Breaking News Live: ఏపీలో కొత్త జిల్లాలు: ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు మాజీ మంత్రి ముద్రగడ లేఖ

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 26 Jan 2022 02:52 PM
ఏపీలో కొత్త జిల్లాలు: ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు మాజీ మంత్రి ముద్రగడ లేఖ

తూర్పుగోదావరి జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు.  నాదొక చిన్న మనవి, దయచేసి అవకాశం ఉంటే మనసు పెట్టి ఈ దిగువ వ్రాసిన పెద్దల పేర్లు పలు జిల్లాలకు పెట్టడానికి పరిశీలించమని కోరుచున్నానండి.


1. తూర్పు లేక పశ్చిమగోదావరిలో ఒక జిల్లాకి డా॥ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేరు పెట్టాలి.


2. ఏదో ఒక జిల్లాకి శ్రీకృష్ణదేవరాయలు వారు పేరు పెట్టాలి.


3. కోనసీమకి లోక్‌సభ దివంగత  స్పీకర్, స్వర్గీయ బాలయోగి పేరు నామకరణం చేయాలని ముద్రగడ్డ ముఖ్యమంత్రి జగన్‌కు రాసిన లేఖలో ముద్రగడ పేర్కొన్నారు.

యూపీ ఎన్నికల నుంచి బీజేపీ చీఫ్ స్వతంత్రదేవ్, డిప్యూటీ సీఎం దినేష్ వర్మ ఔట్

యూపీ అసెంబ్లీ ఎన్నికలపై మరో కీలక అప్‌డేట్ వచ్చింది. యూపీ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్రదేవ్ సింగ్, డిప్యూటీ సీఎం దినేష్ శర్మ త్వరలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. దేశంలో సీట్ల పరంగా పెద్ద రాష్ట్రం కావడంతో ప్రతిసారి యూపీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి ఉంటుంది.

పర్చూరు ఎమ్మెల్యేకు బర్త్ డే విషెస్ చెప్పిన చంద్రబాబు

పర్చూరు నియోజకవర్గం తెలుగుదేశం ఎమ్మెల్యే, బాపట్ల పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఏలూరి సాంబశివరావుకు టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి మరెన్నో పుట్టినరోజులను ఆనందారోగ్యాలతో ఘనంగా జరుపుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ జిల్లాల అధ్యక్షుల నియామకం

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ .. జిల్లాల అధ్యక్షులను టిఆర్ఎస్ పార్టీ అధినేత సిఎం కేసీఆర్ నియమించారు.



గాంధీభవన్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి

73వ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గాంధీభవన్ లో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, స్వతంత్రం దేశ ప్రజలకు అందించేందుకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసిందన్నారు. 1930 లో పూర్ణ స్వరాజ్ నినాదంతో కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసి స్వాతంత్ర పోరాటం చేసి సాదించుకున్నామని చెప్పారు. 1950 లో జనవరి 26న రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ నేతృత్వంలో రాజ్యాంగాన్ని ఆమోదం చేసుకున్నామని గుర్తుచేశారు. మన రాజ్యాంగం అనేక హక్కులను కల్పించింది. ప్రపంచ దేశాలకు ఆదర్శంగా మన రాజ్యాంగం నిలిచింది. జీవించే హక్కు తో పాటు అనేక హక్కులు మనం సాధించుకున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణ శాసనమండలి ప్రాంగణంలో రిపబ్లిక్ డే వేడుకలు

73 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ శాసనమండలి ప్రాంగణంలో తెలంగాణ శాసనమండలి ప్రొటెం చైర్మన్ అమిణుల్ హాసన్ జాఫ్రీ జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, శాసన మండలి విప్ ఎం. ఎస్ ప్రభాకర్ రావు , ఎమ్మెల్సీలు బోగరపు  దయానంద్, వాణి దేవి , తెలంగాణ లెజిస్లేటివ్ సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు, టీఆర్ఎస్‌ఎల్పీ కార్యదర్శి రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కొత్త జిల్లాలు అందుకే..: ధర్మాన

* పరిపాలన సౌలభ్యం, సత్వర సేవలే లక్ష్యంగా కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టాం.


* ఎన్నికల హామీని అమలు చేస్తూ కొత్తగా 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ముఖ్య మంత్రి జగన్మోహన్రెడ్డి సారథ్యంలో నోటిఫికేషన్ విడుదల చేస్తూ కీలకమైన నిర్ణయం తీసుకున్నాం.


* వచ్చే నెల 26వ తేదీ వరకు ప్రజలు, ప్రజా సంఘాల నుంచి ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే స్వీకరిస్తున్నాం.


* శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ప్రజాప్రతినిధులు అందరూ కోరుకున్నట్లు ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని జిల్లాలోనే కొనసాగించేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు.


* అతి ముఖ్యమైన రూరల్ యూనివర్సిటీ, పారిశ్రామిక వాడ శ్రీకాకుళం జిల్లాలోనే ఉంటాయి.

గృహ ప్రవేశం జరిగిన వెంటనే నగలు చోరీ

హైదరాబాద్‌లో గృహ ప్రవేశం చేసిన కొద్దిసేపటికే నగలు చోరీ అయిన ఘటన వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్‌కు చెందిన రచిత్‌ బర్ధియా డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌లో ప్రొడక్షన్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. రోడ్డు నెంబరు 86లో ఇల్లు కొన్నారు. ఈ నెల 23న గృహప్రవేశం చేశారు. బంధువులు, పనివారు వెళ్లిపోయాక బెడ్‌రూంలోకి వెళ్లి చూడగా కప్‌బోర్డు తెరిచి ఉంది. పరిశీలించగా అందులో ఉండాల్సిన 10 తులాల బంగారు నెక్లెస్‌, చెవి కమ్మలు కనిపించకపోవడంతో ఆయన వెంటనే జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.

Background

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనకు తాజాగా ఎట్టకేలకు ముందడుగు పడింది. దీనికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వచ్చే ఉగాది నాటికి ఈ కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాథమిక నోటిఫికేషన్‌పై సలహాలు, సూచనలు, అభ్యంతరాలను నెలరోజుల్లోపు తెలియజేయాలని ప్రభుత్వం కోరింది.


కొత్త జిల్లాలపై మంగళవారం రాత్రి 8 గంటలకు ఆన్‌లైన్‌లో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ కొత్త జిల్లాల ప్రతిపాదనను మంత్రివర్గం ముందుంచారు. దానికి మంత్రివర్గం ఆన్‌లైన్‌లోనే ఆమోదముద్ర వేసింది. ఈ సమావేశానికి ముందు మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. కొత్త జిల్లాల ప్రక్రియ గురించి వారికి వివరించి, అభిప్రాయాలు, సూచనలు తీసుకున్నారు. 


Also Read: Republic Day 2022 Live Updates: రిపబ్లిక్ డే వేడుకలకు ఢిల్లీ ముస్తాబు.. పటిష్ఠ భద్రతతో అన్ని ఏర్పాట్లు పూర్తి


కొత్త జిల్లాల ఏర్పాటుపై 2020 ఆగస్టు 7న సీఎస్ ఆధ్వర్యంలో ఓ కమిటీ ఏర్పాటైంది ఆ తర్వాత జిల్లాల సరిహద్దులు, సిబ్బంది, ఆస్తులు తదితర అంశాలపై మరో నాలుగు సబ్‌ కమిటీలు ఏర్పాటు చేశారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీలు కూడా ఏర్పాటయ్యాయి. ప్రణాళికా విభాగం అధ్యయనం చేసి ఒక నివేదిక అందజేసింది. కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేసే క్రమంలో ఒక శాసనసభ స్థానం పూర్తిగా ఒకే జిల్లా పరిధిలోకి వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శానససభ స్థానాలూ కచ్చితంగా దాని పరిధిలోకే రావాలన్న నిబంధన మాత్రం కుదరలేదు. ఒక లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏదైనా శాసనసభ స్థానం, కొత్తగా ఏర్పడే పక్క జిల్లా కేంద్రానికి దగ్గర్లో ఉంటే, దాన్ని ఆ జిల్లా పరిధిలోకి తీసుకొచ్చారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా కొత్తగా 15 రెవెన్యూ డివిజన్లను ప్రతిపాదించారు. దీనితో రాష్ట్రంలో మొత్తం రెవెన్యూ డివిజన్ల సంఖ్య 62కి చేరుతుంది.


Also Read: Gold-Silver Price: రిపబ్లిక్ డే నాడు ఎగబాకిన బంగారం.. వెండి నేల చూపులు, నేటి ధరలు ఇవే..


73వ గణతంత్ర వేడుకల సందర్భంగా గూగుల్ కూడా ముఖ చిత్రాన్ని మార్పు చేసింది. ఢిల్లీలోని రాజ్ పథ్‌లో నిర్వహించే పరేడ్‌ కార్యక్రమాలను ప్రతిబింబించేలా గూగుల్ డిజైన్‌ను రూపొందించింది. ఏనుగులు, ఒంటెలతో పాటు పరేడ్‌కు అద్దం పట్టే అంశాలను అందులో చేర్చారు. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.