Asaduddin Owaisi: తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోను ఆదివారం విడుదల చేసిన విషయం తెలిసిందే. రైతుబంధు దశలవారీగా రూ.16 వేలు పెంపు, పింఛన్ కూడా దశలవారీగా రూ.5 వేలు పెంపు, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నవారందరికీ కేసీఆర్ బీమా, మహిళలకు ప్రతీ నెలా రూ.3 వేల భృతి లాంటి ఎన్నో కీలక హామీలను మేనిఫెస్టోలో బీఆర్ఎస్ పొందుపర్చింది. అలాగే బీపీఎల్ కుటుంబాలకు రూ.400కే గ్యాస్ సిలిండర్, గృహలక్ష్మి పథకం కింద స్థలం ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్ధిక సాయం, జీహెచ్‌ఎంపీ పరిధిలో మరో లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం లాంటి హామీలు బీఆర్ఎస్ ఇచ్చింది.


బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై పార్టీలన్నీ స్పందిస్తున్నాయి. ఇందులో భాగంగా సోమవారం ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో అద్బుతంగా ఉందని కితాబిచ్చారు. పేదల ప్రజల కోసం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారని, బీఆర్ఎస్‌కు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని మరోసారి తెలిపారు. గత పదేళ్లల్లో పేదల కోసం కేసీఆర్ అనేక మంచి సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని, వాటి వల్ల లక్షల మంది లబ్ధి పొందారని ప్రశంసలు కురిపించారు.  కేసీఆర్ మరోసారి గెలిచి హ్యాట్రిక్ సీఎం అవుతారని, ఆయనను మరోసారి గెలిపించాలని ప్రజలకు ఓవైసీ సూచించారు. కాంగ్రెస్-బీజేపీ దొందూ దొందే అని ఓవైసీ ఆరోపించారు.


అయితే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు మద్దతిస్తున్నట్లు ఇటీవల ఓవైసీ ప్రకటించారు. బీఆర్ఎస్ తమ మిత్ర పక్షమేనని చెబుతూ వస్తోన్నారు. కేసీఆర్ పాలనపై పొగడ్తలు కురిపిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో మరోసారి బీఆర్ఎస్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఓవైసీ ప్రకటించడం కీలకంగా మారింది. గతంలో కేసీఆర్ మాట్లాడుతూ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఎంఐఎం తమకు ఇప్పటికీ మిత్రపక్షమేనని అన్నారు. అలాగే మంత్రి కేటీఆర్ కూడా పలుమార్లు ఎంఐఎంతో స్నేహం కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటేని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తూ వస్తోంది. అయినా బీఆర్ఎస్, ఓవైసీ మాత్రం తమ వైఖరి మార్చుకోలేదు. తాము మిత్రపక్షాలేనని ఇరు పార్టీలు చెబుతూ వస్తోన్నాయి.


అటు బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై కాంగ్రెస్, బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోన్నాయి. తాము ఇప్పటికే ప్రకటించిన ఆరు గ్యారెంటీలను కాపీ కొట్టి కేసీఆర్ మ్యానిఫెస్టో తయారుచేశారని కాంగ్రెస్ ఆరోపించింది. తాము ప్రకటించిన హామీలే బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ఉన్నాయని విమర్శలు కురిపిస్తోంది. అటు బీజేపీ కూడా బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై స్పందించింది. కేసీఆర్ గత ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలనే అమలు చేయలేదని, ఇప్పుడు మరోసారి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపణలు చేస్తోన్నారు. కేసీఆర్ మాయమాటలను ప్రజలు నమ్మవద్దని సూచిస్తోన్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో అంతా బోగస్ అని బీజేపీ ఆరోపిస్తోంది. అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ప్రకటించగా.. బీజేపీ ఇాంకా తమ పార్టీ మ్యానిఫెస్టోను వెల్లడించలేదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే బీజేపీ మ్యానిఫెస్టోను విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది. ప్రస్తుతం మ్యానిఫెస్టో రూపకల్పనపై బీజేపీ దృష్టి పెట్టింది.