Notice To Telegram: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వాట్సాప్‌లో ఇటీవల యూజర్‌నేమ్‌లు అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టడం విస్తృత చర్చకు దారితీసింది. ఈ అంశం యూజర్‌నేమ్‌లపై విస్తృత ప్రశ్నలను రేకెత్తించడంతో, ప్రభుత్వం ఈ ఫీచర్‌ను నిషేధించింది. వాట్సాప్ తర్వాత, ప్రభుత్వం ఇప్పుడు టెలిగ్రామ్‌కు కూడా నోటీసు జారీ చేసింది.

Continues below advertisement

వాస్తవానికి, భారత్‌లో ఆన్‌లైన్ పైరసీని అరికట్టడానికి, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ అయిన టెలిగ్రామ్‌పై కఠిన వైఖరి తీసుకుంది. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ టెలిగ్రామ్‌కు ఒక నోటీసు జారీ చేసింది. 15 రోజుల్లోగా తమ పైరసీ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని, తీసుకున్న చర్యలపై ఒక నివేదికను సమర్పించాలని ఆ నోటీసులో ఆదేశించింది. ఈ ప్లాట్‌ఫామ్‌పై పెద్ద సంఖ్యలో పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్, ఇతర కాపీరైట్ హక్కులున్న మెటీరియల్ షేర్ అవుతున్నాయని, దీనివల్ల సినీ పరిశ్రమకు, క్రియేటర్ల ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టాలు కలుగుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది.

ప్రభుత్వం టెలిగ్రామ్‌తో ఏమని చెప్పింది?

అందిన సమాచారం ప్రకారం, తమ ప్లాట్‌ఫామ్‌లో ఉన్న పైరసీ చిత్రాలు, కాపీరైట్ ఉల్లంఘన ఆడియో-వీడియో కంటెంట్‌ను గుర్తించడం, వాటి గురించి రిపోర్ట్ చేయం, తొలగించడం కోసం ఒక పటిష్టమైన పద్ధతిని సిద్ధం చేయాలని మంత్రిత్వ శాఖ టెలిగ్రామ్‌కు స్పష్టమైన సూచనలు ఇచ్చింది.

Continues below advertisement

అంతేకాకుండా, ఫిర్యాదు అందిన తర్వాత కేవలం కంటెంట్‌ను తొలగించడం సరిపోదని ప్రభుత్వం భావిస్తోంది. ప్లాట్‌ఫారమ్‌లే స్వయంగా అటువంటి కంటెంట్‌ను గుర్తించి, సకాలంలో దాన్ని తొలగించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి.

ఫిర్యాదుల పరిష్కారానికి డిమాండ్

సమాచార -ప్రసార మంత్రిత్వ శాఖ, టెలిగ్రామ్ ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా కోరింది. పైరసీ కంటెంట్‌పై చిత్రనిర్మాతలు, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు, ప్రసారకర్తలు, చట్ట అమలు సంస్థలు ఎలా ఫిర్యాదులు చేయవచ్చో, అలాగే ఆ ఫిర్యాదులను ఎంత వేగంగా పరిష్కరిస్తారో ప్రభుత్వం తెలుసుకోవాలనుకుంటోంది.

పునరావృత నేరస్థులపై చర్య

పదేపదే పైరసీ కంటెంట్‌ను షేర్ చేసే వినియోగదారులు, నెట్‌వర్క్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం టెలిగ్రామ్‌ను కోరింది. ఇందులో వ్యక్తిగత ఖాతాలు మాత్రమే కాకుండా ఛానెళ్లు, గ్రూపులు, బాట్‌లు, అడ్మిన్‌లు వాటికి సంబంధించిన నెట్‌వర్క్‌లు కూడా ఉన్నాయి. సినిమాలు, వెబ్ సిరీస్‌ల పైరసీ కాపీలను నిరంతరం పంపిణీ చేసే మొత్తం నెట్‌వర్క్‌లను నిర్మూలించడానికే ప్రభుత్వ ఈ చర్య తీసుకుంది.  

15 రోజుల్లోగా నివేదిక 

15 రోజుల్లోగా వివరణాత్మక కార్యాచరణ నివేదిక (ATR)ను సమర్పించాలని ప్రభుత్వం టెలిగ్రామ్‌ను ఆదేశించింది. పైరసీ కంటెంట్‌ను గుర్తించడం, నిరోధించడం, తొలగించడం కోసం ఆ ప్లాట్‌ఫారమ్ తీసుకున్న చర్యలను ఈ నివేదికలో వివరించాలి. నిర్దేశించిన సమయంలోగా నివేదికను సమర్పించని పక్షంలో, ప్రభుత్వం ప్రస్తుత చట్టపరమైన నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొంది.  

ఐటీ చట్టం -కాపీరైట్ చట్టం కింద బాధ్యత

భారత్‌లో మధ్యవర్తిగా, ఐటీ చట్టం, 2000, ఐటీ నియమాలు, 2021 ప్రకారం అవసరమైన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని ప్రభుత్వం టెలిగ్రామ్‌కు తెలియజేసింది.

వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌ క్రియేటర్ ఎకానమీ, సినీ పరిశ్రమ, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు, బ్రాడ్‌కాస్టర్లు, చిత్రనిర్మాతలు, పంపిణీదారుల ప్రయోజనాలను పరిరక్షించడమే ఈ చర్య లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో పైరసీ కంటెంట్ సులభంగా లభించడం వల్ల కంటెంట్ సృష్టికర్తలకు ఆర్థిక నష్టాలు కలగడమే కాకుండా, పరిశ్రమపై కూడా ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. అందువల్ల, ప్లాట్‌ఫారమ్ స్థాయిలో జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి ప్రభుత్వం ఇప్పుడు కఠిన చర్యలు తీసుకుంటోంది.