Breaking News Live Telugu Updates: నేడు అన్ని ఆలయాల మూసివేత, రేపే మళ్లీ దర్శనాలు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 25 Oct 2022 12:22 PM
MBS Jewellers: ఎంబీఎస్ జ్యువెలర్స్ డైరెక్టర్ ED కస్టడీకి తరలింపు

  • చంచల్ గూడ జైలులో రిమాండ్ లో ఉన్న ఎంబీఎస్ జ్యువెలర్స్ డైరెక్టర్ సుఖేశ్ గుప్తాను ఈడీ  కస్టడీ తరలింపు 

  • 25 నుంచి నవంబర్ 2వ తేదీ వరకూ సుఖేశ్ గుప్తా ఈడీ కస్టడీలోనే

  • 9 రోజుల పాటు సుఖేష్ గుప్తాను కస్టడీలోకి తీసుకోని అన్ని కోణాల్లో  విచారించనున్న ఈడీ అధికారులు

27న వైయస్‌ జగన్‌ నెల్లూరు జిల్లా పర్యటన

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులో ఏపీ జెన్‌కో ప్రాజెక్ట్‌ మూడో యూనిట్‌ (800 మెగావాట్లు) ను ముఖ్యమంత్రి జగన్ జాతికి అంకితం చేయనున్నారు. ఉదయం 9.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి, 10.55 గంటలకు కృష్ణపట్నం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. 11.10 నుంచి మధ్యాహ్నం 1.10 గంటల వరకు నేలటూరులో ఏపీజెన్‌కో ప్రాజెక్ట్‌ మూడో యూనిట్‌ (800 మెగావాట్లు) జాతికి అంకితం చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1.35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 3.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Tirumala News తిరుమలకు వచ్చిన ప్రపంచ యాత్రికుడు

ప్రపంచ టూర్ లో భాగంగా ఓ ఎన్ఆర్ఐ భక్తుడు బైక్ లో తిరుమలకి చేరుకున్నాడు. ఆస్ట్రేలియాకీ చెందిన 63 ఏళ్ల మైఖేల్ బైక్ పై ప్రపంచం మొత్తం చుట్టాలని నిర్ణయించుకొని మూడేళ్ల క్రిత్తం బైక్ పై తన యాత్రను ప్రారంభించి నేపాల్ కీ చేరుకున్నాడు. ఆ సమయంలోనే కరోనా మహామ్మారి ప్రబలడంతో రెండేళ్ల పాటు నేపాల్ లోని ఉండిపోయారు. కొద్ది రోజుల క్రితం భారతదేశానికి చేరుకొని అధ్యాత్మిక క్షేత్రాలైన వారణాసి, పూరితో పాటు పలు క్షేత్రాలను సందర్శిస్తున్నారు. ఆ క్రమంలోనే నేడు బైక్ పై తిరుమలకి చేరుకొన్నారు. ఆలయం వద్దకు వెళ్ళి బయట నుంచి స్వామి వారిని మొక్కుకున్న మైఖేల్ అటు తరువాత తిరుపతికి వెళ్ళిపోయారు. 6 నెలలు పాటు భారత్ లో తన పర్యటన కొనసాగుతుందని.. ఇప్పటికే 4 వేల కిల్లో మీటర్ల బైక్ పై పలు ప్రాంతాలకు వెళ్లానని, 20 వేల కిల్లో మీటర్ల పాటు భారత్ లో తిరుగుతానని మైఖేల్ చెప్పారు.

Solar Eclipse: నేడు బాసర ఆలయం మూసివేత, రేపే మళ్లీ దర్శనాలు

సూర్యగ్రహణం కారణంగా నేడు బాసర సరస్వతీ దేవి ఆలయం మూసివేశారు. నేడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ద్వారబంధనం, ప్రధాన ఆలయంతో పాటు ఉప ఆలయాల్లో ఆర్జిత సేవలు రద్దు చేశారు. సంప్రోక్షణ చేశాక ఆలయాలు తెరుచుకుంటాయని అధికారులు తెలిపారు. ఇక రేపటి నుంచి యథాతథంగా ఆర్జిత సేవలు కొనసాగనున్నట్లు చెప్పారు.

Background

నైరుతి రుతుపవనాల కాలం అయిపోయింది. ఇక ఈశాన్య రుతుపవనాల వర్షాలు త్వరలోనే మొదలవుతాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన సిత్రాంగ్ తుఫాను బంగ్లాదేశ్ వైపుగా వెళ్లగా, ఏపీలో ఉన్న తేమని లాగి బంగ్లాదేశ్, ఈశాన్య భారత దేశం ప్రాంతాలైన నాగాలాండ్, త్రిపుర, మేఘాలయలో ప్రభావం చూపనుంది. సిత్రాంగ్ తుఫాను కారణంగా ఏపీ, తెలంగాణలో చలి తీవ్రత​పెరుగుతోంది. వర్షాలు దాదాపుగా తగ్గుముఖం పడుతున్నాయి. సిత్రాంగ్ తుపాను సోమవారం ఒడిశా తీరాన్ని చేరుకుంది. అలాగే ప్రయాణిస్తూ అక్టోబర్ 25న పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌ల మధ్య సిత్రాంగ్ తుపాను తీరం దాటుతుందని వాతావరణ శాఖ తెలిపింది. సాగర్ ద్వీపానికి దక్షిణ - ఆగ్నేయంగా 520 కి.మీ, బంగ్లాదేశ్‌లోని బారిసల్‌కు దక్షిణంగా 670 కి.మీ. దూరంలో, పోర్ట్ బ్లెయిర్‌కు వాయువ్యంగా 760 కి.మీ దూరంలో కేంద్రకృతమై ఉంది. రెండు రోజుల పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్, అసోం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి.


ఈశాన్య రుతుపవనాల వర్షాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 29 నుంచి పరిస్ధితులు వర్షాలకు అనుకూలంగా మారతాయి. శ్రీలంక, మధ్య తమిళనాడు మీదుగా అల్పపీడనం ఏర్పడనుంది, దీని వలన ఏపీలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. దక్షిణ ఆంధ్రప్రదేశ్ లో అక్టోబర్ చివర్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఓవైపు వర్షాలు తగ్గినా, మరోవైపు రాత్రివేళ ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి. ఏపీలో కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలుండగా, తెలంగాణలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడతాయి.


తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
సిత్రాంగ్ తుపాను ప్రభావంతో వర్షాలు అంతగా కురవకపోయినా చలి తీవ్రత రాష్ట్రంలో పెరుగుతోంది. తుపాను ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటాయి. కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఉదయం పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాత్రి వేళ చలి తీవ్రత సైతం అధికం అవుతోంది. హైదరాబాద్ లో ఆకాశం నిర్మలంగా ఉంటుంది. నగరంలో ఉదయం వేళ పొగమంచు ఏర్పడుతుంది. హైదరాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రత 30 కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీలుగా నమోదైంది. ఉత్తర దిశ నుంచి గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. 


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఓవైపు సిత్రాంగ్ తుపాను బంగ్లాదేశ్ వద్ద తీరాన్ని దాటనుంది. మరోవైపు ఈశాన్య రుతుపవనాలు ఉత్తర కోస్తాంధ్రలో విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో అక్టోబర్ చివరి నుంచి కోస్తాంధ్రాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. సిత్రాంగ్ తుపాను ముప్పు ఏపీపై లేనప్పటికీ, చలి తీవ్రత పెరుగుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో పలుచోట్ల తేలికపాటి జల్లులు కురవనున్నాయి. ఉత్తర బంగాళాఖాతం తీరం నుంచి గంటకు 70 నుంచి 80 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో గాలులు తీవ్రత గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లకు తగ్గనుందని అధికారులు తెలిపారు. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల వర్ష సూచన ఉంది. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లడం సురక్షితం కాదని హెచ్చరించారు. 


దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడింది. అయితే దీని ప్రభావం ఏపీపై అంతగా లేదని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయి. ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలున్నాయి. రాయలసీమలోనూ వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. సిత్రాంగ్ తుపాను ప్రభావం చాలా తక్కువగా ఉంది. చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడతాయి.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.