా మారుస్తోందనే అనుమానాలు ప్రజల్లో బలంగా వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. పేదలు, సామాన్యులు కట్టుకున్న ఇళ్లకు ఒక న్యాయం.. అధికార పక్షానికి దగ్గరగా ఉంటూ రాజకీయ లబ్ధి చేకూర్చే వారికి మరో న్యాయమా? అంటూ ఆయన నిలదీశారు. చట్టం అనేది అందరికీ సమానంగా అమలవ్వాలి తప్ప.. అధికారంలో ఉన్నవారు తమకు నచ్చినట్లు ఎంపిక చేసుకుని అమలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు.
ప్రజల ప్రశ్నకు సమాధానం చెప్పాలి!
చెరువులు, నాలాల పరిరక్షణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ ద్వంద్వ వైఖరిని తక్షణమే వీడాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. పేదలపై చూపించే ప్రతాపం, బడా రాజకీయ నేతల అక్రమ కట్టడాలపై ఎందుకు చూపించడం లేదో చెప్పాలన్నారు. నగర ప్రజలందరికీ కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్న నిజం.. సకల అధికారాలు, శాటిలైట్ మ్యాప్లు ఉన్న ప్రభుత్వానికి ఎందుకు కనిపించడం లేదో కాంగ్రెస్ అధిష్ఠానం రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హైడ్రా చర్యలు కేవలం విపక్షాలను, సామాన్యులను భయపెట్టడానికే తప్ప.. నిజమైన చెరువుల రక్షణ కోసం కాదనేది ఒవైసీ కాలేజీ వ్యవహారంతో తేలిపోయిందని ఆయన విమర్శించారు.
