Tapping Case Updates :  మునుగోడు ఉపఎన్నికల హడావుడిలో ఉన్న సమయంలో హైదరాబాద్ లో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు వ్యక్తులను అరెస్టు చేసిన కేసులో సంచలన విషయం వెలుగు చూసింది. ఈ కేసుకు మూలం ఫోన్ ట్యాపింగేనని కస్టడీలో ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్ రావు చెప్పినట్లుగా తెలుస్తోంది.   ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు రావు గువ్వల బాలరాజు, రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డిల ఫోన్లు ట్యాప్ చేశారు. వారు  బీజేపీ తో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలియగానే..  ప్రణీత్ రావు ప్రభుత్వ పెద్దలకు తెలియచేసినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత రాధాకిషన్ రావుతో కలిసి స్పెషల్ ఆపరేషన్ కు ప్లాన్ చేశారని భావిస్తున్నారు. 


నందకుమార్ తో పాటు స్వామిజీని .. అప్పటి తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కు పిలిపించారు. అంతకు ముందే ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ హైకమాండ్ ఈ అంశంపై మాట్లాడింది. బేరాల గురించి మొత్తం తెలిసిపోయిందని.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకు సహకరించాలని సూచించినట్లుగా తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే  టిక్కెట్లు ఆఫర్ చేయడంతో వారు అంగీకరించిటన్లుగాతెలుస్తోంది. రోహిత్ రెడ్డికి తెలిసే ఆయన ఫామ్ హౌస్‌లో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ట్రాప్  కెమెరాలను రాధాకిషన్ రావు అండ్ కో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. చివరికి అనుకున్నట్లుగా ట్రాప్ చేశారు. పట్టుకున్నారు. ఈ కేసు సంచలనం అయింది. 


ఈ కేసులో ఎమ్మెల్యేలతో బేరాలాడి పట్టుబడిన ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. కేరళకు చెందిన తుషార్ తో పాటు బీజేపీ ముఖ్య నేత బీఎల్ సంతోష్ పేరు కూడా తెరపైకి వచ్చింది. దీంతో వీరిద్దరిని అరెస్టు  చేసేందుకు తెలంగాణ పోలీసులు ప్రయత్నించారు.  ఈ కేసు విచారణకు సీఎం కేసీఆర్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ సిట్ బృందం నోటీసులు ఇవ్వడానికి ప్రత్యేక విమానాల్లో వెళ్లింది.  విచారణ సందర్భంగా అధికారులు విమానాల్లో ప్రయాణించడం కామనే అయినా కేవలం నోటీసులు ఇచ్చేందుకు స్పెషల్ ఫ్లైట్ వినియోగించడం తీవ్ర దుమారం రేపుతోంది. ఇక ఆ ప్రత్యేక విమానం బీఆర్ఎస్ నేతకు చెందినదిగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రత్యేక విమానంలో అధికారులు ఢిల్లీ, కేరళకు వెళ్లారు. బీఎల్ సంతోష్, తుషార్‌కు నోటీసులు ఇవ్వడానికి స్పెషల్ ఫ్లైట్ ను వీరు వినియోగించారు. ఓ కేసు విషయంలో నోటీసులు ఇచ్చేందుకు స్పెషల్ ఫ్లైట్ ఎవరి ఆదేశాల మేరకు వినియోగించారు అనే కోణంలో ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.


ఈ కేసు బయటపడిన తర్వాత చాలా రోజుల పాటు ఆ నలుగురు ఎమ్మెల్యేలు  కేసీఆర్ వెంటనే ఉన్నారు.  ఫామ్ హౌస్ లోనే నెల రోజుల పాటు ఉన్నారు. తర్వాత ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ.. కోర్టు నిర్ణయం తీసుకుంది. సీఎంగా ఉన్న కేసీఆర్ దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడించారని. అవి ఎలా లీక్ అయ్యాయో తేలాల్సి ఉందన్నారు. అయితే సీబీఐకి ఈ కేసును అప్పగించడంపై తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. స్టే ఆదేశాలు లేకపోయినప్పటికీ.. సీబీఐ విచారణ ప్రారంభించలేదు. ఆ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉంది.  తర్వాత జరిగిన ఎన్నికల్లో ఈ ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా విజయం సాధించలేదు.