Breaking News Live: మహిళలకు సరైన గౌరవం దక్కడంలేదు, గవర్నర్ తమిళి సై సంచలన వ్యాఖ్యలు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 07 Mar 2022 07:52 PM
మహిళలకు సరైన గౌరవం దక్కడం లేదు, గవర్నర్ తమిళి సై సంచలన వ్యాఖ్యలు 

తెలంగాణ గవర్నర్ తమిళి సై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉన్నత పదవులలో ఉన్న మహిళలకు కూడా గౌరవం దక్కడంలేదన్నారు. తనను ఎవరూ భయపెట్టలేరని, ఎవరికీ భయపడనన్నారు.  

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, సినిమా టికెట్ల జీవో జారీ 

సినిమా టికెట్ల ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ల ధరలు పెంపునకు సంబంధించిన జీవోను జారీ చేసింది. టికెట్ల కనీస ధర రూ.20, గరిష్ట రూ.250గా నిర్ణయించింది.   

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, నేడో, రేపు సినిమా టికెట్ల ధరలపై జీవో!

సినిమా టికెట్ల ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్ల ధరల జీవోకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో  నేడో, రేపో టికెట్ల ధరలపై జీవో జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. రాధే శ్యామ్ కు ముందు ఏపీ ప్రభుత్వం జీవో ఇస్తే సంతోషిస్తానని హీరో ప్రభాస్ అన్నారు. 

Singareni: సింగరేణి బొగ్గు గనిలో ప్రమాదం, నలుగురి మృతి

పెద్దపల్లి జిల్లా రామగుండంలోని సింగరేణి గనుల్లో ప్రమాదం చోటు చేసుకుంది. గని లోపల పైకప్పు కూలి నలుగురు సింగరేణి సిబ్బంది మరణించారు. వీరిలో ఓ అసిస్టెంట్ మేనేజర్ సహా ముగ్గురు కార్మికులు చనిపోయారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Urdu Language: ఏపీలో ఉర్దూను రెండో భాషగా గుర్తిస్తూ చట్ట సవరణ

ఏపీ అధికార భాషా చట్టం 1966 సవరణకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉర్దూను రెండో భాషగా గుర్తిస్తూ చట్ట సవరణ చేశారు. 35 అజెండా అంశాలపై ఏపీ కేబినెట్‌లో చర్చించారు. సీఎం జగన్మోహన్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తొలుత దివంగత మంత్రి, మంత్రివర్గ సహచరుడు గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతి పట్ల ఏపీ కేబినెట్ సంతాపం తెలిపింది. జిల్లాల విభజనకు సంబంధించి వచ్చిన అభ్యంతరాలపై మంత్రివర్గం చర్చించింది.

బీసీ, మైనారిటీ, క్రిస్టియన్‌ సంఘాల నేతలతో బ్రదర్ అనిల్ భేటీ

విజయవాడలోని ఓ హోటల్‌లో బీసీ, మైనారిటీ, క్రిస్టియన్‌ సంఘాల నేతలతో బ్రదర్ అనిల్ సమావేశం అయ్యారు. తమ సమస్యలు పరిష్కరిస్తారని జగన్‌కు ఓటేశామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అన్నారు. బ్రదర్ అనిల్ చెబితేనే తాము వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేశామని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కావాలని బ్రదర్ అనిల్‌ను కోరినట్లు బీసీ నేత నాగరాజు చెప్పారు. తమ బీసీల సమస్యలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. అయితే బ్రదర్ అనిల్ కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. 

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.



  • రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

  • ఆరు రాష్ట్రల్లో ఖాళీ అయిన స్థానాల భర్తీకి నోటిఫికేషన్

  • పంజాబ్‌లో 5, కేరళలో 3, అసోంలో 2, నాగాలాండ్, హిమాచల్ ప్రదేశ్, త్రిపురలో ఒక్కో స్థానం 

  • మార్చి 21న నామినేషన్

  • మార్చి 24న నామినేషన్ల ఉపసంహరణ

  • మార్చి 31 పోలింగ్, ఓట్ల లెక్కింపు

  • ఏప్రిల్‌లో 13 రాజ్యసభ స్థానాలు ఖాళీ

సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ 

ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి భేటీ అయింది. ఈ కేబినెట్ భేటీలో బడ్జెట్ ప్రతిపాదనలు, సభలో ప్రవేశపెట్టే ఇతర బిల్లులకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. ఈ సమావేశం ప్రారంభం కాగానే దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డికి మంత్రి మండలి రెండు నిమిషాల పాటు నివాళులర్పించింది.  

CM Jagan: అచ్చెన్నాయుడుపై జగన్ ఆగ్రహం

ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం అడ్డుకోవడంపై ముఖ్యమంత్రి జగన్ అసహనం వ్యక్తం చేశారు. సభ వాయిదా అనంతరం జరిగిన బీఏసీ సమావేశంలో టీడీపీ నేత అచ్చెన్నాయుడుపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో గవర్నర్ ప్రసంగం అడ్డుకోవడం సరికాదని అన్నారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని అన్నారు. అంత వ్యక్తిని అవమానించడం సరికాదని జగన్ అచ్చెన్నాయుడుతో అన్నారు.

TDP Protest Against Governor: పోడియం వద్ద పేపర్లు చింపి టీడీపీ సభ్యుల నిరసన

గవర్నర్ ప్రసంగం మొదలుకాగానే నిరసనలతో అడ్డు తగిలిన టీడీపీ సభ్యులు ఏకంగా స్పీకర్ పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేస్తున్నారు. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్ గో బ్యాక్.. గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు. గవర్నర్ ప్రసంగ ప్రతులను చింపి పైకి ఎగరేస్తూ పోడియం వద్ద నిరసనలు చేస్తున్నారు. అయినా గవర్నర్ ప్రసంగాన్ని కొనసాగిస్తూనే ఉండడంతో.. ఈ నినాదాల మధ్య వినిపించకుండా ఉంది.

TDP Protest in Assembly: గవర్నర్ గో బ్యాక్ అంటూ టీడీపీ నేతల నినాదాలు

గవర్నర్ ప్రసంగం ప్రారంభించగానే, టీడీపీ నేతలు పెద్ద ఎత్తున నిరసనలు మొదలు పెట్టారు. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్ గో బ్యాక్.. గోబ్యాక్ అంటూ నినాదాలను కొనసాగిస్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలో టీడీపీ నేతలు నినాదాలు చేస్తూనే ఉన్నారు.

AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ప్రసంగాన్ని ప్రారంభించగానే.. టీడీపీ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రసంగాన్ని అడ్డుకునే యత్నం చేస్తున్నారు. వారి నిరసనల మధ్యే గవర్నర్ ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు.

చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం కొనసాగుతోంది. చంద్రబాబు నాయుడు నివాసం లో జరిగిన సమావేశంలో పాల్గొన్న పార్టీ ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలకు అనుసరించాల్సిన వ్యూహం, అజెండా అంశాలపై అధినేత దిశా నిర్దేశం చేశారు. 

CPI Narayana: గవర్నర్లపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో గవర్నర్‌కు ప్రాధాన్యం దక్కకపోతుండడంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు గవర్నర్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. గవర్నర్ వ్యవస్థకు కమ్యూనిస్టు పార్టీలు పూర్తిగా వ్యతిరేకం అని వ్యాఖ్యానించారు. గిట్టని రాష్ట్రాలపై గవర్నర్‌లతో కేంద్రం పెత్తనం చేస్తూ ఉందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాలు గవర్నర్ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని నారాయణ పిలుపు ఇచ్చారు.

Modi Phone to Ukraine President: ఉక్రెయిన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్

ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్ స్కీతో మోదీ ఫోన్‌లో మాట్లాడనున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనికదాడులు కొనసాగుతున్న వేళ మరోసారు ఉక్రెయిన్​ అధ్యక్షుడు​ జెలెన్ స్కీతో మోదీ మాట్లాడనున్నారు. ఈ మేరకు మోదీ ఫోన్​ చేయనున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. 

Eatala Rajender: టీఆర్ఎస్‌కు ప్రత్యర్థిగా తొలిసారి అసెంబ్లీలోకి ఈటల రాజేందర్

హుజురాబాద్ ఎన్నికల తరువాత మొదటిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు ఈటల రాజేందర్. అయితే, ఈటల రాజేందర్ తో పాటుగా ఎవరూ వెళ్ళడానికి వీలులేదంటూ.. ఈ మేరకు తమకు ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారని మేడ్చల్ పోలీసులు ఈటల ఇంటికి వచ్చి సమాచారం ఇచ్చారు. ఈ ప్రభుత్వ నియంతృత్వం, పోలీసుల తీరుపై ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్బంధానికి తగిన మూల్యం చెల్లించక తప్పదు అని హెచ్చరించారు.

Tirumala Updates: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో‌ మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మునీశ్వరనాధ్ బండారి, తెలంగాణ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ఏపీ రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టిటిడి మాజీ పాలక మండలి ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవులు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు..అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా..ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు..అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన పుట్టా సుధాకర్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. టిటిడిలో స్వామి వారిపై భక్తి భావంతో ఎంతో మంది భక్తులు కానుకగా ఆస్తులు రాసి ఇచ్చిన ప్రాంతాల్లో గతంతో భవనాలు నిర్మించడం జరిగింది.. అటువంటి భవనాలను కలెక్టరేట్ కి ఇచ్చేందుకు టిటిడి పాలక మండలి నిర్ణయం తీసుకోవడం సరైనది కాదు.‌. స్వామి వారి ఆస్తులను భక్తుల సౌఖర్యాలకే ఉపయోగించాలనే గానీ, ప్రభుత్వంకు స్వాము వారి ఆస్తులను ఇవ్వడం తప్పు ఆలోచనగా భావిస్తున్నట్లు తెలిపారు.. వేంటనే టిటిడి పాలక మండలి నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Background

బంగాళాఖాతంలో 28 ఏళ్ల తరువాత ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. నైరుతి బంగాళాఖాతం వైపుగా తీరాన్ని దాటి బలహీనపడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అంతకుముందు తీవ్ర వాయుగుండంగా మారిన అల్పపీడనం నైరుతి తమిళనాడు తీరం నుంచి ఉత్తర తమిళనాడు తీరం వైపుగా కదులుతుందని చెప్పారు. తాజా అల్పపీడనం ప్రభావం తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్‌, యానాంలలో ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. 


ఏపీ, యానాంలలో ఈశాన్య గాలుల ఎఫెక్ట్
బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం మరింత తీవ్రమైంది. నేడు తమిళనాడు ఉత్తర తీరం చెన్నై- పుదుచ్చేరికి దగ్గరగా తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేశారు. దీని వల్ల ఆంధ్రప్రదేశ్‌లో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీ, యానాంలలో ఈశాన్య దిశ నుంచి వేగంగా గాలులు వీస్తాయి. తీరం వెంట ప్రస్తుతం 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లకపోవడమే మంచిదని వార్నింగ్ ఇచ్చారు. 


మార్చి 6వ తేదీ రాత్రి, మార్చి 7 తేదీల్లో నెల్లూరు జిల్లా దక్షిణ భాగాలు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురవనున్నాయని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. చిత్తూరు తూర్పు భాగాల్లో కొన్ని తేలికపాటి వర్షాలు. తమిళనడు బార్డర్ చెన్నైకి దగ్గర ఉన్న ప్రాంతాలు సూళూరుపేట​, తడ​, సత్యవేడు లాంటి  ప్రాంతాల్లో ఎక్కువ వర్షం పడుతుంది. మిగతా చోట్ల ఆకాశం మేఘావృతమై ఉంటుంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలలో ఏ మార్పు లేదు. కడప దక్షిణ ప్రాంతాల్లో, నెల్లూరు, తిరుపతి నగరంలో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. 


మార్చి 8న చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంతాల్లో, అనంతపురం జిల్లాలోని దక్షిణ​, పశ్చిమ ఏరియాలు మదనపల్లి, కదిరి, ధర్మవరం లాంటి ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. మార్చి 9న అనంతపురం జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయి. తమిళనాడులోని చెన్నై, పుదుచ్చేరి మధ్యలోనే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం, ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. రైతులు తమ పంట ఉత్పత్తులను ఆరు బయట ఉంచితే తడిసే అవకాశం ఉందని, జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.


తెలంగాణ వెదర్ అప్‌డేట్..
ఏపీలో వర్షాల ప్రభావం తెలంగాణపై సైతం ఉంటుంది. చల్లని గాలులతో పగటి ఉష్ణోగ్రతలు తగ్గుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు దిశ నుంచి ఉపరితల గాలులు గంటకు 8 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 21 డిగ్రీలు ఉండగా, పగటిపూట గరిష్టంగా ఒకట్రెండు చోట్ల 33.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. 


తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణంతో కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో భారీ ఎత్తున పెరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా నేడు ధర నిలకడగా ఉంది. వెండి ధర కూడా నేడు స్థిరంగానే ఉంది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.48,400 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.52,800 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.73,400 వద్ద ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.


ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
ఇక విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,400 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,800గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.73,400 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర అంతే పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.48,400 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.52,800గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.73,400 గా ఉంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.