హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీల పర్వం కొనసాగుతోంది. ఇదివరకే పలుమార్లు ఐఏఎస్, ఐపీఎస్ లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రభుత్వ వ్యవస్థలో ప్రక్షాళన చేస్తున్నామంటూ ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ.. ఆరు గ్యారంటీలను, ఇతర హామీలను అమలు చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సోమవారం సాయంత్రం 12 మంది పోలీస్ ఉన్నతాధికారులను బదిలీ చేసింది. తాజాగా పోలీసు శాఖలో దాదాపు 150 మంది అధికారులు బదిలీ అయ్యారు. 
110 మంది డీఎస్పీలను హోంశాఖ బదిలీ చేసింది. వారితో పాటు ఐదుగురు నాన్ క్యాడర్ ఎస్పీలు, 39 మంది అదనపు ఎస్పీలను సైతం వేరే స్థానానికి ట్రాన్స్‌ఫర్ చేసింది. ఈ మేరకు సోమవారం రాత్రి తెలంగాణ డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.


12 మంది ఐపీఎస్‌ల బదిలీ
రాష్ట్ర పోలీస్ శాఖలో ఉన్నత స్థానాల్లో ఉన్న 12 మంది ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీజోన్‌-2 ఐజీగా సుధీర్‌బాబు బదిలీ అయ్యారు. రాచకొండ సీపీ సుధీర్‌బాబు స్థానంలో తరుణ్‌ జోషిని నియమితులయ్యారు. డిప్యూజీ ఐజీ శ్రీనివాసులను రామగుండం కమిషనర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. ఎల్ఎస్ చౌహాన్ ను జోగులాంబ జోన్ 7 డీఐజీగా నియమించింది. సైబరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్ సీపీగా జోయల్‌ డేవిస్‌కు పోస్టింగ్ ఇవ్వగా.. కే నారాయణ్ నాయక్ కు సీఐడీ డీఐజీగా బాధ్యతలు అప్పగించారు.