శాంసంగ్ తన ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఏ03ఎస్‌ని మనదేశంలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి తర్వాతి వెర్షన్‌గా గెలాక్సీ ఏ04ఎస్ స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ ఫోన్ రెండర్లు, ఫీచర్లు ఇప్పుడు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.


ప్రముఖ టిప్‌స్టర్ స్టీవ్ హెమ్మర్‌స్టోఫర్ తెలిపిన దాని ప్రకారం ఈ ఫోన్‌లో ఫ్లాట్ డిస్‌ప్లేను అందించనున్నారు. ఇందులో 6.5 అంగుళాల డిస్‌ప్లే ఉండనుంది. ఈ సిరీస్ ఫోన్లు రూ.12 వేలలోపు ధరలోనే లాంచ్ అవుతాయి. కాబట్టి దీని ధర కూడా ఈ రేంజ్‌లోనే ఉండే అవకాశం ఉంది.


ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలను అందించారు. దీంతోపాటు ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. అయితే కెమెరా బంప్ మాత్రం లేదు. కెమెరా సెన్సార్లకు సంబంధించిన సమాచారాన్ని శాంసంగ్ అందించలేదు. వాల్యూమ్ బటన్లు, పవర్ బటన్ ఫోన్‌కు కుడివైపు ఉన్నాయి.


కిందవైపు స్పీకర్ అందించారు. దీంతోపాటు యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, మైక్రో ఫోన్ హోల్ కూడా ఉన్నాయి. దీని మందం 0.91 సెంటీమీటర్లుగా ఉండనుంది. శాంసంగ్ గెలాక్సీ ఏ03ఎస్‌లో 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.


ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. 13 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ మాక్రో, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌లను ఫోన్ వెనకవైపు అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 4 జీబీ వరకు ర్యామ్, 64 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.