మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ నేత కొత్త ప్రభాకర్ రెడ్డిపై సోమవారం దాడి జరిగింది. దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఓ దుండగుడు ఆయనపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఎంపీ పొట్ట భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ప్రచారంలో భాగంగా సూరంపల్లిలో ఓ ఫాస్టర్ కుటుంబాన్ని పరామర్శించి బయటకు వస్తుండగా కరచాలనం చేసేందుకు వచ్చిన వ్యక్తి ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆయనపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఎంపీకి తీవ్ర గాయాలు కాగా భద్రతా సిబ్బంది, ఆయన అనుచరులు గజ్వేల్ ఆస్పత్రికి తరలించారు.






హైదరాబాద్ తరలింపు


నారాయణ్ ఖేడ్ సభకు వెళ్తుండగా విషయం తెలుసుకున్న మంత్రి హరీష్ రావు వెంటనే గజ్వేల్ ఆస్పత్రికి బయలుదేరారు. ఎంపీ ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులు, వైద్యులను ఫోన్ లో అడిగి తెలుసుకున్నారు. అయితే, ముందు జాగ్రత్తగా మెరుగైన వైద్యం కోసం హరీష్ రావు సూచనతో ఎంపీని హైదరాబాద్ తరలించారు.


ఎంపీ ఆరోగ్య పరిస్థితిపై గజ్వేల్ వైద్యులు స్పందించారు. ఎంపీ ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.


నిందితుడి అరెస్ట్


కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసిన నిందితుడు మిరుదొడ్డి మండలం చెప్యాల గ్రామానికి చెందిన రాజుగా పోలీసులు గుర్తించారు. ఎంపీకి షేక్ హ్యాండ్ ఇస్తానని చెప్పి ఈ దాడికి పాల్పడ్డాడు. కత్తితో కడుపులో పొడిచాడు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలు కాగా ఆగ్రహం చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు నిందితున్ని చితకబాదారు. కర్రలతో కొట్టి, కాళ్లతో తన్నారు. అనంతరం అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 


ప్రస్తుతం మెదక్ లోక్ సభ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. ఈ క్రమంలో దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ సమయంలోనే ఆయనపై దాడి జరిగింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: కాంగ్రెస్‌కు కోదండరాం మద్దతు - ప్రజల కోసం 6 షరతులు !