షియోమి సబ్​బ్రాండ్​ రెడ్‌మీ తన మొట్టమొదటి ల్యాప్‌టాప్‌ను భారత మార్కెట్​లోకి లాంచ్​ చేసింది. ఈ ల్యాప్‌టాప్‌లను 'వర్క్ ఫ్రమ్ హోమ్' చేసే ఉద్యోగులకు, ఈ–లెర్నింగ్​లో విద్యాబోధన చేసే ఉపాధ్యాయలు, విద్యార్థుల కోసం ప్రత్యేకంగా డిజైన్​ చేసినట్లు రెడ్​మీ స్పష్టం చేసింది. 2019 నుంచి చైనా మార్కెట్​లో ఈ ల్యాప్​టాప్​లను విక్రయిస్తోంది. అయితే దాదాపు రెండేళ్ల తర్వాత గ్లోబల్​ మార్కెట్​లోకి వీటిని విడుదల చేసింది.




వర్క్ ఫ్రంహోం చేసే ఉద్యోగులు, ఇతర ప్రొఫెషనల్స్ కోసం రెడ్ మీ బుక్ ప్రో, ఆన్ లైన్ క్లాసులు వినే విద్యార్థులకు రెడ్ మీ ఈ-బుక్ ఈ లెర్నింగ్ ఎడిషన్ డిజైన్ చేశారు. ఈ రెండింటిలో స్పెసిఫికేషన్లు చూద్దాం..


రెడ్‌మీ బుక్ ప్రో లో 15.6-అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే ఇస్తున్నారు. విండోస్ 10 ఓఎస్‌తో పనిచేస్తుంది. సిస్సర్ మెకానిజమ్ కీ బోర్డు ఇస్తున్నారు. దీని సాయంతో యూజర్ మరింత సౌకర్యవంతంగా, సులభంగా, వేగంగా టైప్ చెయ్యొచ్చు. అలానే ఈ ల్యాప్‌టాప్‌లో 100సెంటీమీటర్ ట్రాక్‌పాడ్ అమర్చారు. ఇది విండోస్ ప్రిసెషన్ డ్రైవర్స్‌, మల్టీ-టచ్‌ ఇన్‌పుట్స్‌ని సపోర్ట్ చేస్తుంది. ఇంటెల్‌ కోర్ ఐ5 11వ జనరేషన్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది 4.4 గిగాహెడ్జ్‌ స్పీడ్‌తో ఇంటెల్ ఐరిస్‌ ఎక్స్ఈ గ్రాఫిక్స్‌ను అందిస్తుంది. 8జీబీ డీడీఆర్‌4 ర్యామ్‌ /512జీబీ ఎస్‌ఎస్‌డీ హార్డ్‌డిస్క్‌ ఇస్తున్నారు. బ్లూటూత్, వైఫై కనెక్టివిటీ, రెండు యూఎస్‌బీ 3.2 జెన్‌1, ఒక యూస్‌బీ 2.0, హెచ్‌డీఎమ్‌ఐ, గిగాబైట్ ఈథర్‌నెట్, 3.5 ఎమ్‌ఎమ్‌ ఆడియోజాక్‌ పోర్టులు ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్ కేవలం 12 సెకన్లలో బూట్ అవుతుంది. అలానే 25 సెకన్లలో రీబూట్ అవుతుందని రెడ్‌మీ తెలిపింది. ఆన్‌లైన్‌ మీటింగ్, వీడియో కాల్స్ కోసం 720 పిక్సెల్ వెబ్‌ కెమెరా ఉంది. డ్యూయల్ మైక్రోఫోన్స్, డీటీఎస్‌ ఆడియోతో రెండు  2వాట్ స్పీకర్స్ ఉన్నాయి. రెడ్‌మీ బుక్‌ ప్రో ల్యాప్‌టాప్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 గంటలు నిరంతరాయంగా పనిచేస్తుంది. 30 నిమిషాల్లో 50 శాతం, 50 నిమిషాల్లో 80 శాతం బ్యాటరీ ఛార్జ్‌ అవుతుందట. ఈ ల్యాప్‌టాప్ ధర రూ. 49,999.




రెడ్‌మీ బుక్ ఈ-లెర్నింగ్ ఎడిషన్  ల్యాప్‌టాప్ కూడా విండోస్ 10 ఓఎస్‌తో పనిచేస్తుంది. 15.6-అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఇందులో ఇంటెల్ కోర్ ఐ3 11వ జనరేషన్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. సిస్సర్ మెకానిజమ్‌ కీ బోర్డు అమర్చారు. 720 పిక్సెల్ హెచ్‌డీ వెబ్‌ కెమెరా ఇస్తున్నారు. బ్లూటూత్, వైఫై కనెక్టివిటీ, రెండు యూఎస్‌బీ 3.2 జెన్‌1, ఒక యూస్‌బీ 2.0, హెచ్‌డీఎమ్‌ఐ, గిగాబైట్ ఈథర్‌నెట్, 3.5 ఎమ్‌ఎమ్‌ ఆడియోజాక్‌ పోర్టులు ఉన్నాయి. ల్యాప్‌టాప్‌ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే పది గంటలు నిరంతరాయంగా పనిచేస్తుంది. రెండు వేరియంట్లలో ఈ ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చారు.


రెడ్​మీ భారతీయ పీసీ మార్కెట్​లోకి ప్రవేశిస్తుండటంతో ఇప్పటికే హవా కొనసాగిస్తున్న హెచ్​పి, లెనెవో, డెల్​, ఏసర్​ వంటి ప్రముఖ బ్రాండ్లకు గట్టి పోటీనివ్వనుంది.