కానిస్టేబుల్ నియామక ప్రక్రియపై తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు జిల్లా ఎస్పీలు, కమిషనర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రశ్నలు తప్పుగా రావడంతో 4 మార్కులు కలపాలని హైకోర్టు కొన్ని రోజుల క్రితం ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, కోర్టు ఆదేశించినా నియామక ప్రక్రియ కొనసాగుతుందంటూ పలువురు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో మెడికల్ టెస్టులు నిలిపివేయాలని కోర్టు సూచించింది. ఈ క్రమంలో బోర్డు మళ్లీ ఆదేశాలు ఇచ్చే వరకు మెడికల్ టెస్టులు నిర్వహించొద్దని నియామక బోర్డు ఆదేశించింది.


తెలంగాణలో పోలీస్‌ కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా ముగిసింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు 1,08,940 మంది అభ్యర్థులు హాజరయ్యారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనంతరం 97,175 మందిని ప్రొవిజినల్ సెలక్షన్ కు ఎంపిక చేశారు. అక్టోబర్‌ 4న ఫలితాలు విడుదల కాగా, మొత్తం 15,750 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారు. వీరిలో 12,866 మంది పురుషులు.. 2,884 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. కాగా.. తుది ఎంపిక ప్రక్రియపై అభ్యంతరాల నివృత్తికి పోలీస్ నియామక బోర్డు (TSLPRB) అవకాశం కల్పించింది. అయితే, పీటీవోలోని 100 డ్రైవర్ పోస్టులు, విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖలోని 225 పోస్టులకు కోర్టు కేసుల కారణంగా ఫలితాలు విడుదల చేయలేదని అధికారులు తెలిపారు.


4 ప్రశ్నలు తొలగింపు


తెలంగాణలో కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ కు రాష్ట్ర హైకోర్టు బ్రేకులు వేసిన సంగతి తెలిసిందే. తుది పరీక్ష నుంచి 4 ప్రశ్నలు తొలగించాలని,  అందరికీ 4 మార్కులు కలిపి ఫలితాలు వెల్లడించాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ జరిగిన తరువాతే కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ చేయాలని రాష్ట్ర పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డుకు సూచించింది. 122, 130, 144 ప్రశ్నలను తెలుగులోకి అనువదించలేదని, 57 ప్రశ్న తప్పుగా ఉన్నందున వాటిని ప్రశ్నపత్రం నుంచి తొలగించాలని ఆదేశించింది. దాదాపు 23 ప్రశ్నలకు అభ్యంతరాలు తెలుపుతూ 2022, ఆగస్టు 30న హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. 


నియామక ప్రక్రియలో కొత్త తగాదాలు


తెలంగాణలో పోలీసు ఉద్యోగాల నియామక ప్రక్రియలో కొత్త తగాదాలు తలెత్తుతున్నాయి. ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీలో బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళా అభ్యర్థుల కటాఫ్ మార్కుల కంటే, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల కటాఫ్ మార్కులు చాలా తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. 


తెలంగాణ పోలీసుశాఖలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 587 సబ్ ఇన్‌స్పెక్టర్, 16,604 కానిస్టేబుల్ పోస్టులకు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు గతేడాది నోటిఫికేషన్ విడుదల చేసింది. లక్షల మంది యువత ఈ ఉద్యోగాల కోసం పోటీ పడ్డారు. నోటిఫికేషన్ విడుదలయ్యే నాటికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై కోర్టుల్లో కేసులు ఉన్నాయి. దీంతో ఈ నోటిఫికేషన్‌కు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తించబోవని బోర్డు పేర్కొంది.


ప్రిలిమినరీ ఎగ్జామ్ వరకూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు లేవు. కానీ, ఫైనల్ ఎగ్జామ్‌కు ముందట ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పిస్తూ నోటిఫికేషన్‌లో సవరణలు చేశారు. నియామకాల్లో 10 శాతం పోస్టులను ఈడబ్ల్యూఎస్ కింద కేటాయించారు. తుది పరీక్షకు సంబంధించిన ఫలితాలను మూడ్రోజుల క్రితమే పోలీసు నియామక బోర్డు విడుదల చేసింది. ప్రతి జిల్లాలోనూ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల కటాఫ్ కంటే బీసీ, ఎస్సీ, ఎస్టీల కటాఫ్ మార్కులు ఎక్కువగా ఉన్నాయి.


బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళా అభ్యర్థుల కటాఫ్ కంటే కూడా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల కటాఫ్ తక్కువగా ఉంది. ప్రతి జిల్లా, ప్రతి కమిషనరేట్‌లోనూ అత్యల్ప కటాఫ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులదే ఉంది. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు తక్కువ మంది ఉండటం, వారికి కేటాయించిన పోస్టులు ఎక్కువగా ఉండడం వల్లే వారి కటాఫ్ తక్కువగా ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది.