Breaking News Live Updates: నిజాంపేటలో ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్యాయత్నం, ఇద్దరు మృతి 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 12 May 2022 01:53 PM
Nizampeta : నిజాంపేటలో ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్యాయత్నం, ఇద్దరు మృతి 

మేడ్చల్ జిల్లా నిజాంపేట వినాయక నగర్ లో ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. లలిత(56) , శివ కార్తికేయ (18 నెలలు) , దివ్య (32) ఆత్మహత్యాయత్నం చేశారు. అమ్మమ్మ లలిత, శివ ఇద్దరూ చనిపోయారు. తల్లి దివ్య ఆసుపత్రిలో చికిత్స పోయిందుతుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన బాచుపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Sirisilla News : రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం, ఇద్దరు చిన్నారులతో సహా తల్లి ఆత్మహత్య

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. తల్లి, ఇద్దరు కొడుకులతో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహలతో నిన్న రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయిన అనూష, తనతో పాటు గణ(3), మణి (18 నెలలు) కొడుకులతో సహా బావిలో దూకి దారుణానికి పాల్పడింది. 

Tirumala News: తిరుమల సేవలో మంత్రి, హీరో

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబు, సినీ నటుడు విశ్వక్ సేన్ వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Narayanpet Orange Travels Bus Accident: నారాయణ పేటలో ప్రైవేటు బస్సు బోల్తా

నారాయణపేట జిల్లాలోని మాగనూరు దగ్గర ఆరెంజ్‌ ట్రావెల్స్‌ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు. 

C Narasimha Rao: సామాజిక అంశాల విశ్లేషకులు నరసింహారావు ఇకలేరు

ప్రముఖ సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకులు సి. నరసింహారావు తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 73 ఏళ్లు.  చాలా కాలం నుంచి అనారోగ్యంతో ఉన్న ఆయన బుధవారం అర్ధరాత్రి చనిపోయారు. నేడు ఫిల్మ్ నగర్ మహా ప్రస్థానంలో అంత్యక్రియలు చేయనున్నారు.

Background

అసని తుపాను బలహీనపడి తీవ్ర వాయుగుండంగా తీరం దాటేసింది. దీనికి సంబంధించి ఐఎండీ బుధవారం రాత్రి ప్రకటన చేసింది. తుపాన్ కాస్త బలహీనపడి తీవ్ర వాయుగుండంగా బుధవారం సాయంత్రం తీరం దాటింది. కృష్ణా జిల్లా కృత్తివెన్ను వద్ద (మచిలీపట్నం - నరసాపురం మధ్య) తీరం దాటిందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ తీవ్ర వాయుగుండం తీరం దాటే సమయంలో గంటకు 55 నుంచి గరిష్ఠంగా 75 కిలో మీటర్ల వేగంతో తీవ్రమైన గాలులు వీచాయి. గురు, శుక్రవారాల్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. తీరం దాటిన అసని తీవ్ర వాయుగుండం ఉత్తర ఈశాన్యంగా యానాం, కాకినాడ, తుని వరకు తీరం వెంబడి పయనిస్తూ మళ్లీ సముద్రంలో కలిసే అవకాశం ఉందని అంచనా వేశారు.


దీని ఫలితంగా వచ్చే మూడు రోజుల వరకూ వాతావరణ అంచనాలను వాతావరణ అధికారులు ప్రకటించారు. ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. భారీ, నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. బలమైన ఈదురుగాలులు గంటకు 70 నుంచి 80 కిలో మీటర్ల వేగంతో, గరిష్ఠంగా 90 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.


రాయలసీమలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, ఉరుములు, జల్లులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు మాత్రం ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. తుపాను నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ 24 గంటలూ అందుబాటులో ఉండేలా హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ డైరెక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు అత్యవసర సహాయం కోసం 1070, 1800 425 101 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.


Telangana Weather తెలంగాణలో వాతావరణం ఇలా
అసని తుపాను ఎఫెక్ట్ తెలంగాణపై అంతగా లేదు. హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. తెలంగాణలో నేడు స్వల్పంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు పసుపు రంగు అలర్ట్ జారీ చేశారు.


బంగారం, వెండి  ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గింది. పది గ్రాములకు రూ.350 తగ్గింది.  ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణంతో కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో ఈ మధ్య పెద్ద ఎత్తున మార్పులు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వెండి ధర నేడు కిలోకు రూ.1500 తగ్గింది. 


తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.46,750గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.51,000గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.64,800 అయింది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.


ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.64,800 గా ఉంది. విజయవాడలో పసిడి ధర ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.46,750గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.51,000గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.64,800గా ఉంది.


దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర (Todays Gold Rate) ఇలా..
అయితే, ఇతర నగరాల్లోనూ బంగారం ధర తగ్గింది. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.47,870గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,220గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000గా ఉంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.