కొత్త స్మార్ట్ ఫోన్ కొనుక్కోవడం మనకు ఎప్పుడూ ఎక్సైటింగ్‌గానే ఉంటుంది. కానీ పాత ఫోన్ నుంచి కొత్త ఫోన్‌కు డేటా ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఒకవేళ మీరు యాపిల్ నుంచి యాపిల్‌కే మారుతుంటే ఎయిర్ డ్రాప్ ద్వారా ఫొటోలు, డాక్యుమెంట్లు, వీడియోలు షేర్ చేసుకోవచ్చు. కానీ ఆండ్రాయిడ్‌కు అది మరింత కష్టం అవుతుంది.


ఈ సమస్యకు పరిష్కారం కోసం షావోమీ, వివో, ఒప్పో చేతులు కలిపాయి. తమ బ్రాండ్లకు చెందిన హ్యాండ్ సెట్ల మధ్య సులువుగా డేటా ట్రాన్స్‌ఫర్ చేసుకునే సౌలభ్యాన్ని తీసుకురానున్నాయి. కేవలం ఫొటోలు, కాంటాక్ట్స్ మాత్రమే కాకుండా థర్డ్ పార్టీ యాప్ డేటా కూడా ట్రాన్స్‌ఫర్ చేసుకునే ఫీచర్‌ను ఇవి అందిస్తున్నాయి. 2020లో బీబీకే ఎలక్ట్రానిక్స్‌కు చెందిన బ్రాండ్స్ (ఒప్పో, వివో, రియల్‌మీ, ఐకూ, వన్‌ప్లస్), శాంసంగ్ దీని కోసం పీ2పీ ఫైల్ ట్రాన్స్‌ఫర్ ప్రొటోకాల్‌పై పని చేశాయి.


షావోమీ, వివో, ఒప్పో బ్రాండ్లు వీబో ద్వారా తమ భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. వినియోగదారులకు మెరుగైన రీప్లేస్‌మెంట్ అనుభవాన్ని అందించడం కోసం కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. థర్డ్ పార్టీ యాప్ డేటా కూడా ట్రాన్స్‌ఫర్ అవుతుంది కాబట్టి పాత చాట్ రికార్డులు కూడా కొత్త మొబైల్‌కు యాజిటీజ్‌గా బదిలీ అవుతాయి. బీబీకే ఎలక్ట్రానిక్స్‌కు చెందిన బ్రాండ్స్ (ఒప్పో, వివో, రియల్‌మీ, ఐకూ, వన్‌ప్లస్) తమ మొబైల్స్ మధ్య కాంటాక్ట్‌లు, ఫొటోల వంటి సిస్టం డేటాను ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి సపోర్ట్ చేస్తున్నాయి.


ఎంఐ స్విచ్ ద్వారా ఒప్పో, వివో స్మార్ట్ ఫోన్లు డేటాను షావోమీ హ్యాండ్ సెట్‌కు మైగ్రేట్ చేయవచ్చు. షావోమీ తెలుపుతున్న దాని ప్రకారం పాత మొబైల్ టైప్‌ను ఆండ్రాయిడ్ అని సెలక్ట్ చేశాక ఆ డివైస్‌లో ఎంఐ రీప్లేస్‌మెంట్ అనే యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి కోడ్ స్కాన్ చేస్తే పూర్తిగా డేటా ట్రాన్స్‌ఫర్ అవుతుంది.


షావోమీ ఫోన్లలో ఎంఐయూఐ 4.0.0 లేదా ఆపైన, ఒప్పో ఫోన్లలో కలర్ఓఎస్‌ 13.3.7 లేదా ఆ పైన, వివో ఫోన్లలో ఆరిజిన్ఓఎస్ 6.2.5.1 లేదా ఆ పైన ఆపరేటింగ్ సిస్టంలకు మాత్రమే ఈ ఫీచర్ సపోర్ట్ చేయనుంది. అయితే ఈ ఇంప్రూవ్డ్ డేటా మైగ్రేషన్ ఫీచర్ చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది.


2020లో రియల్‌మీ, వన్‌ప్లస్, బ్లాక్ షార్క్, మెయిజు, శాంసంగ్ బ్రాండ్లు వైర్‌లెస్ ఫైల్ డేటా ట్రాన్స్‌ఫర్ సిస్టంలను సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చాయి. షేర్ఇట్, క్జెండర్ లాంటి థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేకుండా డేటా ట్రాన్స్‌ను చేసుకోవచ్చు. ఈ భాగస్వామ్యానికి ‘పీర్ టు పీర్ ట్రాన్స్‌మిషన్ అలయన్స్’ అని పేరు పెట్టారు.


వివో వై02 బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. ఇది ఒక ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్. ఇందులో 6.51 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఆక్టాకోర్ మీడియాటెక్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఫుల్ వ్యూ డిస్‌ప్లేను ఈ ఫోన్‌లో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. ఇందులో స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే మనదేశంలో లాంచ్ అయింది. 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.8,999గా నిర్ణయించారు.