Amrapali Kata  Request for Telangana Cadre Rejected : గ్రేటర్ హైదరాబాద్‌ కమిషనర్ పోస్టుతోపాటు పలు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారిణి కాటా అమ్రపాలికి కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ షాక్ ఇచ్చింది. తనను తెలంగాణ క్యాడర్‌లోనే కొనసాగించాలని పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరించింది. ఆమెను విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు కేటాయిచారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌లో జాయినవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి అయిన అమ్రపాలి తనను తెలంగాణ స్థానికత ఉన్న అధికారిగా గుర్తించాలని చేసిన విజ్ఞప్తిని తోసి పుచ్చారు. ఖండేకర్ కమిటీ చేసిన సిఫారసుల ఆధారంగా ఆమె ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కే చెందుతారని కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.


రాష్ట్ర విభజన తర్వాత సివిల్ సర్వీసు అధికారుల కేటాయింపు కోసం ఖండేకర్ కమిటీని నియమించారు. ఆ కమిటీ నిబంధనల ప్రకారం విభజించింది. అయితే ఆ నివేదికలో పేర్కొన్న పలువురు తమ క్యాడర్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కేంద్రానికి,క్యాట్‌కు దరఖాస్తుకు పెట్టుకున్నారు. ఏపీకి కేటాయించిన ఎక్కువ మంది తాము తెలంగాణ స్థానికతతో ఉన్నామని తమకు తెలంగాణ క్యాడరే కావాలని ఉండిపోయారు. అలాంటి అధికారి అయిన సోమేష్ కుమార్ తెలంగాణలో సీఎస్‌గా ఉండగా కోర్టు ఏపీకి వెళ్లాల్సిదేనని స్పష్టం చేసింది. దాంతో ఆయన తెలంగాణ నంచి రిలీవ్ అయి ఏపీలో రిపోర్ట్ చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు అమ్రపాలికి కూడా దాదాపుగా అదే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ కమిషనర్ గా ఉన్న ఆమె ఉన్న పళంగా ఏపీలో రిపోర్టు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. 


ఖండేకర్ కమిటీ సిఫారసులు చేసిన సమయంలో స్థిర నివాసం అనే కాలమ్‌ను కీలకంగా తీసుకున్నారు. యూపీఎస్సీకి దరఖాస్తు చేసిన సమయంలో కాట అమ్రపాలి తన పర్మినెంట్ అడ్రస్‌గా విశాఖ పట్నంను పేర్కొన్నారు.  ఖండేకర్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ప్రత్యూష్ సిన్హా కమిటీ ఆ నివేదిక ఆధారంగా  క్యాడర్ ను కేటాయించింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఖండేకర్ కమిటీ ఆమెను ఏపీకి కేటాయించింది. అయితే తనను తెలంగాణ స్థానికురాలిగా పరిగణించి.. తెలంగాణకే కేటాయించాలని ఆమె అప్పీల్ చేసుకున్నారు. ప్రత్యూష్ సిన్హా కమిటీ మొదట్లోనే ఆమె అభ్యర్థనను తిరస్కరించింది.


హైకోర్టు కూడా ఖండేకర్ కమిటీ ఆధారంగా  ప్రత్యూష్ సిన్హా కమిటీ చేసిన సిఫారసులనే అమలు చేయాలని స్పష్టం చేసింది.  కాట అమ్రపాలికి ప్రస్తుతం అన్ని మార్గాలు మూసుకుపోయినట్లేనని ఆమె ఖచ్చితంగా తెలంగాణలో రిలీవ్ అయ్యి.. ఏపీలో రిపోర్టు చేయాల్సిందేనని భావిస్తోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత వరంగల్ జిల్లాకు కలెక్టర్ గా చేసిన అమ్రపాలి తర్వాత కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఓఎస్డీగా.. ప్రధానమంత్రి కార్యాలయంలోనూ పని చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం  వచ్చిన తర్వాత మళ్లీ తెలంగాణకు వచ్చారు రేవంత్ సర్కార్ లో ఆమెకు కీలక పోస్టులు దక్కాయి. అయితే ఇప్పుడు ఏపీకి తప్పక వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.