Breaking News Live:తెలంగాణలో కోవిడ్‌ ఆంక్షల పొడిగింపు 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 09 Jan 2022 10:15 PM
ఏనుడు దాడిలో ట్రాకర్ మృతి

విజయనగరం జిల్లా కొమరాడ మండలంలో దుగ్గి గ్రామంలో ఏనుగు దాడిలో ట్రాకర్ మృతి చెందాడు. దుగ్గి గ్రామానికి సమీపంలోకి ఏనుగు రావడంతో ఏనుగును అడవిలోకి తోలేందుకు ట్రాకర్ రాజు ప్రయత్నించాడు. ఏనుగు ఎదురు దాడికి దిగటంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు.  మృతుడు రాజు శ్రీకాకుళం జిల్లా చెందిన వాడు. 

తెలంగాణలో కోవిడ్‌ ఆంక్షల పొడిగింపు 

కరోనా మహమ్మారి ఉద్ధృతి పెరుగుతున్న కారణంగా తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కోవిడ్‌ ఆంక్షలు ఈనెల 20 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కోవిడ్‌ కేసులు భారీగా నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఆంక్షలు కఠినతరం చేసింది.

తిరుమల ఘాట్ రోడ్డులో డివైడర్ ను ఢీకొన్న కారు

తిరుమల ఘాట్ రోడ్డులో పెనుప్రమాదం తప్పింది. మొదటి ఘాట్ రోడ్డులోని వినాయక స్వామి ఆలయం వద్ద కారు అతివేగం వచ్చి ప్రమాదవశాత్తూ డివైడర్ ను‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కడప జిల్లాకు చెందిన భక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీరిని టీటీడీ విజిలెన్స్ సిబ్బంది చికిత్స నిమిత్తం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. కారు ప్రమాదంతో మొదటి ఘాట్ లో దాదాపు రెండు కిలో‌మీటర్ల మేర ట్రాఫిక్ కు‌ అంతరాయం కలిగింది.

వరంగల్ కాకతీయ కెనాల్ లో ఇద్దరు విద్యార్థులు గల్లంతు

వరంగల్ డాక్టర్ కాలనీలోని కాకతీయ కెనాల్ లో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం, స్థానిక పోలీసులు కాకతీయ కెనాల్ వద్దకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్థులు వరంగల్ గిర్మాజీపేటకు చెందిన ఆకాశ్, హర్షగా పోలీసులు గుర్తించారు. విద్యార్థులు కాలువలో ఈత కోసం వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. యాసంగి కోసం నీరు విడుదల చేయడంతో కాలువలో ఉదృతంగా ప్రవహిస్తుంది. ఈతకు వెళ్లిన మొత్తం నలుగురు విద్యార్థుల్లో ఇద్దరు ప్రవాహం దాటికి కొట్టుకుపోయారు. 

శ్రీకాళహస్తి ఆలయ ప్రధాన అర్చకుడికి కరోనా పాజిటివ్

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో కరోనా కలకలం రేపింది. ఆలయంలో ప్రధాన అర్చకుడికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో రోజు రోజుకి కరోనా కేసులు పెరగడంతో శ్రీకళహస్తీశ్వర ఆలయంలో భక్తులకు అంతరాలయం దర్శనాన్ని ఆలయ ఈవో పెద్దిరాజు రద్దు చేశారు. స్వామి వారి దర్శనానికి విచ్చేసే భక్తులకు తీర్థం నిషేధిస్తూ ఆలయ ఈవో పెద్దిరాజు జీవో జారీ చేశారు.

హన్మకొండకు చేరుకున్న అసోం సీఎం

* హన్మకొండలోని ప్రభుత్వ ఉద్యోగుల నిరసన సభకు చేరుకున్న అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ


* స్వాగతం పలికిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ ఇతర రాష్ట్ర నేతలు


* ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగుల సమస్యలపై బీజేపీ ఆధ్వర్యంలో నేడు నిరసన సభ


* మరికాసేపట్లో ప్రసంగించనున్న అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ

గాంధీ భవన్‌లో మొదలైన కాంగ్రెస్‌ శాసనసభా పక్ష భేటీ

గాంధీ భవన్‌లో తెలంగాణ కాంగ్రెస్‌ శాసనసభా పక్షం అత్యవసరంగా సమావేశమైంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో ఈ భేటీ జరుగుతోంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. వనమా రాఘవ అరాచకాలు.. పార్టీ పరంగా చేపట్టాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. అలాగే పార్టీలోని అంతర్గత కుమ్ములాటలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరగనుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, ముఖ్యనేతలు హాజరయ్యారు.

కేపీహెచ్‌బీ కాలనీలో ఘోర రోడ్డు ప్రమాదం

* కేపీహెచ్‌బీ  కాలనీ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం


* ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన టిప్పర్ లారీ


* రోడ్డు నెంబర్ 1 నుండి టెంపుల్ బస్ స్టాప్ వెళ్తుండగా చోటు చేసుకున్న ఘటన


* టిప్పర్ ఢీ కొనడంతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జగన్మోహన్ రెడ్డి అక్కడికక్కడే మృతి


* మృతదేహాన్ని దాదాపు 20 మీటర్లు ఈడ్చుకెళ్లిన టిప్పర్ లారీ


* కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న కేపీహెచ్‌బీ పోలీసులు

ఎమ్మెల్సీ డాక్టర్ మహేందర్ రెడ్డికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ

మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డాక్టర్ మహేందర్ రెడ్డికి కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలు ఉండటంతో ఆయన వైద్యులను సంప్రదించగా పాజిటివ్ తేలింది. దీంతో వారి సలహా మేరకు తాను హోం కారంటైన్ లో ఉన్నట్లు మహేందర్ రెడ్డి తెలిపారు. తనను కలిసిన వారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. కోవిడ్ విస్తరిస్తున్న తరుణంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని మహేందర్ రెడ్డి తెలిపారు.

ఎల్బీ నగర్ అండర్ పాస్‌లో కారు బోల్తా

ఎల్బీ నగర్‌ అండర్‌ పాస్‌లో ఓ కారు బోల్తాపడింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సాగర్‌ రింగ్‌రోడ్డు వైపునుంచి వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అండర్‌ పాస్‌లో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదం తర్వాత కారు డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారును అక్కడి నుంచి తరలించారు. ప్రమాద సమయంలో డ్రైవర్‌ మద్యం మత్తులో ఉన్నాడని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు ఎవరిది, అందులో ఎంతమంది ఉన్నారనే విషయాలు తెలియాల్సి ఉన్నది. సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

హైదరాబాదీ డాక్టర్‌కు అరుదైన గౌరవం

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ న్యూట్రిషనిస్టు డాక్టర్‌ మతీన్‌ అస్రార్‌కు అరుదైన గౌరవం దక్కింది. న్యూఢిల్లీలో జరిగిన అందాల పోటీల్లో డాక్టర్‌ మతీన్‌ రెండు విభాగాల్లో పతకాలు సాధించారు. ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ పూర్తిచేసిన డాక్టర్‌ మతీన్‌ ప్రస్తుతం నగరంలోని పలు ప్రముఖ ఆస్పత్రుల్లో సేవలు అందిస్తున్నారు. గతవారం ఢిల్లీలో జరిగిన మిసెస్‌ ఇండియా వన్‌ ఇన్‌ ఏ మిలియన్‌ క్లాసిక్‌ విభాగంలో పాల్గొన్న డాక్టర్‌ మతీన్‌ బ్యూటీ విత్‌ బ్రెయిన్, ఇంటర్నేషనల్‌ ఐకాన్‌ కేటగిరీలలో విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా డాక్టర్‌ మతీన్‌ జూబ్లీహిల్స్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. వైద్యురాలినైనా ఈ పోటీల్లో విజేతగా నిలవడం ఆనందంగా ఉందని అన్నారు.

Background

హెలికాప్టర్‌కు తప్పిన ముప్పు
ఒడిశాలో ఓ హెలికాప్టర్‌కు పెను ప్రమాదం తప్పింది. హెలికాప్టర్‌ అత్యవసరంగా ల్యాండ్‌ అవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ఒడిశాలోని గజపతి జిల్లాలో చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం పరలఖేమండిలో ఉన్న స్టేడియంలో పిల్లలు క్రికెట్‌ ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ హెలికాప్టర్‌ అతి తక్కువ ఎత్తులో ఎగురుతుండటాన్ని వారు గమనించారు. అది మెల్లగా తాము ఆడుకుంటున్న గ్రౌండ్‌లోనే కిందికి దిగుతున్నదనది గుర్తించారు. దీంతో భయపడిన చిన్నారులు ఎక్కడివారు అక్కడ పారిపోయారు. అయితే హెలికాప్టర్‌ అత్యవసరంగా ఎందుకు దిగిందనే విషయం ఇంకా తెలియరాలేదు. ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తిందా లేదా మరేదైనా కారణం ఉందా అనే విషయంపై వాయుసేన అధికారులు విచారణ ప్రారంభించారు.


హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు గత కొద్ది రోజులుగా నిలకడగానే ఉంటున్నాయి. నేడు కూడా పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే కొనసాగుతోంది. ఇక వరంగల్‌లోనూ గత ఐదు రోజులుగా పెట్రోల్ ధరలు స్థిరంగానే ఉంటున్నాయి. నేడు (జనవరి 9) కూడా పాత ధరలే కొనసాగుతున్నాయి. పెట్రోల్ రూ.107.69 గా ఉండగా.. డీజిల్ ధర కూడా అలాగే రూ.94.14 గా కొనసాగుతోంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.


నిజామాబాద్‌లో ఇంధన ధరలు నేడు కాస్త తగ్గాయి. పెట్రోల్ ధర లీటరుకు నేడు రూ.0.43 పైసలు పెరిగి రూ.110.46 గా ఉంది. డీజిల్ ధర రూ.0.40 పైసలు పెరిగి రూ.96.72 గా ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తుండగా తాజాగా స్వల్పంగా తగ్గాయి.


ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.0.21 పైసలు పెరిగి రూ.110.29గా ఉంది. డీజిల్ ధర బెజవాడలో రూ.0.17 పైసలు పెరిగి రూ.96.36 గా ఉంది.


వాతావరణం
ఏపీ, తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు మళ్లీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చలి తీవ్రత తగ్గినట్లు కనిపించి రెండు రోజులుగా పెరుగుతోంది. తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. ఈశాన్య, తూర్పు దిశల నుంచి గాలులు ఏపీలో తక్కువ ఎత్తులో వీస్తున్నాయిని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా కోస్తాంధ్ర, యానాంలో నేటి నుంచి మరో రెండు రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గడంతో కొన్నిచోట్ల చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగిన ప్రాంతాల్లో చలి ప్రభావం అంతగా కనిపించడం లేదని వాతావరణ కేంద్రం తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఇబ్బంది లేదని వాతావరణ కేంద్రం సూచించింది.


బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు నిలకడగా ఉంది. వెండి ధర మాత్రం స్వల్పంగా రూ.0.10 పైసలు పెరిగి.. కిలోకు రూ.100 మార్పు కనిపించింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.44,600 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.48,650 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.64,600గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.


ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,600 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,650గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.64,600 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర తగ్గింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.44,600 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.48,650గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.64,600గా ఉంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.