Remand For Arun Pillai :   ఢిల్లీ  లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన రామచంద్ర పిళ్లైని ఏడు రోజుల ఈడీ కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. అరుణ్ రామచంద్ర పిళ్లైని ఉదయం అెరెస్ట్ చేసి  రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు ఈడీ అదికారులు. కేసులో మరో నిందితుడిగా ఉన్న సమీర్ మహేంద్రతో కలిసి ఢిల్లీ లిక్కర్ స్కాంలో.. రామచంద్ర పిళ్లై కీలకంగా వ్యవహరించారని.. హవాలా రూపంలో నగదు లావాదేవీలు చేశారని.. ఈ లావాదేవీలకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉన్నందున  కస్టడీ ఇవ్వాలని పిటీషన్ దాఖలు చేసింది ఈడీ. అధికారుల పిటీషన్ తో ఏకీభవించిన కోర్టు.. అరుణ్ రామచంద్ర పిళ్లైని.. ఏడు రోజుల కస్టడీకి అనుమతించింది.                                            


అరుణ్ రామచంద్ర పిళ్లై  మార్చి 13వ తేదీ వరకు ఈడీ కస్టడీలో ఉండనున్నారు. కస్టడీలో ఉన్న సమయంలో తన తల్లితో ఫోన్ లో మాట్లాడేందుకు అనుతించింది కోర్టు. అదే విధంగా ప్రతి రోజూ తన భార్య, బావమరిదిని కలుసుకునేందుకు సైతం అంగీకరించింది న్యాయస్థానం. అనారోగ్యంతో బాధపడుతున్న పిళ్లైకు.. హైపో థెరాయిడ్ మందులు, వెన్ను నొప్పికి బెల్ట్ ను కస్టడీలోనూ ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది కోర్టు. కెమెరా ముందు మాత్రమే ప్రశ్నించాలని ఈడీ అధికారులను ఆదేశించింది కోర్టు.                      


రామచంద్ర పిళ్లైను ఇప్పటికే 29 రోజులు విచారించామని.. అయినా ఎలాంటి సమాచారం ఇవ్వటం లేదని.. కస్టడీ కావాలని కోరారు అధికారులు.  మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని కోర్టుకు ఈడీ అధికారులు తెలిపారు.    సౌత్ గ్రూప్ లో  కొంత మందికి బినామీగా  అరుణ్ రామచంద్రపిళ్లై వ్యవహరించినట్లు కోర్టుకు వివరించింది ఈడీ. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అతని పాత్ర చాలా స్పష్టంగా ఉందని.. ఇండో స్పిరిట్ కంపెనీలో అతను భాగస్వామిగా కూడా ఉన్నారని కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్స్ వివరించింది ఈడీ.  రాబిన్ డిస్టిలరీస్‌ పేరుతో వ్యాపారం చేసిన రాంచంద్ర పిళ్లై.. ఢిల్లీ పెద్దలకు పెద్ద మొత్తంలో ముడుపులు చెల్లించినట్లు సాక్ష్యాలు ఉన్నాయన్నారు.                    


ఇండో స్పిరిట్‌తో పాటు కొందరి నుంచి 2 కోట్ల 30 లక్షలు వసూలు చేసి ఢిల్లీ పెద్దలకు ముట్టజెప్పినట్లు ఇంతకు ముందు చార్జిషీట్‌లో తెలిపారు.  ఢిల్లీ లిక్కర్ స్కాంలో 14వ నిందితుడిగా ఉన్నారు  రామచంద్ర పిళ్లై. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే 11 మంది అరెస్టయ్యారు. పిళ్లై రిమాండ్ రిపోర్టులో చాలా కీలక విషయాలను ఈడీ ప్రస్తావించింది. మొత్తం లిక్కర్ పాలసీలో 12 శాతం లాభం వచ్చేలా చూసుకుని అస్మదీయులకు ఏజెన్సీలు ఇచ్చారని.. ఆ పన్నెండు శాతంలో ఆరు శాతం లాభం ఆప్ కు మళ్లించారని.. ఈడీ ఆరోపించింది. ఈ కేసు మరిన్నికీలక మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది.