Adilabad RIMS News: ఆదిలాబాద్ రిమ్స్ వైద్య విద్యార్థుల దాడి ఘటనపై జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అదనపు కలెక్టర్ శ్యామలాదేవి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి గురువారం రిమ్స్ మెడికల్ కాలేజ్ ను సందర్శించి విచారణను ప్రారంభించారు. ఈ మేరకు రిమ్స్ సిబ్బందితో పాటు బాధిత విద్యార్థులతో మాట్లాడి వివరాలను సేకరించారు. కమిటీ నివేదికను కలెక్టర్ కు అందజేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వైద్య విద్యార్థులపై బయటి వ్యక్తులు వచ్చి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్ అన్నారు. దాడికి పాల్పడిన డాక్టర్ క్రాంతిని టర్మినేట్ చేస్తున్నట్లు వెల్లడించారు. రిమ్స్ లో సెక్యూరిటీని పెంచుతామన్నారు. 


మెడికల్ విద్యార్థులపై దాడికి పాల్పడిన డాక్టర్ క్రాంతి కుమార్ ఎ1గా పోలీసులు అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. బయట వ్యక్తులు దాడి చేస్తున్న క్రమంలో తమను తాము రక్షించుకునే సమయంలో దాడికి దిగిన వ్యక్తిపై మెడికో విద్యార్థులు కూడా ప్రతి దాడులు చేయడంతో ప్రస్తుతం శివకుమార్ అనే వ్యక్తి చేతి విరిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈయనపై కూడా ఏ2 గా కేసు నమోదు చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు. వీరితోపాటు రిమ్స్ డైరెక్టర్ మరియు, దాడిలో పాల్గొన్న బయట వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.


రిమ్స్ వైద్య కళాశాలలోకి బయట వ్యక్తులు వైద్య విద్యార్థులపై దాడులకు పాల్పడడంతో వైద్య విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్ రిమ్స్ వైద్య కళాశాల అవరణలో మధ్యాహ్నం మూడు గంటల నుండి కూర్చొని నిరసన చేపట్టారు. బయట వ్యక్తులు రిమ్స్ కళాశాలలోకి చొరబడుతున్నారని, తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని, రిమ్స్ డైరెక్టర్ ను మార్చాలంటూ విద్యార్థులు నిరసన చేపట్టారు. ఈ నిరసన సాయంత్రం 5:00 గంటల వరకు చేపట్టడంతో రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్ తో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్లు వైద్య విద్యార్థులతో మాట్లాడారు. 


వైద్య విద్యార్థులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఇలాంటి ఘటనలు పునవృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని వైద్య కళాశాల ఆవరణలో సెక్యూరిటీని పెంచుతామని డైరెక్టర్ చెప్పడంతో విద్యార్థులు మాత్రం తమ నిరసనను ఇంకా కొనసాగిస్తామని చెప్తున్నారు. అసలు ఈ వైద్య కళాశాలలో డైరెక్టర్ ను మార్చితేనే అన్ని బాగుంటాయని అందరికీ సరైన న్యాయం జరుగుతుందని విద్యార్థులు చెబుతున్నారు. రిమ్స్ డైరెక్టర్ మాకొద్దు డైరెక్టర్ ను మార్చే వరకు తమ నిరసనను కొనసాగిస్తామని, రేపటి నుండి వీధులకు హాజరుకామని రేపటినుండి యధావిధిగా ఈ నిరసనను కొనసాగిస్తామన్నారు.