రెడ్‌మీ మనదేశంలో రెడ్‌మీ నోట్ 11ఎస్ స్మార్ట్ ఫోన్‌ను ఫిబ్రవరి 9వ తేదీన లాంచ్ చేయనున్న సంగతి తెలిసిందే. దీంతోపాటు రెడ్‌మీ స్మార్ట్ బ్యాండ్ ప్రో కూడా లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా కూడా ప్రకటించింది.


2020లో లాంచ్ అయిన రెడ్‌మీ స్మార్ట్ బ్యాండ్‌కు తర్వాతి వెర్షన్‌గా రెడ్‌మీ స్మార్ట్ బ్యాండ్ ప్రో లాంచ్ కానుంది. రెడ్‌మీ స్మార్ట్ బ్యాండ్ ప్రో ఇండియా లాంచ్‌కు సంబంధించిన టీజర్ పేజీని కూడా కంపెనీ షేర్ చేసింది. ఇందులో 24 గంటల హార్ట్ రేట్ ట్రాకర్, స్లీప్ ట్రాకర్, ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.


రెడ్‌మీ స్మార్ట్ బ్యాండ్ ప్రో స్పెసిఫికేషన్లు
ఇందులో 1.47 అంగుళాల సూపర్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 194 x 368 పిక్సెల్స్‌గా ఉంది. ఇందులో 50కి పైగా వాచ్ ఫేసెస్ అందుబాటులో ఉన్నాయి. 2.5డీ రీఇన్‌ఫోర్స్‌డ్ గ్లాస్ ఫైబర్‌ను ఇందులో అందించనున్నారు. దీంతోపాటు 2.5డీ టాంపర్డ్ గ్లాస్ కూడా ఇందులో ఉండనుంది.


ఈ స్మార్ట్ వాచ్‌లో 110కి పైగా వర్కవుట్ మోడ్స్ అందించనున్నారు. రన్నింగ్, సైక్లింగ్, వాకింగ్, స్విమ్మింగ్, యోగా సహా మరెన్నో వర్కవుట్ మోడ్స్‌ను కంపెనీ ఇందులో అందించింది. దీంతోపాటు వర్కవుట్ ప్రారంభం అయితే వెంటనే దాన్ని గుర్తించే టెక్నాలజీ కూడా ఇందులో అందించారు.


24 గంటల హార్ట్ రేట్ మానిటర్, స్లీప్ ట్రాకర్, ఫిమేల్ హెల్త్ ట్రాకింగ్, బ్లడ్ ఆక్సిజన్ లెవల్స్ చెక్ చేసుకోవడం వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. వినియోగదారుడు నిద్రపోతున్నా వీటన్నిటినీ ట్రాక్ చేసేలా సెట్ చేసుకోవచ్చు. ఇక చార్జింగ్ విషయానికి వస్తే.. సాధారణంగా 14 రోజుల వరకు, పవర్ సేవింగ్ మోడ్‌లో 20 రోజుల వరకు దీని బ్యాటరీ బ్యాకప్ ఉండనుంది. మ్యాగ్నటిక్ చార్జర్ ద్వారా దీన్ని చార్జ్ చేసుకోవచ్చు. 5ఏటీయం వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.


రెడ్‌మీ నోట్ 11ఎస్ స్మార్ట్ ఫోన్ అమెజాన్‌లో అందుబాటులో ఉండనుంది. అమెజాన్‌తో పాటు ఎంఐ.కాంలో కూడా ఈ ఫోన్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. రెడ్‌మీ స్మార్ట్ బ్యాండ్ ప్రో ధర రూ.రెండు వేలలోపే ఉండే అవకాశం ఉంది.