Breaking News: దిల్లీలో మళ్లీ ప్రభుత్వ సిబ్బందికి వర్క్‌ఫ్రమ్‌ హోం .. సుప్రీం ఆదేశాలతో కేజ్రీవాల్ సర్కారు దిద్దుబాటు చర్యలు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP Desam Last Updated: 13 Nov 2021 06:26 PM
మహిళా ఎస్సై పట్ల అనుచితంగా ప్రవర్తించాడని టీఆర్ఎస్ నేతపై కేసు

సిరిసిల్ల జిల్లా యువజన టీఆర్ఎస్ విభాగం అధ్యక్షుడు మనోజ్‌పై కేసు నమోదైంది. మహిళా ఎస్సైపట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు కేసు నమోదు చేశామని సీఐ అనిల్‌ వెల్లడించారు. సిరిసిల్లలో బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణులు ఘర్షణ పడగా.. ఆపేందుకు వెళ్లిన మహిళా ఎస్సై పట్ల మనోజ్‌ అనుచితంగా ప్రవర్తించాడని తెలిపారు. ప్రధానిపై రసమయి బాలకిషన్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ నిరసనకు దిగింది. గాంధీ చౌక్‌ వద్ద రసమయి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు భాజపా శ్రేణులు యత్నించాయి.

తిరుమల తిరుపతి దేవస్థానానికి అరుదైన గుర్తింపు

తిరుమల తిరుపతి దేవస్థానానికి అరుదైన గుర్తింపు లభించింది. ప్రపంచంలో ఏ ఇతర ఆలయంలో లేని విధంగా భక్తులకు సేవలందిస్తున్నందుకు గాను తితిదేకు ఇంగ్లాండ్‌కి చెందిన వరల్డ్‌ బుక్‌ ఆఫ్ రికార్డ్స్‌ సంస్థ సర్టిఫికెట్‌ అందజేసింది. శనివారం తిరుమలలో తితిదే పాలకమండలి ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డికి  ఆ సంస్థ ప్రతినిధులు ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వై.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో ఎక్కడా లేనంతగా భక్తులకు సేవలు, సదుపాయాలు అందిస్తోందన్నారు. సాధారణ రోజుల్లో తిరుమలలో  60 నుంచి 70వేల మంది భక్తులకు చిన్న పాటి అసౌకర్యం కూడా లేకుండా సంతృప్తికరమైన దర్శనం చేయిస్తున్నామన్నారు. క్యూలైన్ల నిర్వహణ శాస్త్రీయ పద్ధతిలో జరుగుతోందని సుబ్బారెడ్డి చెప్పారు. రోజుకు 3.5లక్షల లడ్డూలు ఆరోగ్యకరమైన వాతావరణంలో తయారు చేస్తున్నట్టు వివరించారు.

గడ్చిరోలిలో  ఎదురుకాల్పులు.. ఏడుగురు మావోయిస్టులు మృతి

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా పోలీసులకు మావోయిస్టులకు మధ్య భికర ఎదురు కాల్పులు జరిగాయి.  గడ్చిరోలి జిల్లా ధనోరా తాలుక గ్యారబట్టి అటవీ ప్రాంతంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. అయితే ఈ కాల్పుల్లో... ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. కోర్చి పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. కోర్చి పీయస్ పరిధిలో మావోయిస్టులు ఉన్నట్లు పక్క సమాచారం రావడంతో గడ్చిరోలి జిల్లా పోలీసులు.. కూంబింగ్ చేశారు. పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు.

గడ్చిరోలిలో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. ఐదుగురు మావోలు మృతి

మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మరణించినట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర సరిహద్దులోని గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి అటవీ ప్రాంతంలో పోలీసులు శనివారం కూంబింగ్‌ నిర్వహిస్తున్నప్పుడు మావోయిస్టులు కాల్పులకు పాల్పడ్డారు.  దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. అనంతరం ఆ ప్రాంతంలో ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. ఇరు వర్గాల మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం. 

బాలికలపై పాస్టర్ లైంగిక వేధింపులు

కర్నూలు జిల్లా చాగలమర్రి మండలంలో ఇద్దరు బాలికలపై చర్చి పాస్టర్ లైంగిక వేధింపులు తీవ్ర కలకలం రేపుతోంది. ఈ విషయం బయటకు రాకుండా మధ్య వర్తుల ద్వారా పంచాయతీ చేసినట్లుగా తెలుస్తోంది. బాలిక తల్లి ఫిర్యాదుతో పాస్టర్ పై ఫోక్సో యాక్ట్, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం పాస్టర్ ను పోలీసులు అరెస్టు చేశారు. 

ఉరి వేసుకుని యువతి మృతి... ప్రేమికుడే కారణమని బంధువుల ఆరోపణ

తూర్పు గోదావరి జిల్లా రాజోలు తుఫాన్ కాలనీలో కుసుమ శ్రీలత (21) అనే యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. యువతి మరణానికి మామిడికుదురు మండలం గోగన్నమఠం గ్రామానికి చెందిన నేల సిద్ధాంతరావు కుమారుడు మనోజ్ కారణమని యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శ్రీలతను ప్రేమించిన మనోజ్ పెళ్లి విషయంలో ఏ మాటచెప్పకపోవడంతో మనస్థాపంతో యువతి ఆత్మహత్య చేసుకుందని బంధువు చెబుతున్నారు. ఆత్మహత్య చేసుకుంటున్న దృశ్యాలను యువతి వాట్సాప్ లో ప్రేమించిన మనోజ్ కి పంపినా ఎవరికి తెలపక పోవడంతో అనుమానాలకు దారితీస్తుంది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన రాజోలు సీఐ దుర్గా శేఖర్ రెడ్డి, ఎస్సై కృష్టమాచారి అసహజ మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రవి మృతి.. ఏడాదిన్నర ఆలస్యంగా ప్రకటన

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రవి మృతిచెందాడు. బాణం బాంబులను పరీక్షిస్తున్న పరిశీలిస్తున్న సమయంలో ప్రమాదం జరగడంతో మావోయిస్టు కేంద్ర కమిటీ లో లో టెక్ టీం సభ్యుడయిన రవి చనిపోయాడు. రవి చనిపోయి ఏడాదిన్నర అవుతోందని.. చాలా ఆలస్యంగా ప్రకటిస్తున్నట్లు మావోయిస్టు కేంద్ర కమిటీ ఓ ప్రకటనలో వెల్లడించింది. జార్ఖండ్ లోని మారుమూల ప్రాంతంలో రవి మృతి చెందినట్లు మావోయిస్టు కేంద్ర కమిటీ తాజాగా ప్రకటించింది. టెక్నికల్ టీమ్ లో కీలక సభ్యుడిగా రవి సేవలు అందించారని, ఆయన కుటుంబానికి కేంద్ర కమిటీ ప్రగాఢ సానుభూతి తెలిపింది. కమ్యూనికేషన్స్ తో పాటుగా ఎలక్ట్రానిక్ డివైస్ తయారు చేయడంలో రవి దిట్ట అని పేర్కొన్నారు. 

వరిసాగు లెక్కలపై బండి సంజయ్ అబద్ధాలు చెప్తున్నారు : మాజీ ఎంపీ వినోద్ కుమార్

 బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పై రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఫైర్ అయ్యారు. వరిసాగుపై తెలంగాణ రాష్ట్ర లెక్కలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చిందని ఇప్పటికే తెలంగాణలో 59 లక్షల ఎకరాల్లో పంట సాగు అవుతోందని పేర్కొందన్నారు. మరోవైపు రాష్ట్రంలో 61 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నామని సీఎం కేసీఆర్ చెబితే తప్పుపడతారా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ తాజా లెక్కలపై బండి సంజయ్ ఏమని సమాధానం చెబుతారని ప్రశ్నించారు. వరిసాగు లెక్కలపై అబద్ధాలు చెప్పిన బండి సంజయ్ ఇప్పుడు ముఖం ఎలా చూపిస్తారని విమర్శించారు.

నేడు తిరుమలకు సీఎం జగన్‌ 

ఏపీ సీఎం జగన్ ఇవాళ, రేపు తిరుపతిలో పర్యటించనున్నారు. శనివారం రాత్రి సీఎం జగన్ కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకుంటారు. సీఎం జగన్‌ శనివారం సాయంత్రం 6.15 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరి రేణిగుంట చేరుకుంటారు. తిరుపతిలో జరిగే సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశానికి హాజరయ్యే కేంద్ర మంత్రి అమిత్‌షాకు స్వాగతం పలకనున్నారు. అనంతరం ఇద్దరూ కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. తర్వాత జగన్‌ రేణిగుంట చేరుకుని తిరిగి తాడేపల్లి వెళ్లనున్నారు. 

రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్ షర్మిల రైతు వేద‌న నిరాహార దీక్ష

తెలంగాణ ప్ర‌భుత్వం వ‌రి ధాన్యం కొనుగోలు చేసేది లేదని చెబుతుందని, తాము రైతుల‌కు అండ‌గా నిలుస్తామని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. తమ పార్టీ ఆధ్వ‌ర్యంలో ష‌ర్మిల ఈ రోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 వరకు హైదరాబాద్ లోని ధర్నా చౌక్ , ఇందిరా పార్క్ వ‌ద్ద "రైతు వేద‌న" నిరాహార దీక్షచేయనున్నారు. 
మూడు రోజులపాటు దీక్షకు అనుమతి కోరగా నిరారకరించారు. ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వని కారణంగా ఇందిరాపార్కు వద్ద 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రైతు వేదన దీక్ష చేస్తారు. మిగతా 63గంటల పాటు లోటస్ పాండ్ పార్టీ కార్యాలయంలో రైతు వేదన దీక్ష కొనసాగిస్తారు. 

Background

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ ప్రభావం దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఏపీ, తెలంగాణలపై ఉంది. ముఖ్యంగా ఏపీ, తమిళనాడులో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులపాటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో నిన్నటి మాదిరిగానే తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.


గత నాలుగైదు రోజులుగా తమిళనాడు, ఏపీలోని దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంతాల్లో వేగంగా ఈదురు గాలులు వీస్తున్నాయి. మత్స్యాకారులను సైతం వేటకు వెళ్లవద్దని అమరావతి వాతావరణ కేంద్ర అధికారులు హెచ్చరించారు. మత్స్యకారులు విశాఖపట్నం సహా తీరప్రాంతాల్లో నవంబర్ 13 వరకు చేపల వేటకు వెళ్లకపోవడం మంచిదని అధికారులు హెచ్చరించారు.  కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని సూచించారు. 


తెలంగాణలో ఇలా.. 
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో దీని ప్రభావం తెలంగాణపై ఉండనుంది. తెలంగాణలో మరో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.  నేడు దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వర్షాలతో ధాన్యం తడిచే అవకాశం ఉందని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


భారత్ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ(శనివారం) స్థిరంగా కొనసాగుతున్నాయి. కానీ వెండి మాత్రం కేజీకి రూ.800 పెరిగింది. 22 క్యారెట్ల ధర గ్రాముకు రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల ధర గ్రాముకు రూ.50,070గా ఉంది. హైదరాబాద్‌లో, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,070, దిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,420, బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,070గా ఉంది.


దేశంలో చమురు ధరలు ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టాయి. దీంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో లీటర్ డీజిల్ ధర రూ. 94.62, లీటర్ పెట్రోల్ ధర రూ.108.20గా ఉంది. వరంగల్‌లో తాజాగా పెట్రోల్ ధర రూ.107.88గా ఉంది. డీజిల్ ధర రూ.94.31 గా ఉంది. 


ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా.. ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర. రూ.110.29 గా ఉంది. డీజిల్ ధర లీటర్ రూ.96.36గా ఉంది. అయితే అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా పెరుగుతూనే ఉన్నాయి. విశాఖపట్నం ఇంధన మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.109.57గా ఉంది. గత ధరతో పోలిస్తే రూ.0.08 పైసలు తగ్గింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.95.66గా ఉంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.