TRS MLAs Poaching Case: ఇటీవల సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు జైలుకు తరలించారు. 26వ తేదీన ఈ కేసు వెలుగులోకి రాగా.. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. 41-ఏ సీఆర్పీసీ నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం తగదంటూ రిమాండ్ ను మొదట ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. ఏసీబీ కోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తూ నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోవాలని న్యామూర్తి ఆదేశాలు జారీ చేశారు. లేదా ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపాలని న్యాయమూర్తి ఆదేశారు ఇచ్చారు. మరోవైపు బీజేపీ నేతలు.. రాష్ట్ర పోలీసుల దర్యాప్తు తమకు నమ్మకం లేదని సీబీఐకి కేసు అప్పగించాంటూ దాఖలు చేసిన పిటిషన్ పై మరో న్యాయమూర్తి విచారణ జరిపారు. దర్యాప్తును వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 






నిందితులకు 14 రోజుల రిమాండ్ 
హైకోర్టు ఆదేశాలతో నిందితులైన రామచంద్ర భారతి, సింహయాజి, నంద కుమార్ ను పోలీసులు శనివారం రెండోసారి అరెస్ట్ చేశారు. అనంతరం ఏసీబీ కోర్టులో హాజరు పరచగా.. నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది. 41-ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం తగదటూ ఏసీబీ కోర్టు రిమాండ్ ను తిరస్కరించడంతో... హైకోర్టును ఆశ్రయించి పోలీసులు అనుమతి పొందారు. ఈ క్రమంలోనే నిందితులు ఫిల్మ్ గనర్ షేక్ పేట దారిలో ఉన్న నందకుమార్ నివాసమైన ఆదిత్య హిల్ టాప్ లో ఉన్నట్లు పోలీసులు సమాచారం సేకరించారు. అక్కడకు వెళ్లిన బంజారాహిల్స్ పోలీసులు, సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు వెళ్లగా.. గమనించిన నందకుమార్ లిఫ్టును నిలిపివేసినట్లు సమాచారం. దీంతో పోలీసులు ఎనిమిదో అంతస్తు వరకు మెట్లు ఎక్కుతూ వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. 


ఫ్లాట్ నంబర్ 603లో నందకుమార్ తో పాటు సింహయాజి, రామ చంద్ర భారతిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో 15 నిమిషాలు విచారించారు. అనంతరం మొయినాబాద్ ఠాణాకు తరలించారు. అక్కడి నుంచి వైద్య పరీక్షల కోసం చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తిరిగి పోలీస్ స్టేషన్ కు వచ్చి అక్కడి నుంచి సీసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచారు. అయితే ఈ నిందితులు ముగ్గురూ ఒకరినొకరు ఎలా కలిశారు, వారికి ఎవరెవరితో పరిచయాలు ఉన్న వివరాలను సేకరించారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, వ్యాపార వేత్తలతో వీరికి ఉన్న అనుబంధంపై ఆరా తీశారు. నందకుమార్ కు పలువురు నాయకులతో పరిచయాలు ఉన్నట్లు గుర్తించారు. ఇతడికి సింహయాజితో ఎంతో కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయనేది తేల్చే ప్రయత్నం చేశారు. 


ఇటీవల తనను కలిసి ఓ స్వామీజీ కొద్ది రోజుల్లో తాను చాలా కీర్తి సంపాదిస్తా అని అన్నట్లు.. అయితే ఇలా అపకీర్తి పాలు అవుతానని ఊహించలేకపోయానంటూ నంద కుమార్ పోలీసుల ముందు వాపోయినట్లు సమాచారం. మరోవైపు నిందితులు ఆధ్యాత్మిక భావాలు కల్గిన వారు కావడంతో పాటు అనారోగ్య సమస్యలు ఉన్నాయని.. జైల్లో ఏ క్లాస్ సదుపాయాలు కల్పిచాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది. నిందితులను కేసును లోతుగా దర్యాప్తు చేసేదుకు 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని న్యాయమూర్తిని కోరగా.. అందుకు అంగీకరించలేదు. నాలుగో తేదీ తర్వాతే ఆ విషయంపై ఆలోచిస్తామని స్పష్టం చేసింది. ముగ్గురు నిందితులు వచ్చే నెల 1 వరకు రిమాండ్ లో ఉండనున్నారు.